ఇంటర్‌ బదిలీల్లో ఎన్నెన్నో వింతలు | Irregularities in Principal and JL transfers | Sakshi
Sakshi News home page

ఇంటర్‌ బదిలీల్లో ఎన్నెన్నో వింతలు

Jun 25 2025 5:52 AM | Updated on Jun 25 2025 5:52 AM

Irregularities in Principal and JL transfers

ప్రిన్సిపాల్, జేఎల్‌ బదిలీల్లో అమ్ముడుపోయిన నిబంధనలు

ఆర్జేడీ కార్యాలయం నుంచి మంత్రి పేషీ వరకు చేతివాటం

250 బదిలీల్లో 200 మందిదీ దొడ్డిదారే

ప్రాంతాన్ని బట్టి రూ.3 లక్షల నుంచి 5 లక్షల వరకు వసూలు

విజయవాడలోని ఎస్‌ఆర్‌ఆర్‌ అండ్‌ సీవీర్‌ ప్రభుత్వ జూనియర్‌ కాలేజీలో (‘ఏ’ కేటగిరి) పని చేస్తున్న తెలుగు లెక్చరర్‌ను నిబంధనల ప్రకారం బదిలీపై బి లేదా సీ కేటగిరీ కాలేజీకి బదిలీ చేయాలి. కానీ ఇదే నగరంలోని వించిపేట (‘ఏ’ కేటగిరి) జూనియర్‌ కాలేజీకి బదిలీ చేశారు. ఈ లెక్చరర్‌ను ఈ నెల 9వ తేదీనే బదిలీ చేసినట్టుగా రాజమహేంద్రవరం ఆర్జేడీ ఈ నెల 18న పాత తేదీతో ఆర్డర్‌ ఇచ్చారు.

వైఎస్సార్‌ కడప జిల్లాలోని లింగాల ప్రభుత్వ జూనియర్‌ కాలేజీ బైపీసీ గ్రూప్‌లో 17 మంది విద్యార్థులున్నారు. ఇక్కడ తక్కువ మంది ఉన్నారని చెబుతూ జువాలజీ లెక్చరర్‌ను ప్రొద్దుటూరు కాలేజీకి బదిలీ చేశారు. వాస్తవానికి ప్రొద్దుటూరు కాలేజీలోని బైపీసీ గ్రూపులో ఉన్నది కేవలం ఆరుగురు విద్యార్థులే.  

సాక్షి, అమరావతి: ఇంటర్మీడియట్‌ విద్యా మండలిలో ప్రభు­త్వం ఇచ్చిన జీవోలు, ని­బంధనలకు పాత­రేసి అడ్డగోలుగా అక్ర­మాలు చేసినట్టు తెలుస్తోంది. ప్రాంతాన్ని బట్టి పోస్టుకు ‘లెక్క’గట్టి మరీ వసూలు చేసినట్టు విశ్వసనీయ సమచారం. సీనియారిటీ, పనిచేసిన స్టేషన్‌ ప్రకారం చేయాల్సిన బదిలీల్లో అర్హులను పక్కనబెట్టి దొడ్డి దారిలో తమకు కావాల్సిన వారికి నచ్చిన చోటుకు పోస్టింగ్‌ ఇచ్చారు. నాలుగు జోన్లలోనూ రీజనల్‌ జాయింట్‌ డైరెక్టర్‌ కార్యాలయాల్లో వసూళ్ల కోసం సిబ్బందిని నియమించి మరీ దందా నడిపారు. అర్హత లేకున్నా పోస్టును, ప్రాంతాన్ని బట్టి రూ.3 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు వసూలు చేసినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి.

సీనియారిటీని సైతం పట్టించుకోకుండా కీలకమైన స్థానాలను డబ్బులిచ్చిన వారితో నింపుకున్నారు. నిబంధనల ప్రకారం ఐదేళ్ల సర్వీసు పూర్తయిన వారిని తప్పనిసరిగా బదిలీ చేయాలని, రెండేళ్లు దాటిన వారికి రిక్వెస్టు బదిలీ చేయాలి. కానీ, తప్పనిసరి బదిలీల్లో సీనియరిటీ ప్రకారం భర్తీ చేయాల్సిన పోస్టుల్లో తక్కువ సర్వీసు ఉండి ‘రిక్వెస్టు’ కేటగిరీ వారితో నింపేశారు. ఇటీవల ప్రిన్సిపాళ్లు, లెక్చరర్లను 250 మందిని బదిలీ చేయగా, వారిలో 200 మంది వరకు దొడ్డిదారినే నింపేశారు. ఈ పంపకాల్లో ఆర్జేడీ కార్యాలయం నుంచి విద్యా శాఖ మంత్రి పేషీ వరకు భాగం ఉన్నట్టు చెబుతున్నారు. 

అయిన వారికే ‘ఏ’ కేటగిరీ స్థానాలు
గ్రామీణ నేపథ్యమున్న కాలేజీలను ‘సీ’ కేటగిరిగా, మున్సిపల్‌ ప్రాంతాలను ‘బి’, నగర ప్రాంతాల్లో ఉన్న కాలేజీలను ‘ఎ’ కేటగిరీలుగా విభజించారు. ప్రభుత్వ లెక్చరర్లు, ప్రిన్సిపాళ్లు అత్యధికంగా ‘ఎ’ కేటగిరీ స్థానాలనే కోరుకుంటున్నారని, దాంతో ఈసారి సీ, బీ కాలేజీలోన్లే రెగ్యులర్‌ సిబ్బందిని నియమిస్తామని వీటికి మాత్రమే వెబ్‌ కౌన్సెలింగ్‌ ఉంటుందని బోర్డు ప్రకటించింది. కానీ బదిలీల్లో మాత్రం అందుకు విరుద్ధంగా జరిగినట్టు తెలుస్తోంది.  విజయ­వాడలోని ఎస్‌ఆర్‌ఆర్‌ అండ్‌ సీవీర్‌ ప్రభుత్వ జూని­యర్‌ కాలేజీల్లో (‘ఏ’ కేటగిరి) పని చేస్తున్న తెలుగు లెక్చరర్‌కు రెండున్నరేళ్ల సర్వీసు ఉంది. ఈమె రిక్వెస్టు బదిలీ కోరుకోగా సీ కేటగిరీ కాలేజీ చూపించారు. 

