రైతుల కోసం కనీస మద్దతు ధరల చట్టం | Minimum Support Price Act for Farmers | Sakshi
Sakshi News home page

రైతుల కోసం కనీస మద్దతు ధరల చట్టం

Sep 29 2023 3:05 AM | Updated on Sep 29 2023 3:05 AM

Minimum Support Price Act for Farmers - Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో రైతుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రతి పంటకు గిట్టుబాటు ధర కల్పించడమే లక్ష్యంగా త్వరలో కనీస మద్దతు ధర­ల చట్టం తీసుకొస్తున్నట్టు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి వెల్లడించారు. ఇలాంటి చట్టం తెస్తున్న తొలి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌ నిలవబోతోందన్నారు. ‘భారతదేశం అభివృద్ధి చెందుతున్న గ్లోబల్‌ ఫుడ్‌ హబ్‌–స్థిరమైన పంట రక్షణ పరిష్కారాల పాత్ర’ అనే అంశంపై ఢిల్లీలో గురువారం జరిగిన జాతీయ సదస్సులో మంత్రి కాకాణి మాట్లాడారు.

నాలుగేళ్లలో సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులను తీసుకొచ్చిం దన్నారు. తక్కువ పెట్టుబడితో ఎక్కువ రాబడి సాధించేలా రైతులను తీర్చిదిద్దడమే లక్ష్యంగా ఎన్నో చర్యలు చేపట్టామ­న్నా­రు. రైతును చేయిపట్టి నడిపించేందుకు గ్రామ స్థాయిలో ఏర్పాటు చేసిన ఆర్బీకే వ్యవస్థ అనతి కాలంలోనే అంతర్జాతీయ ఖ్యాతి గడిచిందన్నారు.

సర్టిఫై చేసిన నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పురుగుల మందులను ఆర్బీకేల ద్వారా రైతుల ముంగిట చేరుస్తున్నామన్నారు. పంట ఉత్పత్తులను సైతం ఆర్బీకేల ద్వారా నేరుగా వ్యవసాయ భూముల్లోనే కనీస మద్దతు ధరకు కొనుగోలు చేస్తూ రైతులకు అండగా నిలుస్తున్నామన్నారు.   

ఎక్కడా లేనివిధంగా ధరల స్థిరీకరణ నిధి 
దేశంలో ఎక్కడా లేనివిధంగా రూ.3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేశామని మంత్రి కాకాణి వెల్లడించారు. సీఎం యాప్‌ ద్వారా మార్కెట్‌ ధరలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ధర పతనమైన ప్రతిసారి మార్కెట్‌ ఇంటర్‌వెన్షన్‌ స్కీమ్‌ కింద జోక్యం చేసుకుని వ్యాపారులతో పోటీపడి మరీ కొనుగోలు చేస్తూ రైతులకు ఎమ్మెస్పీ దక్కేలా చేస్తున్నామన్నారు.

ఈ–క్రాపింగ్, యూనివర్సల్‌ కవరేజి కింద ఉచిత పంటల బీమా దేశానికే ఆదర్శంగా నిలిచాయన్నారు. బేయర్‌ క్రాప్‌ సైన్స్‌ లీడ్‌ శ్రీనివాస్‌ కరవాడి, ఫారి్మంగ్టన్‌ చీఫ్‌ ఫౌండర్‌ సంగీతా బోజప్ప, సింజెంటా ఇండియా చీఫ్‌ సస్టైనబులిటీ ఆఫీసర్‌ కైసీ రవి తదితరులు మాట్లాడుతూ.. వ్యవసాయ రంగంలో ఏపీలో తీసుకొచి్చన సంస్కరణలు, అనుసరిస్తున్న విధానాలు అద్భుతంగా ఉన్నాయన్నారు.  

Advertisement
 
Advertisement
Advertisement