సాయికృష్ణది ప్రీ ప్లాన్డ్ మర్డర్...
మే 8న సాయంత్రం మార్కాపురం నుంచి కృష్ణలంక పోలీస్స్టేషన్కు సాయికృష్ణ తరలింపు
గత నెల 23న బెజవాడ బందరు రోడ్డులోని ఓ హోటల్లో చిత్రహింసలు
విపరీతంగా కొట్టడంతో తీవ్ర రక్తస్రావం జరిగి చితికిపోయిన కిడ్నీలు
దీంతో పలు ఆస్పత్రుల చుట్టూ తిప్పిన పోలీసులు.. హోటల్ రూంలో ఆర్ఎంపీతో రెండు రోజులు ట్రీట్మెంట్
23వ తేదీ సాయంత్రం సాయికృష్ణ మృతి
24న ఆర్టీసీ బస్టాండ్ 43వ ప్లాట్ఫారం వద్ద మృతదేహం పారేసి అనాథ శవంగా స్వర్గపురిలో శవం దహనం
సాక్షి ప్రతినిధి, విజయవాడ, గాంధీనగర్ (విజయవాడ సెంట్రల్): కృష్ణలంకకు చెందిన యువకుడు సాయికృష్ణది లాకప్ డెత్ కానే కాదని, ఇది ముమ్మాటికీ పక్కా ప్రణాళిక ప్రకారం చేసిన హత్యే అని జైభీమ్ భారత్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు జడ శ్రావణ్కుమార్ ఆరోపించారు. విజయవాడ బందరు రోడ్డు రమేష్ హాస్పిటల్ సమీపంలోని ఓ హోటల్లో సాయికృష్ణను నిర్బంధించి చిత్రహింసలకు గురి చేసి హత్య చేశారని చెప్పారు. ఇందులో పోలీసులతోపాటు చాలా పెద్ద తలకాయలు ఉన్నాయని స్పష్టం చేశారు. ఒక ల్యాండ్ సెటిల్మెంట్ వ్యవహారమే ఈ హత్యకు కారణమని, దీనికి సంబంధించి తన వద్ద ప్రాథమిక సమాచారం ఉందని వెల్లడించారు.
సాయికృష్ణను హత్య చేసి అనాథ శవంగా చిత్రీకరించి స్వర్గపురిలో శవ దహనం పూర్తి చేశారన్నారు. ఈ మొత్తం వ్యవహారం పోలీసుల కనుసన్నల్లోనే జరిగిందన్నారు. జడ శ్రావణ్కుమార్ శుక్రవారం విజయవాడ గాంధీనగర్లోని పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ సంచలన అంశాలను వెల్లడించారు. దీనిపై సీబీఐ విచారణకు ఆదేశించాలని కోరుతూ తమ పార్టీ కాపు యువజన విభాగం అధ్యక్షుడు దాడిశెట్టి వీరబాబు ద్వారా హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేయనున్నట్లు ప్రకటించారు.
ఈ కేసు తేలాలంటే సీసీ కెమెరా ఫుటేజ్ మొత్తాన్ని భద్రపరచాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో పోలీసులు.. స్టేషన్లలో సీసీ కెమెరాలు ఉన్నాయని నిందితులను హోటళ్లలో పెట్టి కొడుతున్నారన్నారు. జైభీమ్.. అంతకు మించిన సినిమాలను తలదన్నే రీతిలో జరిగిన ఈ మొత్తం వ్యవహారంలో పోలీసు వ్యవస్థ, ఉన్నతాధికారులు పాల్గొన్నారని తెలిపారు. ఆ ఘటన జరిగిన క్రమం జడ శ్రావణ్కుమార్ మాటల్లోనే..
» గత నెల 8వతేదీన సాయంత్రం టాస్క్ఫోర్స్ సీఐ, కృష్ణలంక పోలీసు స్టేషన్ నుంచి ఇద్దరు కానిస్టేబుల్స్, ఏఎస్సై, బ్లూ కోట్ కానిస్టేబుల్ కలిసి మార్కాపురంలో మిత్రుడితో కలిసి ఒక రూంలో ఉంటున్న సాయికృష్ణను కృష్ణలంక పోలీసు స్టేషన్కు తీసుకొచ్చారు.
» ఆ రాత్రి అక్కడే ఉంచి 9వతేదీ ఉదయం స్టేషన్ నుంచి టాస్క్ఫోర్స్ కార్యాలయానికి తరలించారు.
» అక్కడ ఒక రోజు ఉంచి.. ఆ తర్వాత రమేష్ హాస్పిటల్ సమీపంలోని ప్రముఖ హోటల్కు తరలించారు. హోటల్ రూమ్ నంబరు 302లో సాయికృష్ణను చిత్రహింసలకు గురి చేశారు. పగలంతా టాస్క్ఫోర్స్ పోలీసులు, రాత్రంతా సీఐ నాగరాజు హింసించారు. సీఐ నాగరాజు పేరుమీదే హోటల్ బుక్ అయింది.
» విపరీతంగా కొట్టడం వల్ల సాయికృష్ణకు రక్తస్రావం అయ్యింది. కిడ్నీలు పగిలిపోయాయి. దవడ పగిలింది..
