హైంద‌వ ధ‌ర్మానికి విస్తృత ప్రాచుర్యం: మంత్రి కొట్టు | Sakshi
Sakshi News home page

హైంద‌వ ధ‌ర్మానికి విస్తృత ప్రాచుర్యం: మంత్రి కొట్టు

Published Tue, Sep 12 2023 8:11 PM

Kottu Satyanarayana About Dharma Pracharam In Temples - Sakshi

సాక్షి, అమ‌రావ‌తి: సనాతన హిందూ ధర్మ పరిరక్షణకు నిర్వహిస్తున్న ధర్మ ప్రచార కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని ప్రధాన ఆలయాలతో పాటు 6-ఎ ఆలయాల్లోనూ నిర్వహించేందుకు నిర్ణయించినట్లు డిప్యూటీ సీఎం, రాష్ట్ర దేవదాయ శాఖ మంత్రి కొట్టు స‌త్య‌నారాయ‌ణ తెలిపారు. మంగళవారం వెల‌గ‌పూడి రాష్ట్ర స‌చివాల‌యంలో ఆయన అధ్యక్షతన ధ‌ర్మ‌ప్రచార ప‌రిష‌త్ స‌మావేశం జరిగింది.

ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ధ‌ర్మ‌ప్ర‌చారంలో భాగంగా దేవదాయ శాఖ ఆధీనంలో ఉన్న మేజ‌ర్ టెంపుల్స్ ద్వారా ధ‌ర్మ‌ ప్ర‌చార మాసోత్స‌వాలను నిర్వహిస్తున్నామని, అయితే 6-ఎ ఆల‌యాల ద్వారా కూడా ధ‌ర్మ‌ప్ర‌చార వారోత్స‌వాల‌ను నిర్వ‌హించేందుకు నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. రాష్ట్రంలోని ప్రముఖ దేవాలయాల్లో మాసోత్సవాలను గత మాసం 6న అన్నవరంలో ప్రారంభించడం జరిగిందన్నారు.

18న శ్రీకాళహస్తిలో నిర్వహించడమైనదని,  రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి  చేతుల మీదుగా ఈ నెల 16 వ తేదీన కాణిపాకం శ్రీ విఘ్నేశ్వర ఆలయంలో కూడా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. అయితే దేవాదాయ శాఖ పరిధిలో  115 వ‌ర‌కు 6-ఎ ఆల‌యాలు ఉన్నాయ‌ని  ఈ అక్టోబ‌రు నుంచి 2024 మార్చి వ‌ర‌కు ఆ 6-ఎ దేవాలయాల్లో వారోత్స‌వాల‌ను నిర్వ‌హిస్తామ‌ని తెలిపారు. 

ధ‌ర్మ‌ప్ర‌చారం కార్య‌క్ర‌మంలో భాగంగా ప్ర‌వ‌చ‌నాలు, హ‌రిక‌థ‌లు, భ‌క్తి సంగీతం, కూచిపూడి నృత్యాలు, భ‌జ‌న‌లు, కోలాటాలు, పారాయ‌ణ‌లు ఉంటాయ‌ని వివ‌రించారు. వాటితో పాటు సామూహిక ఉచిత కుంకుమ పూజ‌లు, అభిషేకాలు, స‌ర‌స్వ‌తీ హోమాలు, గోపూజ‌లు, క‌ళ్యాణోత్స‌వాలు ఏర్పాటు చేయాల‌ని అధికారుల‌ను ఆదేశించారు. అదే విధంగా న‌గ‌ర‌- గ్రామ సంకీర్త‌న, శోభాయాత్ర‌లు నిర్వ‌హించాల‌న్నారు. గ్రామాల్లోని చిన్నారుల‌కు సంప్ర‌దాయ వేషాలు, పాఠ‌శాల విద్యార్థుల‌కు పురాణ పాత్ర‌లు, భ‌గ‌వ‌ద్ఘీత‌పై వ్యాస‌ర‌చ‌న‌, వ‌క్త‌త్వం, చిత్ర‌లేఖ‌న‌ పోటీలు ఏర్పాటు చేయాల‌న్నారు.

ఆల‌యాల‌కు, భ‌క్తుల గృహాల‌కు ఆధ్యాత్మిక అనుబంధాన్ని ప‌టిష్టం చేయాల‌న్నారు. వివిధ శుభ‌కార్యాల‌కు వేదిక‌గా ఆల‌యం నిల‌వాల‌న్నారు. వారోత్స‌వాల‌ను ఏర్పాటు చేసుకుని ప్ర‌చుర‌ణ‌/ ప్ర‌సార మాధ్య‌మాలు, ఆటోలు ద్వారా విస్తృతంగా ప్ర‌చారం చేయాల‌న్నారు. స్థానిక ప్ర‌జాప్ర‌తినిధులు, ఆధ్యాత్మిక వేత్త‌లు, పండితులు, క‌ళాకారులు, స్థానిక ఆధ్యాత్మిక, సాంస్కృతిక సంస్థ‌లు, దాత‌లు, గ్రామ పెద్ద‌ల‌ను, ముఖ్యంగా యువ‌త‌ను ప్ర‌చారంలో భాగ‌స్వాముల‌ను చేయాల‌న్నారు.

