
అమరావతి, సాక్షి: వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో పని చేసిన ఉన్నతాధికారులపై కూటమి ప్రభుత్వం కక్ష సాధింపునకు దిగుతోంది. ఈ క్రమంలో.. ఏపీ సీనియర్ ఐపీఎస్ అధికారి పీఎస్ఆర్ ఆంజనేయుల్ని(PSR Anjaneyulu) అరెస్ట్ చేసింది. ముంబై నటి కేసుకుగానూ ఏపీ సీఐడీ ఆయన్ని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.
వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో పీఎస్ఆర్ ఆంజనేయులు ఇంటెలిజెన్స్ చీఫ్గా పని చేసిన సంగతి తెలిసిందే. అయితే.. ముంబై నటి జత్వానిని ఆయన వేధించారనే అభియోగాల కింద సిట్ పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్ బేగంపేట నివాసంలో అదుపులోకి తీసుకుని విజయవాడకు తరలిస్తున్నారు.
ఇదిలా ఉంటే.. నటి కాదంబరి జత్వానీ(Kadambari Jatwani) కేసులో ప్రధాన నిందితుడు ఇప్పటికే బెయిల్ మీద ఉన్నాడు. మరోవైపు.. పలువురు పోలీసు ఉన్నతాధికారుల్ని కూటమి ప్రభుత్వం ఇబ్బంది పెట్టాలని విపరీతంగా ప్రయత్నించింది. కక్ష పూరితంగా కేసులు నమోదు చేయించగా.. హైకోర్టు ఆ ఇద్దరు అధికారులకు ముందస్తు బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు పీఎస్ఆర్ను కక్ష పూరితంగా అరెస్ట్ చేయించింది.
