రేపు బంగాళాఖాతంలో అల్పపీడనం
రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు 17న మరో అల్పపీడనం!
సాక్షి, విశాఖపట్నం: పశ్చిమ మధ్య, వాయవ్య బంగాళాఖాతంలో ఉత్తరాంధ్ర–దక్షిణ ఒడిశా తీర ప్రాంతంలో ఆదివారం అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. దీనిప్రభావంతో 3 రోజులు రాష్ట్రంలో వర్షాలు పడతాయని పేర్కొంది. సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని, తీరం వెంబడి గరిష్టంగా 60 కి.మీ. వేగంతో బలమైన గాలులు వీస్తాయని వెల్లడించింది.
మత్స్యకారులు మంగళవారం వరకు సముద్రంలోకి వేటకు వెళ్లవద్దని విపత్తుల నిర్వహణశాఖ కమిషనర్ కె.కన్నబాబు సూచించారు. కోస్తా, రాయలసీమల్లో శని, ఆదివారాల్లో ఉరుములు, మెరుపులతో తేలికపాటి నుంచి మోస్తరువర్షాలు కురుస్తాయని, ఒకట్రెండు చోట్ల భారీ నుంచి అతి భారీవర్షాలు పడే సూచనలున్నాయని తెలిపారు. ఈ నెల 17న ఏపీ తీరానికి సమీపంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశాలున్నాయని వాతావరణ అధికారులు తెలిపారు.