ధ‌ర్మ‌ప్ర‌చార ప‌రిష‌త్ స‌భ్యులు, ఆర్జేసీ, డీసీ, ఏసీ, 6-ఎ ఆల‌య ఈవోలు, మేజ‌ర్ టెంపుల్స్ ఈవోలు ప్ర‌త్యేక స‌మావేశాల‌ను ఏర్పాటు చేసుకుని 6-ఎ ఆల‌యాల్లో కార్య‌క్ర‌మాల‌ను రూప‌క‌ల్ప‌న చేయాల‌న్నారు. ఆయా ఆల‌యాల సంప్ర‌దాయాల‌కు అనుగుణంగా ఆల‌య వైభ‌వాన్ని తెలియ‌జేస్తూ ధ‌ర్మ‌ప్ర‌చార కార్య‌క్ర‌మాలు జ‌ర‌గాల‌న్నారు. కుటుంబ, మాన‌వ, సామాజిక ధ‌ర్మాలు, విశ్వ శ్రేయ‌స్సు త‌దిత‌ర అంశాలు గురించి ప్ర‌వ‌చ‌న క‌ర్త‌లు ప్ర‌వ‌చించాల‌న్నారు.

ధ‌ర్మ‌ప్ర‌చార ర‌థం నిర్వ‌హ‌ణ‌, విధి విధానాల‌ను అధికారులంద‌రూ విధిగా పాటించాల‌ని మంత్రి కొట్టు స‌త్య‌నారాయ‌ణ సూచించారు. వారంలో రెండు, మూడు గిరిజ‌న‌, మ‌త్స్య‌కార‌, వెనుక‌బ‌డిన త‌ర‌గ‌తులు, తెగ‌లు నివ‌సించే ప్రాంతాల్లో ప్ర‌చార ర‌థం ప‌ర్య‌టించేలా చ‌ర్య‌లు చేప‌ట్టి ప్ర‌జ‌లంద‌రినీ భాగ‌స్వామ్యం చేయాల‌న్నారు. ధ‌ర్మ‌ప్ర‌చార స‌మ‌యంలో ర‌థం నిలిపిన‌చోట ఉద‌యం, సాయంత్రం స్థానిక పండితులు, జిల్లాలోని ప్ర‌ముఖ పండితుల‌తో ప్ర‌వ‌చ‌నాలు ఏర్పాటు చేసి స‌నాత‌న ధ‌ర్మ వైశిష్ట్యాన్ని బోధించాల‌న్నారు.

ధ‌ర్మ‌ ప్ర‌చార ర‌థంతో పాటు క‌నీసం ఒక వేద‌ పండితుడు, అర్‌నకుడు, ప‌రిచారికుడు, భంజ‌త్రీలు, ప‌ర్య‌వేక్ష‌కుడు, జూనియ‌ర్ అసిస్టెంట్‌, అటెండ‌ర్లు స‌హా మొత్తం 14 మంది సిబ్బందిని ఏర్పాటు చేసుకోవాల‌న్నారు. ప్ర‌తి నెలా ఆ నెల‌లో జ‌రిగే ధ‌ర్మ‌ప్ర‌చార ర‌థ యాత్ర‌కు సంబంధించిన రూట్‌మ్యాప్‌ను 1వ తేదీ నాటికే దేవాదాయ శాఖ కమిష‌న‌ర్‌కు అంద‌జేయాల‌న్నారు. యువ‌త‌లో ఆధ్యాత్మిక భావం పెంపొందించేలా కార్య‌క్ర‌మాల‌ను నిర్వ‌హించాల‌ని సూచించారు. హైంద‌వ ధ‌ర్మ‌ప్ర‌చార కార్య‌క్రమం నిరంత‌ర ప్ర‌క్రియ‌ని తెలిపారు. స‌మావేశంలో దేవదాయ శాఖ స్పెష‌ల్ సీఎస్ క‌రికాల వ‌లివ‌న్‌, రాష్ట్ర దేవాదాయ శాఖ క‌మిష‌న‌ర్ ఎస్‌.స‌త్య‌నారాయ‌ణ, వేదాంతం రాజ‌గోపాల చ‌క్ర‌వ‌ర్తి, ప‌లు ఆల‌యాల ఈవోలు, అధికారులు పాల్గొన్నారు.
చదవండి: తెలుగు రాష్ట్రాలకు ఒకేసారి ఎన్నికలు? 

Advertisement

తప్పక చదవండి

Advertisement