Sakshi News home page

యువతరానికి దిక్సూచి ‘భవిత’

Published Wed, Mar 6 2024 5:48 AM

Industrial representatives Appreciation AP Govt for skill training: Andhra pradesh - Sakshi

ఏపీ ప్రభుత్వ నైపుణ్య శిక్షణకు పారిశ్రామిక ప్రతినిధుల ప్రశంస

విద్యార్థులు, పారిశ్రామిక ప్రతినిధులతో సమావేశం అద్భుత అంశం

పరిశ్రమలకు మానవ వనరుల్ని అందించడంలో సీఎం కృషి ఎనలేనిది

ఏపీ యువతని సానబెడితే అన్ని రంగాల్లోనూ రాణిస్తారు

స్కిల్‌ పేరుతో గత ప్రభుత్వం రూ. కోట్లని వృథా చేసింది: మంత్రి బుగ్గన

ఏపీ స్కిల్‌ ప్రోగ్రామ్‌ మా భవితని మార్చేసింది: ఉద్యోగాలు పొందిన యువత

సాక్షి, విశాఖపట్నం: రాష్ట్రంలోని యువతకు ఉపాధి, ఉద్యోగావకాశాలు కల్పించేందుకు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం చూపిస్తున్న చొర­వకు పారిశ్రామికవేత్తలు ఫిదా అయ్యారు. ‘భవిత’ పేరుతో ప్రారంభించిన స్కిల్‌ కాస్కేడింగ్‌ కార్యక్ర­మం.. యువత భవిష్యత్తుకు దిక్సూచిగా మారు­తుం­దని అభిప్రాయపడ్డారు. ఏపీలో నైపుణ్య శిక్షణ ద్వారా పరిశ్రమలకు అవసరమైన మ్యాన్‌ పవర్‌ దొరుకుతోందని.. ఇక్కడ విద్యా­ర్థుల్ని సానబెడితే అన్ని రంగాల్లోనూ రాణించగల సత్తా ఉందని సూచించారు. ఏపీ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్యక్ర­మం.. తమలాంటి ఎందరో యువతీ యువకుల జీవన స్థితిగతుల్ని మార్చేసిందని ఉద్యోగాలు పొందిన యువత ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.

నేను కోరుకున్న ఫీల్డ్‌లో స్థిరపడ్డాను
మాది విశాఖపట్నం పెదగంట్యాడ. మా నాన్న లిఫ్ట్‌ ఆపరేటర్, అమ్మ గృహిణి, నాకు ఒక సోదరి కూడా ఉంది. మేం ఇద్దరం జగనన్న ప్రభుత్వం ఇచ్చిన విద్యాదీవెన, వసతి దీవెన పథకాల ద్వారా లబ్ధిపొంది చదువుకున్నాం. నా గ్రాడ్యుయేషన్‌ పూర్తయిన తర్వాత ఆటోమేషన్‌లో స్ధిరప డాలని సీడాప్‌ ద్వారా స్కిల్‌ కాలేజ్‌లో జాబ్‌ ఓరియెంటెడ్‌ కోర్సు గురించి తెలుసుకొని రిజిస్టర్‌ చేసుకొని ట్రైనింగ్‌ తీసుకున్నాను. మాకు టెక్నికల్‌ స్కిల్స్‌తో పాటు కమ్యూనికేషన్‌ స్కిల్స్, సాఫ్ట్‌ స్కిల్స్‌ నేర్పించారు. అనేక ప్రముఖ కంపెనీలు క్యాంపస్‌ ఇంటర్వ్యూలు నిర్వహించాయి. నేను రెండు కంపెనీలలో మంచి ప్యాకేజ్‌కు ఎంపికయ్యాను. చెన్నైలోని రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ కంపెనీలో 4 రౌండ్ల ఇంటర్వ్యూ తర్వాత గ్రాడ్యుయేట్‌ ఇంజినీర్‌ ట్రైనీగా సెలక్ట్‌ అయ్యాను.  – దీపిక, గ్రాడ్యుయేట్‌ ఇంజినీర్‌ ట్రైనీ, రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ మోటర్‌ కంపెనీ, చెన్నై

