మధ్యతరగతి.. అధోగతి | Middle class is struggling with debt | Sakshi
Sakshi News home page

మధ్యతరగతి.. అధోగతి

Jun 8 2025 3:28 AM | Updated on Jun 8 2025 3:55 AM

Middle class is struggling with debt

అప్పులతో సతమతం

ఏడాదిగా నిలిచిన సంక్షేమ పథకాలు 

నాడు కళకళలాడిన వ్యాపారాలు 

నేడు కూటమి పాలనలో వెలవెల 

మధ్యతరగతి ప్రజల జీవనం దుర్భరంగా మారింది. ఆర్థిక అవసరాలు రోజురోజుకూ పెరుగుతున్నా ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రయోజనం చేకూరకపోవడంతో అప్పులబాట పడుతున్నారు. ఇదే అదనుగా పల్లెల్లో మైక్రో ఫైనాన్స్‌ వ్యాపారం కోరలు చాచింది. రూ.5 నుంచి రూ.10 వరకు వడ్డీ వ్యాపారం ఇష్టారాజ్యంగా సాగుతోంది.

కూటమి ప్రభుత్వం గద్దెనెక్కి ఏడాది గడిచినా ఒక్క సంక్షేమ పథకాన్ని కూడా అమలు చేయకపోగా.. నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతుండటంతో మధ్యతరగతి వర్గాలు సతమతమవుతున్నాయి. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో ప్రతి నెలా సంక్షేమ పథకాల రూపంలో బ్యాంకు ఖాతాల్లో నగదు జమకాగా.. ప్రజలు అప్పుల వైపు వెళ్లని పరిస్థితి.  

కూటమి ప్రభుత్వం కొలువుతీరిన తర్వాత సామాన్యుడి కష్టాల తారాస్థాయికి చేరాయి. ఒకవైపు మండుతున్న నిత్యావసరాల ధరలు, మరోవైపు ప్రభుత్వ చేయూత లేకపోవడంతో ప్రజలు విలవిల్లాడుతున్నారు. సార్వత్రిక ఎన్నికల సమయంలో సూపర్‌సిక్స్‌ అంటూ హామీలు గుప్పించి అధికారంలోకి వచ్చిన తర్వాత కూటమి నాయకులు చేతులెత్తేశారు. తల్లికి వందనం అందించకుండా ఒక విద్యా సంవత్సరం, అన్నదాత సుఖీభవ సాయం ఇవ్వకుండా ఖరీఫ్, రబీ సీజన్లు గడిపేశారు.   – సాక్షి ప్రతినిధి, ఏలూరు

గత ప్రభుత్వంలో ఏటా రూ.1,850 కోట్లకు పైగా 
గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో ఏటా రూ.1,850 కోట్లకు పైగా నగదు ఏలూరు జిల్లాలో లక్షలాది మంది బ్యాంకు ఖాతాల్లో జమకాగా.. నేడు ఒక్క రూపాయి కూడా జమ కాని పరిస్థితి. కూటమి ప్రభుత్వం గత ప్రభుత్వ పథకాలకు పేర్లు, లబ్ధి నగదు మొత్తాన్ని మార్చి ప్రకటించినా అమలు చేయకపోవడం గమనార్హం. ఈ లెక్కన ఏలూరు జిల్లాలో రూ.2 వేల కోట్లకు పైగా సంక్షేమ పథకాల నగదు ప్రజల ఖాతాల్లో జమ కావాల్సి ఉంది.  

తగ్గిన కొనుగోలు శక్తి 
మార్కెట్‌లో నగదు లావాదేవీలతో పాటు ప్రజల్లో కొనుగోలు శక్తి తగ్గడంతో వ్యాపారాలు మందగించాయి. గత ప్రభుత్వ హయాంలో సంక్రాంతికి అ మ్మఒడి పథకం కింద ఏలూరు జిల్లాలో 1,78,214 మంది తల్లుల ఖాతాల్లో రూ.267.32 కోట్లు నగదు జమైతే కేవలం పండుగ రోజుల్లోనే జిల్లాలోనే రూ.150 కోట్ల నుంచి రూ.170 కోట్ల టర్నోవర్‌ జరిగినట్టు అంచనా. అయితే  ఈ ఏడాది సంక్రాంతి సీజన్‌లో 50 శాతం కూడా కొనుగోళ్లు లేవని వ్యాపార వర్గాలు అంటున్నాయి. 

