అన్నమయ్య జిల్లా: అత్తింటి ఆరళ్లకు ఓ నవ వధువు విషం తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. మంగళవారం మదనపల్లెలో చోటు చేసుకున్న ఘటనపై బాధితురాలు కుటుంబీకుల కథనం మేరకు వివరాలు..మండలంలోని ఎనుములవారిపల్లికి చెందిన సురేష్ కుమార్తె ఎం మౌనిక (20)ను పీలేరు ఇందిరమ్మ కాలనీలో నివసిస్తున్న సురేష్కు ఇచ్చి నాలుగు నెలల క్రితం వివాహం చేశారు.
మౌనిక భర్తతో చనువుగా లేదని అత్తింటివారు వేధింపులకు గురి చేయడంతో పుట్టినింటికి వచ్చేసింది. తనకు అత్తింటి వేధింపులతో పాటు భర్త దగ్గరకి చేర్చుకోవడం లేదని తల్లిదండ్రులకు తెలిపింది. వారు సర్దుకు పోవాలని చెప్పడంతో మనస్థాపం చెంది విషం తాగింది. వెంటనే బాధితురాలిని స్థానిక జిల్లా ఆస్పత్రికి తరలించి చికిత్సలు అందించడంతో కోలుకుంటోంది. తాలూకా పోలీసులు కేసు విచారణ చేస్తున్నారు.