స్కిల్లింగ్‌ ఎకో సిస్టమ్‌ని అభివృద్ధి చేసిన ఏపీ..    
ఏపీలో యంగ్‌ సీఎం ఉన్నారు. అందుకే యువతకి అవకాశాలు ఎక్కువగా కల్పించాలన్న ఆలోచనలతో అడుగులు వేస్తున్నారు. సింగపూర్‌లో స్కిల్లింగ్‌కి ఏజ్‌ బార్‌ లేదు. ఇక్కడ కూడా అదే జరుగుతోంది. దేశంలో స్కిల్లింగ్‌ ఎకోసిస్టమ్‌ని అభివృద్ధి చేసిన రాష్ట్రం ఆంధప్రదేశ్‌ మాత్రమే. పదిస్థాయిల్లో శిక్షణ అందించేలా స్కిల్‌ పిరమిడ్‌ను కూడా సీఎం జగన్‌ రూపొందించారు. యువతకి నైపుణ్యాన్ని పెంపొందించే ప్రోగ్రామ్‌ని కూడా తయారు చేశారు. పరిశ్రమలతో అనుసంధానం చేయడంతో వారికి కావాల్సిన సాంకేతిక నైపుణ్యం ఉన్న యువతకు ఉపాధి కల్పిస్తున్నారు.  – బుగ్గన రాజేంద్రనాథ్, రాష్ట్ర ఆర్థిక, స్కిల్‌డెవలప్‌మెంట్‌ శాఖ మంత్రి 

ప్రభుత్వం ఎంతో ప్రోత్సహిస్తోంది    
సీఎం జగన్‌ ప్రభుత్వం మా సంస్థని, పెట్టుబడుల్ని ఎంతగానో ప్రోత్సహి స్తోంది. రాష్ట్రంలో మరిన్ని పెట్టుబడులు రావాలని ఆశిస్తున్నాం. స్కిల్‌ సెక్టార్‌ కు ఇది గొప్ప అడుగు. స్కిల్‌ ఎకో సిస్టమ్‌ని అభివృద్ధి చేస్తూ అనేక కార్య­క్రమాలు నిర్వహిస్తున్న ప్రభుత్వం చర్యలకు నిజంగా అభినందనలు. కియా మోటార్స్‌ ఇండియా ఆధ్వర్యంలో స్కిల్‌ డెవలప్‌మెంట్‌ ఇన్‌స్టిట్యూట్‌ని శ్రీ సత్యసాయి జిల్లాలో ఏర్పాటు చేశాం. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ సంస్థల ద్వారా అద్భుత అవకాశాలు ఏపీలో ఉన్న యువతకు అందుతున్నాయి.    –కె.గ్వాంగ్‌లీ, కియా మోటర్స్‌ ఎండీ

కమిట్‌మెంట్‌ ఉన్న సీఎం జగన్‌        
దేశంలో ఇప్పటి వరకూ చాలా స్కిల్‌ డెవల­ప్‌ మెంట్‌ కార్యక్రమాలకు హాజరయ్యాను. ఇలాంటి క­మిట్‌­మెంట్‌ ఉన్న ప్రభుత్వాన్ని ఇంతవరకూ చూడ­లేదు. యువత ముందే పారిశ్రామికవేత్తల్ని కమిట్‌­మెంట్‌ ఇవ్వాలని చెప్పడం అద్భుతం. మా సంస్థ విమానాలు తయారు చేస్తుంది. భవిష్యత్తులో విమా­నయానంలో ఎన్నోరకాల ఉపాధి అవకాశాలున్నాయి. లెర్నింగ్‌ వింగ్స్‌ ఫౌండేషన్‌ అనే స్కిల్లింగ్‌ భాగస్వామితో పని చేస్తున్నాం. మా సంస్థ సామర్థ్యం మేరకు స్కిల్‌ ఎకో సిస్టమ్‌కు మద్దతు అందిస్తాం.    – ప్రవీణ యజ్ఞంభట్, బోయింగ్‌ ఇండియా చీఫ్‌ ఆఫ్‌ స్టాఫ్‌  

