ఆ గంటే.. కీలకమంట | Importance of a golden hour in cyber crime | Sakshi
Sakshi News home page

ఆ గంటే.. కీలకమంట

Mar 14 2025 5:55 AM | Updated on Mar 14 2025 5:55 AM

Importance of a golden hour in cyber crime

గోల్డెన్‌ అవర్‌లో కంప్లైంట్‌తో మేలు

సైబర్‌ నేరగాళ్లను పట్టుకునేందుకు ఆ సమయమే ప్రధానం

శ్రీకాకుళం క్రైమ్‌ : గోల్డెన్‌ అవర్‌.. ఇప్పటివరకు రోడ్డు ప్రమాదాలు సంభవించేటప్పుడు మాత్రమే ఈ పదం వినుంటారు. ప్రమాదాలు సంభవించిన గంటలోపే క్షతగాత్రులను ఆస్పత్రికి చేర్చడం దీని ఉద్దేశం. ఇదే తరహాలో సైబర్‌ మోసాలకు గురయ్యే బాధితులు సైతం నేరం జరిగిన గంటలోగా ఫిర్యా దు చేయగలిగితే.. మన ఖాతాలో పోగొట్టుకున్న సొమ్మును తిరిగి రాబట్టుకునే వీలుంటుంది. బాధితులు చేయాల్సిందల్లా గోల్డెన్‌ అవర్‌లో సైబర్‌సెల్‌కు ఫిర్యాదు చేయడమే. 

నేషనల్‌ క్రైమ్‌ రికార్డ్‌ బ్యూరో (ఎన్‌సీఆర్‌బీ) ఇచ్చిన నివేదిక ప్రకారం జిల్లాలో ఇప్పటివరకు ఐదువేలలోపు సైబర్‌ నేరాలకు సంబంధించి ఫిర్యాదులు వెళ్లాయి. తాము మోసానికి గురవుతున్న నిమిషాల్లోనే ఎన్‌సీఆర్బీకి, 1930 సైబర్‌ సెల్‌ నంబర్‌కు డయల్‌ చేసి ఫిర్యాదు ఇవ్వడం వలన సుమారు రూ. 4.09 కోట్ల వరకు సేవ్‌ అయినట్లు ఈ నివేదికలు చెబుతున్నాయి. జిల్లాలో తొలిసారిగా ఐదు సైబర్‌ కేసులకు సంబంధించి రూ. 10.13 లక్షలు బాధితులకు అందించిన ట్లు ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి ఇటీవల వెల్లడించారు.  

ఫిర్యాదు చేయాలిలా.. 
» మనం మోసపోయిన క్షణానే1930 నంబర్‌కు కాల్‌ చేయాలి.  
» లేదంటే https://cybercrime.gov.in/ అనే పోర్టల్‌ను క్లిక్‌ చేయాలి. హోమ్‌పేజీలోకి వెళ్లి ఫైల్‌ ఎ కంప్లైంట్‌ ఆప్షన్‌పై క్లిక్‌ చేస్తే అక్కడ కొన్ని నియమాలు షరతులు చూపిస్తుంది. వాటిని చదివి యాక్సెప్ట్‌ చేసి రిపోర్ట్‌ అదర్‌ సైబర్‌ క్రైమ్‌ బటన్‌పై క్లిక్‌ చేయాలి.  
» తర్వాత సిటిజన్‌ లాగిన్‌ ఆప్షన్‌ సెలెక్ట్‌ చేసి పేరు, ఫోన్‌ నంబర్, ఈ–మెయిల్‌ వివరాలు ఎంటర్‌ చేస్తే రిజిస్టర్‌ మొబైల్‌ నెంబర్‌కు ఓటీపీ వస్తుంది.  
» ఓటీపీ ఎంటర్‌ చేసి క్యాప్చా కోడ్‌ను బాక్స్‌లో ఫిల్‌ చేసి సబి్మట్‌ బటన్‌ నొక్కాలి. తర్వాత పేజీలోకి తీసుకెళ్తుంది. అసలు ప్రక్రియ మొదలయ్యేది ఇక్కడే.  
» ఈ పేజీలో ఒక ఫారం కనిపిస్తుంది.. దానిలో మనకు జరిగిన సైబర్‌ మోసం గురించి రాయాలి. కాకపోతే నాలుగు సెక్షన్లుగా విభజించి ఉంటుంది. సాధారణ సమాచారం (విక్టిమ్‌ ఇన్ఫర్మేషన్‌), సైబర్‌ నేరానికి సంబంధించి సమాచారం (సైబర్‌ క్రైమ్‌ ఇన్ఫర్మేషన్‌), ప్రివ్యూ అనే సెక్షన్లు ఉంటాయి.  
» ప్రతి సెక్షన్‌లో అడిగిన వివరాలను సమర్పిస్తూ.. ప్రక్రియను పూర్తిచేయాలి. మూడు సెక్షన్లు పూర్తయ్యాక ప్రివ్యూను వెరిఫై చేయాలి. అన్ని వివ రాలు సరిగా ఉన్నాయమని భావిస్తే సబ్మిట్‌ బటన్‌ క్లిక్‌ చేయాలి.  తర్వాత ఘటన ఎలా జరిగిందనేది వివరాలు నమోదుచేయాలి. నేరానికి సంబంధించిన స్క్రీన్‌ షాట్లు (అకౌంట్‌ ట్రాన్సాక్షన్‌ తదితర) ఫైల్స్‌ వంటి ఆధారాలు, సాక్ష్యాలు అందులో పొందుపర్చాలి. వివరాలు సేవ్‌ చేసి నేరగాళ్ల గురించి ఏదైనా సమాచారం తెలిస్తే ఫిల్‌ చేయాలి.  
» అంతా వెరిఫై చేసుకున్నాక సబ్మిట్‌ బటన్‌ క్లిక్‌ చేస్తే కన్‌ఫర్మేషన్‌ మెసేజ్‌ వస్తుంది. కంప్‌లైంట్‌ ఐడీతో పాటు ఇతర వివరాలతో కూడిన ఈ–మెయిల్‌ వస్తుంది. తర్వాత అధికారులు దర్యాప్తు ప్రారంభిస్తారు.  
» ఫిర్యాదు చేయడం ఆలస్యమైతే దుండగుడు డబ్బును వేర్వేరు ఖాతాల్లో మళ్లించేస్తాడు. లేదంటే క్రిప్టో కరెన్సీగా మార్చుకునే ప్రమాదముంది.    

క్షణాల్లో ఫిర్యాదు చేయండి..  
సైబర్‌ మోసానికి గురయ్యేవారు వెంటనే గుర్తించాలి. క్షణాల్లో ఫిర్యాదు చేస్తే మన డబ్బులు వెనక్కి వచ్చే అవకాశాలెక్కువ. లేదంటే ఎక్కడ ఉంటారో.. వారి ఖాతాలు ఏ రాష్ట్రానికి చెందినవి.. ఇవన్నీ కనుక్కోవడం పెద్ద ప్రాసెస్‌. 1930కు గానీ, ఎన్‌సీఆర్‌బీకి గానీ ఫిర్యాదు చే సి బ్యాంకు వాళ్లను, దగ్గరలో ఉన్న పోలీస్‌ స్టేషన్‌ను సంప్రదించాలి.  – కేవీ మహేశ్వరరెడ్డి, ఎస్పీ  

Advertisement
 
Advertisement
Advertisement