ఆమె అక్కడకు వెళ్లడం ఇష్టం లేక ‘ప్రత్యేక’ మార్గంలో మధ్యవర్తులను కలవడంతో ఈ నెల 18న విజయవాడలోనే వించిపేట (‘ఏ’ కేటగిరి) జూనియర్‌ కాలేజీకి బదిలీ చేశారు. అయితే ఆమెను ఈ నెల 9వ తేదీనే బదిలీ చేసినట్టుగా పాత తేదీతో రాజమహేంద్రవరం ఆర్జేడీ ఆర్డర్‌ ఇచ్చారు. తొలుత ‘ఏ’ కేటగిరీ ప్లేస్‌­లను బ్లాక్‌ చేసిన బోర్డు అధికారులు.. ఎవరు ఎక్కువ డబ్బులిస్తే వారి కోసం ఆ పోస్టులు అమ్ముకున్నారని అర్హులు వాపోతు­న్నారు. జోన్‌ 2లోని ఒక్క వించిపేట కాలేజీలోనే 11 పోస్టులు ఉంటే 10 పోస్టులను ఇలా నింపేశారని, జోన్‌ 3లోని బాపట్లలోని ఓ కాలేజీలో 9 పోస్టులకు 7 పోస్టులు ఇలాగే చేశారని చెబుతున్నారు.

కొత్తగా అడ్మినిస్ట్రేటివ్‌ గ్రౌండ్స్‌ నిబంధన పెట్టి..
ఈసారి బదిలీల్లో కొత్తగా ‘అడ్మినిస్ట్రేటివ్‌ గ్రౌండ్స్‌’ కింద ఎవరినైనా బదిలీ చేయొచ్చన్న నిబంధనను తీసుకొచ్చారు. దీన్ని అడ్డం పెట్టుకుని వసూళ్లకు తెర లేపారు. జోన్‌ 2లో ఐదు నెలల క్రితం పదోన్నతిపై అమలాపురం బాలికల కాలేజీలో ప్రిన్సిపల్‌గా చేరిన వారు అడ్మినిస్ట్రేషన్‌ గ్రౌండ్స్‌లో ఆన్‌ డ్యూటీపై నెల రోజుల క్రితం తాడేపల్లిలోని డైరెక్టరేట్‌కు వచ్చారు. రాజమండ్రికి చెందిన ఈయన తాజా బదిలీల్లో సొంత పట్టణం సమీపంలోని కోరుకొండకు బదిలీ చేయించుకున్నారు. నెలల వ్యవధిలోనే ఈ మార్పులు జరిగిపోవడం గమ­నార్హం. 

పిఠాపురం పట్టణంలోని జూనియర్‌ కాలేజీలో సివిక్స్‌ పోస్టును ఓ సీనియర్‌ లెక్చరర్‌ ఆశించగా, వెబ్‌ కౌన్సెలింగ్‌లో ఆ ప్లేస్‌ లేదని చెప్పారు. ఆయన వేరే ప్రాంతాన్ని ఎంచుకున్న గంట వ్యవధిలోనే ఆయనకంటే జూనియర్‌కు కేటాయించారు. కాకినాడ జిల్లా కిర్లంపూడి కాలేజీలో స్ట్రెంత్‌ లేదని పోస్టులు కేటాయించేది లేదని ప్రకటించారు. కానీ సాయంత్రానికి ఓ లెక్చరర్‌ కోసం ఓపెన్‌ చేశారు. గుంటూరు పరిధిలోని నాలుగు ‘ఎ’ కేటగిరి కాలేజీల్లోని ప్రిన్సిపాళ్లకు ఐదేళ్ల సర్వీసు దాటింది. 

ఈ పోస్టుల్లో ఒకదానికి ‘సీ’ కేటగిరీలో ఉన్న దుర్గి జూనియర్‌ కాలేజీ ప్రిన్సిపల్‌ ఒకరు రావాలని దరఖాస్తు చేసుకున్నారు. త్వరలో రిటైర్‌ అవ్వనున్న ఆయనకు అన్ని అర్హతలు ఉన్నా సరే.. పోస్టింగ్‌ ఇవ్వకుండా బెల్లంకొండ కాలేజీ ప్రిన్సిపాల్‌కు ‘రిక్వెస్టు’పై ఆ పోస్టు కేటాయించారు. ఇలా మొత్తం నాలుగు జోన్లలోనూ అక్రమాలకు పాల్పడ్డారని, దీనిపై విచారణ చేయాలని విద్యాశాఖ కార్యదర్శికి ఫిర్యాదు చేసినట్టు తెలిసింది. ఈ అక్రమాలపై కొందరు బాధిత లెక్చరర్లు, ప్రిన్సిపాళ్లు హైకోర్టును ఆశ్రయించినట్టు సమాచారం.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement