మైనారిటీలకు మస్తు ప్రయార్టీ.. రెండేళ్లలో రూ.6,000 కోట్లు | Huge Priority for Minorities In CM Jagan Govt | Sakshi
Sakshi News home page

మైనారిటీలకు మస్తు ప్రయార్టీ.. రెండేళ్లలో రూ.6,000 కోట్లు

Jun 2 2021 3:22 AM | Updated on Jun 2 2021 3:22 AM

Huge Priority for Minorities In CM Jagan Govt - Sakshi

సాక్షి, అమరావతి: రెండేళ్లలో వివిధ పథకాల ద్వారా రూ.6 వేల కోట్లకుపైగా లబ్ధి చేకూర్చి మైనారిటీల సంక్షేమం పట్ల సీఎం వైఎస్‌ జగన్‌ తన చిత్తశుద్ధిని నిరూపించుకున్నారు. నవరత్నాల ద్వారా భారీగా ఆర్థిక సాయం అందించారు. గత సర్కారు మైనారిటీల సంక్షేమాన్ని విస్మరించి తోఫాల పేరుతో మభ్యపుచ్చి ఓటు బ్యాంకు కోణంలోనే చూసింది. వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం అలాంటి గిమ్మిక్కులకు దూరంగా మైనారిటీలను పేదరికం నుంచి బయటకు తీసుకురావడమే ధ్యేయంగా నవరత్నాల ఫలాలను అందచేస్తోంది.

నాడు ఒక్కరూ లేరు..నేడు డిప్యూటీ సీఎం పదవి
టీడీపీ హయాంలో చంద్రబాబు తన మంత్రివర్గంలో ఒక్క మైనారిటీకి కూడా చోటు కల్పించలేదు. ఓటు బ్యాంకు రాజకీయాల్లో భాగంగా ఎన్నికలకు ఆరు నెలల ముందు మాత్రమే ఫరూక్‌ను మంత్రివర్గంలోకి తీసుకున్నారు. సీఎం జగన్‌ ప్రభుత్వం మైనారిటీకి ఉప ముఖ్యమంత్రి పదవితో సముచిత స్థానం కల్పించింది. రెండేళ్లలోనే నవరత్నాల ద్వారా 26.06 లక్షల మందికిపైగా మైనారిటీలకు రూ.6,009.38 కోట్ల మేర ఆర్ధిక సాయం అందించారు. ఇందులో 19.88 లక్షల మందికి నేరుగా రూ.3,374.24 కోట్లు నగదు బదిలీతో ప్రయోజనం చేకూర్చారు. నగదేతర బదిలీ పథకాల ద్వారా 6.17 లక్షల మందికి లబ్ధి కలిగింది. ఇక చంద్రబాబు హయాంలో మైనారిటీలకు బ్యాంకు రుణాలే దిక్కు కాగా అది కూడా సిఫార్సుల మేరకే సబ్సిడీ, రుణాలు మంజూరయ్యేవి. ఇప్పుడు ఎవరి సిఫార్సులతోనూ పనిలేకుండా అర్హులందరికీ నవరత్నాల ఫలాలు ముంగిట్లోనే అందుతున్నాయి.

ఇలా సాధ్యమైంది...
వివక్ష, సిఫార్సులకు తావులేకుండా అర్హులందరికీ నవరత్నాలు ఫలాలు అందించడమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. వైఎస్సార్‌ నవశకం ఇంటింటి సర్వే ద్వారా అర్హులను గుర్తించింది. రాజకీయ జోక్యం, లంచాలతో ప్రమేయం లేకుండా అర్హులైన మైనారిటీలందరికీ నవరత్నాల ప్రయోజనం దక్కింది.

Advertisement
 
Advertisement
Advertisement