
రహదారులపై పోలీసులు అడ్డుకుంటుండంతో పొలాలలో నుంచి రెంటపాళ్లకు వెళ్తున్న పల్నాడు జిల్లాలోని వివిధ గ్రామాల ప్రజలు
ఆంక్షలపై దండెత్తిన జనం.. ఊరూరా జనాభిమానం
సాక్షి ప్రతినిధి, గుంటూరు: జనాభిమానం ముందు ఆంక్షలు చిన్నబోయాయి. ప్రభుత్వ పెద్దల ఆదేశాలతో పోలీసులు విధించిన నిబంధనలన్నీ కొట్టుకుపోయాయి. జనాన్ని బెదిరించి, ప్రతిపక్ష నేతను కట్టడి చేయాలనుకున్న వారి గూబ గుయ్.. మనేలా అడుగడుగునా అభిమాన జనం కేరింతలు మిన్నంటాయి. ఇసుకేస్తే రాలనంతగా.. కనుచూపు మేర జనంతో ఆ దారి జనసంద్రంగా మారిపోయింది.
ఎక్కడా జనాన్ని తరలించడం కోసం వాహనాలు పెట్టలేదు.. వారికి బిర్యానీ పొట్లాలు అందించలేదు.. పోలీసులు అడుగడుగునా అడ్డుకుంటున్నా సొంత వాహనాలపై అడ్డంకులు దాటుకుంటూ రెంటపాళ్లకు జనం పోటెత్తారు. రోడ్లపై బారికేడ్లు పెట్టి జనాన్ని రానీయకుండా పోలీసులు అడ్డుకుంటుండటంతో చాలా మంది పొలాల గుండా నడుచుకుంటూ, బైక్ల మీద తమ అభిమాన నేతను చూడటానికి తరలివచ్చారు.
కాన్వాయ్లో మూడు వాహనాలకే అనుమతి అని, రెంటపాళ్లలో వంద మందికి మించి అనుమతించబోమని నాలుగు రోజుల నుంచి పోలీసులు ఊదరగొట్టినా, పల్నాడు జిల్లా వ్యాప్తంగా 25 చోట్ల చెక్పోస్టులు పెట్టి, వందలాది మంది పోలీసులను మోహరించి.. ఆధార్ చూపిస్తేనే పంపిస్తామని ఆంక్షలు పెట్టినా, వీటన్నింటిని దాటుకుని జనసంద్రం సునామీలా ఎగసి పడింది.
పోలీసుల వేధింపులు, టీడీపీ నేతల దౌర్జన్యానికి మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకున్న పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం రెంటపాళ్ల గ్రామానికి చెందిన నాగమల్లేశ్వరరావు కుటుంబాన్ని పరామర్శించేందుకు 79 కిలోమీటర్ల దూరం ప్రయాణించేందుకు వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి ఏడున్నర గంటల సమయం పట్టిందంటే జన స్పందన ఏ స్థాయిలో ఉందో ఇట్టే అర్థమవుతోంది. సాయంత్రం ఐదు గంటలకు అక్కడికి వచ్చారు. అక్కడ కొర్లకుంట నాగమల్లేశ్వరరావు కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. పార్టీ జెండాను ఎగురవేశారు. బాధిత కుటుంబ సభ్యులతో మాట్లాడి ధైర్యం చెప్పారు.
అడుగడుగునా బ్రహ్మరథం
తాడేపల్లిలోని తన నివాసం నుంచి ఉదయం 9.40 గంటలకు బయలుదేరిన దగ్గర నుంచి ప్రజలు, వైఎస్సార్సీపీ నాయకులు, అభిమానులు అడుగడుగునా వైఎస్ జగన్కు ఘన స్వాగతం పలుకుతూ నీరాజనాలు పలికారు. ఆ తర్వాత తాడేపల్లి క్రిస్టియన్పేట, ప్రాతూరు కుంచనపల్లి అండర్పాస్, టోల్గేటు, పెదకాకాని ఆటోనగర్, ప్రత్తిపాడు నియోజకవర్గం, గుంటూరు రూరల్ మండలం, నల్లపాడు, పేరేచర్ల జంక్షన్, మేడికొండూరు, జంగంగుంట్లపాలెం, పాలడుగు అడ్డరోడ్డు, కొర్రపాడు, సత్తెనపల్లి మీదుగా రెంటపాళ్లకు చేరుకున్నారు.
అప్పటికి సాయంత్రం 5 గంటలైంది. అయినా ప్రజలు, పార్టీ శ్రేణులు, అభిమానులు జగన్ కోసం ఎదురు చూస్తూనే ఉన్నారు. వారికి భోజన ఏర్పాట్లు చేయడానికి సన్నద్ధం అయినా, పోలీసులు అభ్యంతరం చెప్పడంతో ఆగిపోయారు. దీంతో ఉదయం 11 గంటలకు వచ్చిన వారు, సాయంత్రం వరకూ ఏమీ తినకుండానే ఉండిపోయారు. ఒకదశలో రెంటపాళ్లలోకి వచ్చే వారిపై పోలీసులు లాఠీలు ఝళిపించారు. గ్రామంలో ఇళ్లలోని వారు కూడా బయటకు రాకుండా నిర్బంధించారు. అయినా ప్రజల నుంచి అనూహ్య స్పందన రావడం కూటమి నేతలను ఉక్కిరిబిక్కిరి చేస్తుండగా,
వైఎస్సార్సీపీలో కదనోత్సాహం నింపింది.