గతంలో డీబీటీ పథకాలు కావడంతో మార్కెట్‌లో నగదు రోటేషన్‌లో ఉండటం, ప్రజల్లో కొనుగోలు శక్తి ఉండటంతో విక్రయాలు బాగా జరిగి వ్యాపారాలు కళకళలాడటంతో జీఎస్‌టీ ద్వారా ప్రభుత్వానికీ ఆదాయం సమకూరేది. ఈ ఏడాది మాత్రం జీఎస్‌టీ మొదలు అన్ని లావాదేవీలు తగ్గిపోయాయి. కొన్ని రోజుల్లో నూతన విద్యా సంవత్సరం ప్రారంభం కానుండగా ఇప్పటికీ తల్లికి వందనంపై కూటమి ప్రభుత్వం స్పష్టత ఇవ్వలేదు.  

అప్పులతో ఇబ్బందులు 
గతంలో మా కుటుంబానికి మూడు పథకాల కింద ఏడాదికి రూ.50 వేల వరకూ వచ్చేవి. వాటితో అప్పులు తీర్చడంతో పాటు కొంత పొదుపు చేసుకునే వాళ్లం. ఇంట్లో అవసరమైన సామగ్రిని నెలవారీ వాయిదా పద్ధతిలో తీసుకుని పథకం డబ్బులతో చెల్లించేవాళ్లం. ఇప్పుడు పొదుపు మాట అటుంచి చేసిన అప్పులు తీర్చడానికే ఇబ్బందులు పడుతున్నాం.    – గొంతిన ఝాన్సీలక్ష్మి , గృహిణి 

అవస్థలు పడుతున్నాం 
కుటుంబ అవసరాల కోసం గతంలో లేదనకుండా అప్పు ఇచ్చేవారు. ప్రభుత్వ సంక్షేమ పథ­కాల లబ్ధితో అప్పులు తీర్చేవాళ్లం. ఇప్పుడు పథకాలు అమలు చేయకపోవడంతో మాకు ఆదాయం వచ్చే దారి లేదని గ్రహించి అప్పులు ఇచ్చేవాళ్లు నిరాకరిస్తున్నారు. అవసరానికి అప్పు పుట్టక అవస్థలు పడుతున్నాం.  – పోలిశెట్టి ఈశ్వరి, ప్రైవేట్‌ స్కూల్‌ ఉపాధ్యాయురాలు  

నమ్మి మోసపోయాం  
ఎన్నికల సమయంలో చంద్రబాబు ఇచ్చిన హామీలు నమ్మి మోసపోయాం. మాలాంటి మహిళలు ఎంతో ఆశతో ఎదురు చూస్తున్న పథకాలు ఒక్కటి కూడా అమలు చేయకపోవడం బాధాకరం. రాష్ట్రంలోని మహిళల ఆవేదనను గ్రహించి ఇచ్చిన హామీలను ముఖ్యమంత్రి అమలు చేస్తారని ఆశిస్తున్నాం.  – కె.కనకదుర్గ, చిగురుకోట, ముదినేపల్లి మండలం

పథకాలన్నీ ఇవ్వాలి 
గత ప్రభుత్వంలో ఇచ్చిన పథకాలన్నీ మరలా ఇప్పుడు కూడా ఇచ్చేలా చూడాలి. వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వ హయాంలో అందించిన పథకాలు పేదలకు ఎంతో వెసులుబాటు కలిగించేవి. అవి నిలిపివేయడంతో చాలా మంది పేదలు ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటున్నారు. తిరిగి పథకాలన్నీ ప్రవేశపెట్టాలి.   – నల్గొండ నాంచారమ్మ, మండవల్లి     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement