క్రాంతికుమార్‌ కేసులో కీలక పరిణామం | Key development in the Krantikumar case | Sakshi
Sakshi News home page

క్రాంతికుమార్‌ కేసులో కీలక పరిణామం

Jul 5 2026 5:16 AM | Updated on Jul 5 2026 5:16 AM

Key development in the Krantikumar case

తండ్రి పేరుపోగు వెంకటేశ్వరరావు నుంచి ఫిర్యాదు స్వీకరణ 

సెల్ఫీ వీడియో ఉన్న ఫోన్‌ను స్వాదీనం చేసుకున్న పోలీసులు 

ఫోరెన్సిక్‌ ల్యాబ్‌కు పంపనున్నట్లు వెల్లడి

బాధిత కుటుంబానికి  వైఎస్‌ జగన్‌ పరామర్శతో కదలిక  

లబ్బీపేట (విజయవాడ తూర్పు): ఎన్టీఆర్‌ జిల్లా విజయవాడలోని కృష్ణలంక సీఐ నాగరాజు వేధింపుల కారణంగా ఆత్మహత్య చేసుకున్న పేరుపోగు క్రాంతికుమార్‌ కేసులో శనివారం కీలక పరిణామం చోటుచేసుకుంది. వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆ కుటుంబాన్ని పరామర్శించడంతో పోలీసుల్లో కదలిక వచ్చింది. శనివారం క్రాంతికుమార్‌ తండ్రి వెంకటేశ్వరరావును నార్త్‌ ఏసీపీ సత్యానందం తన కార్యాలయానికి పిలిపించి కేసు గురించి పూర్తి వివరాలు తెలుసుకున్నారు. పోలీసులు ఇంటికి వచ్చి క్రాంతి కుమార్‌ను తీసుకెళ్లడం మొదలు.. సీఐ నాగరాజు వేధించడం వరకు అన్ని అంశాలను  వెంకటేశ్వరరావు వివరించారు. 

అనంతరం ఈ ఘటనకు సంబంధించి వెంకటేశ్వరరావు నుంచి ఏసీపీ రాత పూర్వక ఫిర్యాదు తీసుకున్నారు. క్రాంతికుమార్‌ ఆత్మహత్యకు పాల్పడే ముందు తీసుకున్న సెల్ఫీ వీడియోకు సంబంధించిన ఫోన్‌ను సైతం స్వా«దీనం చేసుకున్నారు. దానిని ఫోరెన్సిక్‌ ల్యాబ్‌కు పంపించనున్నట్లు పోలీసులు తెలిపారు. ఇప్పటికే అనుమానాస్పద మృతిగా నమోదైన కేసును ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ, హత్యా నేరం కింద కేసు నమోదు చేయాలంటూ వెంకటేశ్వరరావు పోలీసులను కోరారు.  

బాధ్యులందరిపై కేసు నమోదు చేయాలి 
తమ కుమారుడిని కావాలని వేధించి, మృతి చెందేలా సీఐ నాగరాజు వ్యవహరించారని క్రాంతికుమార్‌ తండ్రి పేరుపోగు వెంకటేశ్వరరావు మీడియాకు తెలిపారు. ఈ ఘటనపై ఇప్పటికే రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్‌కు ఫిర్యాదు చేశామని, జాతీయ ఎస్సీ కమీషన్‌కు కూడా ఫిర్యాదు చేస్తామన్నారు. సీఐ నాగరాజుతో పాటు బాధ్యులందరిపైనా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ యాక్ట్‌ కింద కేసు నమోదు చేయాలని ప్రభు­త్వాన్ని కోరారు. సీఐ నాగరాజు తీవ్రంగా వేధించడం వల్లే తన కుమారుడు ఆత్మహత్య చేసుకున్నాడని ఫిర్యాదులో పేర్కొన్నట్లు తెలిపారు. తమకు ఎవరిపైనా ఎలాంటి కక్షలు లేవన్నారు. 

ఈ కేసు దర్యాప్తును మరింత వేగవంతం చేయాలని, తమకు న్యాయం జరగకపోతే రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున పోరాటాలకు సిద్ధమవుతామని హెచ్చరించారు. కాగా, క్రాంతికుమార్‌ కుటుంబాన్ని వైఎస్‌ జగన్‌ పరామర్శించిన తర్వాతే పోలీసుల్లో కదలిక వచ్చిందని మాదిగ ఎడ్యుకేషనల్‌ ట్రస్టు బాధ్యుడు ఎ.వి.పటేల్‌ అన్నారు. ఎన్నికల్లో తాము జగన్‌ కోసం పని చేయకపోయినా, క్రాంతికుమార్‌ కుటుంబానికి అండగా నిలిచారని కొనియాడారు. చంద్రబాబు సర్కారుకు మాలలు, మాదిగలు అంటే లెక్కలేదని మండిపడ్డారు. క్రాంతికుమార్‌ కుటుంబానికి దళిత సంఘాలు, న్యాయవాదులమంతా అండగా ఉంటామని న్యాయవాది గవాస్కర్‌ తెలిపారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement