ప్రభుత్వ ఉత్తర్వుల జారీ
సాక్షి, అమరావతి: పర్యాటక ప్రాజెక్టుల పేరుతో చంద్రబాబు ప్రభుత్వం తాజాగా ప్రైవేటు హోటళ్లకు భూములు, భారీ రాయితీల వర్షం కురిపించింది. ప్రైవేటు సంస్థలకు దీర్ఘకాల లీజులు, పన్ను మినహాయింపులు, మూలధన సబ్సిడీలతో ప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సాహకాల పారదర్శకతపై ఇప్పటికే పలు ప్రశ్నలు తలెత్తుతున్న తరుణంలో సోమవారం పర్యాటక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్జైన్ వేర్వేరుగా జారీ చేసిన ఉత్తర్వుల వివరాలు..
» విశాఖపట్నంలోని ఎండాడలో ఆస్కల్ హోటల్స్ బ్రాండ్ పేరుతో 3 స్టార్ అంతర్జాతీయ బ్రాండెడ్ హోటల్తో కూడిన కన్వెన్షన్ సెంటర్కు 0.29 ఎకరాలు కేటాయింపు. భూమిని 99 ఏళ్లు లీజుకు ఇవ్వడంతో పాటు 10 ఏళ్ల పాటు వంద శాతం ఎస్జీఎస్టీ రీయింబర్స్మెంట్ ఇవ్వనుంది. దీనితో పాటు రూ.10 కోట్ల మూలధన రాయితీలను 5 వాయిదాల్లో చెల్లించనుంది. స్టాంపు డ్యూటీ మినహాయింపు, పరిశ్రమ ధరలకే విద్యుత్ చార్జీలు, ఆస్తిపన్ను, నీటి సరఫరా చార్జీలు, మురుగునీటి పన్నులో మినహాయింపులు ఇచ్చింది.
» విశాఖపట్నంలో త్రిఫల ఆయుర్వేద బ్రాండ్ పేరుతో విజయనగర ఇన్వెస్ట్మెంట్స్, ఇన్ఫ్రా డెవలపర్ ప్రైవేట్ లిమిటెడ్ నిర్మించే ఎకో వెల్నెస్ రిసార్ట్స్కు పర్యాటక రాయితీలను ప్రభుత్వం ప్రకటించింది. ఇందులో భాగంగా పర్యాటక పాలసీ 2024–29 ప్రకారం 11ఏళ్ల పాటు ఎస్జీఎస్టీ రీయింబర్స్మెంట్తో పాటు రూ.10కోట్ల మూలధన రాయితీలను ఇస్తోంది. ఐదేళ్ల పాటు పరిశ్రమల రేటుకే విద్యుత్, రూపాయి చొప్పున ఎలక్ట్రిసిటీ డ్యూటీ రీయింబర్స్మెంట్, వందశాతం స్టాంప్డ్యూటీ రీయింబర్స్మెంట్, ఆస్తిపన్ను, నీటి చార్జీలు, మురుగు నీటి చార్జీలను పరిశ్రమల రేట్లకే ఇస్తోంది.
» గుంటూరు జిల్లా అమరావతి ప్రాంతంలో అకార్ బ్రాండ్పై వరుణ్ హాస్పిటాలిటీ ప్రైవేటు లిమిటెడ్ 5 స్టార్ హోటల్, కన్వెన్షన్ సెంటర్ నిర్మాణానికి రాయితీలు ఇచ్చింది. ఇందుకు సంబంధించి సీఆర్డీఏ ఇచ్చిన 6.5 ఎకరాల్లో 5 స్టార్ హోటల్, కన్వెన్షన్ సెంటర్ ఏర్పాటు జరగనుంది. ఇక్కడ 12 ఏళ్ల పాటు ఎస్జీఎస్టీ రీయింబర్స్మెంట్, రూ.25 కోట్లు మూలధన పెట్టుబడి రాయితీ చెల్లింపు, పరిశ్రమ రేట్లకే విద్యుత్, విద్యుత్ సుంకం, నీటి, ఆస్తి పన్ను చార్జీలు విధించనుంది. వందశాతం స్టాంప్డ్యూటీ రీయింబర్స్మెంట్ కల్పిస్తుంది.
» గతంలో విశాఖపట్నంలో మైరా బేవ్వూ్య రిసార్ట్స్ ప్రాజెక్టుకు 15 ఎకరాల భూమితో పాటు భారీగా రాయితీలు ప్రకటించింది. అయితే వాటికి అదనంగా రోడ్ల సౌకర్యం, నీరు, విద్యుత్ మౌలిక వసతుల అభివృద్ధికి రూ.16.36 కోట్లకు ప్రభుత్వ సాయాన్ని కోరింది. ఈ మేరకు ప్రభుత్వం అనుమతించింది.