» సాయికృష్ణను వైద్యం కోసం 14వ తేదీన ప్రజావైద్యశాలకు తీసుకొచ్చారు. అయితే బతికే అవకాశం లేదని, ప్రైవేట్ హాస్పిటల్కు తరలించాలని అక్కడి వైద్యులు సూచించారు.
» అక్కడి నుంచి 15వతేదీన మణిపాల్ హాస్పిటల్ సివిల్ సర్జన్ వద్దకు తీసుకెళ్లారు.
» అక్కడ కూడా వైద్యుడు చేతులెత్తేయడంతో 16, 17వ తేదీలలో మళ్లీ హోటల్ రూంకు తరలించారు.
» హోటల్ రూంలో ఆర్ఎంపీతో రెండు రోజులు ట్రీట్మెంట్ చేయించారు.
» 23వ తేదీ సాయంత్రం సాయికృష్ణ చనిపోయాడు.
» డెడ్బాడీని 24వ తేదీన ఆర్టీసీ బస్టాండ్ 43వ నంబర్ ప్లాట్ఫారం వద్ద అనాథ యువకుడి శవంలా పడవేశారు.
» అనంతరం తమకు ఏమీ తెలియనట్లుగా.. బస్టాండ్లో అనాథ శవం ఉన్నట్లు వచ్చిన సమాచారంతో అక్కడికి వెళ్లి అనాథ శవాన్ని తగలబెట్టాలని టాస్క్ఫోర్స్ సీఐకి అత్యంత సన్నిహితుడైన మేనేజర్ ద్వారా వీఎంసీకి రిక్విజేషన్ ఇచ్చారు.
» అనాథ శవంగా సీఐ నాగరాజు సర్టిఫై చేసిన తర్వాత బస్టాండ్కు ఎదురుగా ఉన్న స్వర్గపురిలో ఇద్దరు కానిస్టేబుల్స్ ద్వారా 24వ తేదీన 5.45 గంటలకు సాయికృష్ణ మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించారు.
పవన్కు పదవిలో కొనసాగే అర్హత లేదు
కూటమి సర్కారు డెడ్బాడీ నో డెలివరీ ప్రభుత్వంగా పేరు సాధించిందని జడ శ్రావణ్కుమార్ ఎద్దేవా చేశారు. ప్రశ్నిస్తే, సోషల్ మీడియాలో పోస్ట్లు పెడితే నీకు జైలు జీవితం ఖరారైనట్లే అంటూ మంత్రి లోకేశ్ రెడ్ బుక్ అమలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఈ రాష్ట్రంలో న్యాయం నాలుగు పాదాల మీద కాదు.. 40 పాదాల మీద నడుస్తోందని వ్యాఖ్యానించారు. ‘సాయికృష్ణ మృతిపై హోం మినిస్టర్ మాట్లాడలేదు..! ప్రశ్నిస్తానని చెప్పిన పవన్ బాధిత కుటుంబాన్ని కలవలేదు..’ అని విమర్శించారు. చేతి గీతలు అరగదీస్తామని, యోగి ఆదిత్యనాథ్ ట్రీట్మెంట్ ఇస్తామని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పదే పదే చెబుతున్నారని గుర్తు చేశారు.
ఆదిత్య నాథ్ ట్రీట్మెంట్ అంటే ఎన్కౌంటరేనని, అక్కడ 400కిపైగా జరిగాయని, పవన్ మాటల్లో అర్థం కూడా అదేనన్నారు. పవన్ కళ్యాణ్ ఆ విధంగా మాట్లాడితే పోలీసులు అలా ఎందుకు ప్రవర్తించకుండా ఉంటారని ప్రశ్నించారు. గబ్బర్ సింగ్ సినిమా చూసే సీఐ నాగరాజు ఆ విధంగా తయారయ్యాడన్నారు. ఉప ముఖ్యమంత్రిగా పవన్కు ఒక్క క్షణం కూడా పదవిలో కొనసాగే అర్హత లేదన్నారు. ‘ఎమ్మెల్యేలు అమ్మాయిలను రేప్ చేస్తే మాట్లాడరా? ఎమ్మెల్యే అరవ శ్రీధర్ను ఢిల్లీలో పక్కన కూర్చోపెట్టుకుంటావా? నువ్వేం సనాతన ధర్మ సారధివి?’ అని మండిపడ్డారు.
కేసును నీరు గార్చే కుట్రలు
సాయికృష్ణ కేసులో ఇంత మంది పోలీసులు పాల్గొంటే కేవలం సీఐ నాగరాజు ఒక్కరిపై మాత్రమే కేసు నమోదు చేశారని జడ శ్రావణ్కుమార్ పేర్కొన్నారు. సీఐపై నమోదు చేసిన హత్య కేసును నీరు గార్చే కుట్రలో తొలి అడుగు పడిందన్నారు. మిస్సింగ్ కేసుగా నమోదు చేసి ఆధారాలు సేకరించిన తర్వాత అందులో భాగస్వాములైన వారిని చేర్చి హత్య కేసుగా మార్చాల్సి ఉండగా .. డెడ్బాడీ ఎక్కడుందో తెలియకుండా హత్య కేసుగా నమోదు చేశారన్నారు. ఇది కేసు మొత్తాన్ని నీరు గార్చే కుట్రలో భాగమేనని, ఈ కేసును సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేశారు. దీనిపై తమ పార్టీ తరపున చివరి వరకు న్యాయ పోరాటం చేస్తామని ప్రకటించారు.