కెమికల్‌ ఇంజినీర్స్‌ అవసరం చాలా ఉంది
ఏపీ సెజ్‌ అచ్యుతాపురంలో మా సంస్థని ఏర్పాటు చేశాం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకా­రంతో ఆటమిక్‌ రీసెర్చ్‌ ఉత్పత్తుల్లో ఎంతో ఉన్నతి సాధించాం. కెమికల్‌ ప్రాసెసింగ్‌ వైపు కూడా మా సంస్థ అడుగులు వేస్తోంది. ఈ తరుణంలో మాకు కెమికల్‌ ఇంజినీర్స్‌ అవసరం ఎంతో ఉంది. నేరుగా నియామకం చేసుకోవాలని భావిస్తున్నాం. ఇందుకోసం రాష్ట్ర స్కిల్‌ డెవలప్‌ మెంట్‌ సొసైటీతో కలిసి పనిచేస్తున్నాం. విద్యార్థులకు మాకు అవసరమైన రీతిలో శిక్షణ అందించి ఉపాధి కల్పిస్తాం. పరిశ్రమలకు అవసరమైన మానవ వనరుల్ని అందించడంలో సీఎం వైఎస్‌ జగన్‌ చేస్తున్న కృషి అనిర్వచనీయం.     – కొయిచీ సాటో, టొయేట్సు రేర్‌ ఎర్త్‌ ప్రై.లి., ఎండీ

సీఎం వైఎస్‌ జగన్‌కు ధన్యవాదాలు
నేను మెకానికల్‌ ఇంజినీరింగ్‌ డిప్లొమా పూర్తిచేశాను. అప్పుడు ఏపీఎస్‌ఎస్‌డీసీ స్కిల్‌ ట్రై­నింగ్‌ ప్రోగ్రామ్‌లో 45 రోజులు శిక్షణ తీసుకు­న్నాను. శిక్షణలో నేను చాలా నేర్చుకున్నాను. మెషిన్‌ ఆపరేటింగ్, సాఫ్ట్‌స్కిల్స్, కమ్యూనికేషన్‌ స్కిల్స్‌ నేర్పారు. 2021లో ఏషియన్‌ పెయింట్స్‌ వారి ఇంటర్వ్యూలకు హాజరై ఎగ్జిక్యూటివ్‌ ట్రైనీగా ఏడాదికి రూ. 5 లక్షల ప్యాకేజ్‌లో సెలక్ట్‌ అయ్యాను. ఇప్పుడు ఎగ్జిక్యూటివ్‌గా ఏడాదికి రూ. 7.2 లక్షల ప్యాకేజీ తీసుకుంటున్నాను. మా కుటుంబానికి నేను ఇప్పుడు చాలా ఆసరాగా ఉన్నాను. ఈ విధమైన శిక్షణ ఇచ్చిన ఏపీ ప్రభుత్వానికి, సీఎంకు నా కృతజ్ఞతలు.     – భార్గవ్, విశాఖపట్నం

మానవవనరుల్లో మనమే ముందంజ..
అత్యధికంగా నైపుణ్యంతో కూడిన మానవ వనరులున్న రాష్ట్రంగా ప్రభుత్వం తీర్చిదిద్దడంతో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాల్లో ఏపీ ముందు వరసలో ఉంది. స్కిల్‌ ట్రైనింగ్‌ అనేది కేవలం ఉపాధి అవకాశాల్ని అందిస్తోంది. ఐదేళ్లలో 15 లక్షల మంది యువతకు శిక్షణ ఇవ్వగా.. 3.8 లక్షల మందికి ఉపాధి కల్పించాం. ఇంకొందరు ఔత్సాహిక పారిశ్రా­మికవేత్తలుగా రాణిస్తున్నారు.  సీఎం జగన్‌ 27 స్కిల్‌ కాలేజీలు, 192 స్కిల్‌ హబ్స్, 55 స్కిల్‌ స్కోప్స్‌ రాష్ట్రంలో ఏర్పాటు చేశారు. భవిత పేరుతో శిక్షణని అప్‌గ్రేడ్‌ చేస్తున్నాం. – సురేష్‌కుమార్, ఏపీ స్కిల్‌డెవలప్‌మెంట్‌ శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ

Advertisement

What’s your opinion

Advertisement