11న జేఈఈ మెయిన్స్‌ ఫలితాలు | JEE Mains‌ Results On 11th September | Sakshi
Sakshi News home page

11న జేఈఈ మెయిన్స్‌ ఫలితాలు

Sep 10 2020 3:10 AM | Updated on Sep 10 2020 3:10 AM

JEE Mains‌ Results On 11th September - Sakshi

సాక్షి, అమరావతి: ఐఐటీ, ఎన్‌ఐటీ, ఐఐఎస్‌ఈఆర్‌ తదితర జాతీయ విద్యాసంస్థల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన జాయింట్‌ ఎంట్రన్స్‌ ఎగ్జామినేషన్‌ (జేఈఈ) మెయిన్స్‌ తుది ఫలితాలు ఈనెల 11న విడుదలయ్యే అవకాశముంది. కోవిడ్‌ కారణంగా వాయిదాపడ్డ రెండో విడత జేఈఈ మెయిన్స్‌ పరీక్షలు ఈనెల 1 నుంచి 6 వరకు జరిగిన సంగతి తెలిసిందే. కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌(సీబీటీ) విధానంలో నిర్వహించిన ఈ పరీక్షలకు దేశవ్యాప్తంగా 8,58,395 మంది విద్యార్థులు నమోదు చేసుకున్నారు. రాష్ట్రంలో 82,748 మంది రిజిస్టర్‌ చేసుకోగా 52 కేంద్రాలలో పరీక్ష నిర్వహించారు. 

– జేఈఈ మెయిన్స్‌ జవాబుల ‘కీ’ని నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ మంగళవారం రాత్రి అధికారిక వెబ్‌సైట్లో పొందుపరిచింది. దీనిపై అభ్యంతరాల దాఖలుకు గురువారం వరకు ఆన్‌లైన్‌లో అవకాశం కల్పించారు. ఇందుకోసం ప్రతి ప్రశ్నకు రూ.200 చొప్పున ప్రాసెసింగ్‌ ఫీజు డెబిట్, క్రెడిట్, నెట్‌బ్యాంకింగ్‌ ద్వారా చెల్లించాలి. 
– ప్రశ్నలకు సంబంధించిన జవాబుల కీని ’జేఈఈఎంఏఐఎన్‌.ఎన్‌టీఏ.ఎన్‌ఐసీ.ఐఎన్‌’ వెబ్‌సైట్లో పొందుపర్చారు. 
– అభ్యర్థులు భవిష్యత్తు అవసరం దృష్ట్యా ప్రశ్నపత్రం, రెస్పాన్స్‌షీట్‌ను భద్రపర్చుకోవాలి. 

ప్రక్రియ మొదలైంది: రమేష్‌ పోఖ్రియాల్‌ 
జేఈఈ మెయిన్స్‌ ఫలితాలను త్వరలోనే ప్రకటించనున్నట్లు కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేష్‌పోఖ్రియాల్‌   సోషల్‌ మీడియాలో తెలిపారు. ఇందుకు సంబంధించిన ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైందని వివరించారు. 10వతేదీ వరకు అభ్యంతరాల దాఖలుకు అవకాశం కల్పించిన నేపథ్యంలో 11న  ఫలితాలు ప్రకటించే అవకాశముందని భావిస్తున్నారు. 

ఫలితాలు వెలువడ్డాక ఇలా...
 – ఫలితాలు ప్రకటించాక కటాఫ్‌ మార్కుల ఆధారంగా అర్హత సాధించిన అభ్యర్థులలో మెరిట్‌లో ముందున్న  2.50 లక్షల మందిని జేఈఈ అడ్వాన్స్‌ పరీక్షలకు అనుమతిస్తారు. వీరికి ఐఐటీల్లో ప్రవేశం కల్పిస్తారు. మిగతావారు నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ(ఎన్‌ఐటీ), గవర్నమెంటు ఫండెడ్‌ టెక్నాలజీ ఇనిస్టిట్యూట్‌(జిఎఫ్‌టిఐ) తదితర సంస్థల్లో ప్రవేశాలకు అర్హులు.
 – జేఈఈ అడ్వాన్సుకు సంబంధించి నోటిఫికేషన్‌ ఇంకా వెలువడాల్సి ఉంది. ఈ పరీక్షను ఈసారి ఢిల్లీ ఐఐటీ ఈనెల 27వ తేదీన నిర్వహించే అవకాశం ఉంది. ఇప్పటికే బ్రోచర్‌ కూడా విడుదలైంది.
 
గత ర్యాంకులను బట్టి అంచనా..
– జేఈఈ మెయిన్స్‌ కీ విడుదల కాగానే అభ్యర్థులు తమకు వచ్చిన మార్కుల ఆధారంగా ర్యాంకులను అంచనా వేసే వీలుంది. గతంలో ఏ ర్యాంకు వరకు సీట్ల కేటాయింపు చేశారో జేఈఈ వెబ్‌సైట్లోనే ఉన్నందున దీని ఆధారంగా ఒక అంచనాకు రావచ్చని నిపుణులు పేర్కొంటున్నారు. 
– క్వాలిఫైయింగ్‌ కటాఫ్‌ మార్కులు సాధించిన అభ్యర్థులు ర్యాంకుల జాబితాలో ఉంటారు. వీటిని రాష్ట్ర, ఆల్‌ ఇండియా ర్యాంకులుగా ఇస్తారు. 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement