మన షిప్‌యార్డు మినీ 'రత్న'o! | Hindustan Shipyard is earning a net profit of over Rs 100 crore annually | Sakshi
Sakshi News home page

మన షిప్‌యార్డు మినీ 'రత్న'o!

Apr 24 2025 4:34 AM | Updated on Apr 24 2025 4:34 AM

Hindustan Shipyard is earning a net profit of over Rs 100 crore annually

మూడేళ్లుగా లాభాలబాటలో..

రూ.19 వేలకోట్ల ఆర్డర్లతోబిజీబిజీ

త్వరలోనే మినీరత్న హోదాదక్కే అవకాశం

ఏటా రూ.100 కోట్లకుపైగా నికరలాభం ఆర్జిస్తున్న హిందుస్థాన్‌ షిప్‌యార్డు

ప్రైవేటీకరణసమయంలో వైఎస్సార్‌ చొరవతో నిలబడిన హెచ్‌ఎస్‌ఎల్‌ 

ఇండస్ట్రీ విభాగంలో దూసుకెళ్లేలా హిందుస్థాన్‌ షిప్‌యార్డు అడుగులు వేస్తోంది. దేశీయ నౌకల తయారీపై దృష్టి సారిస్తూ, అత్యుత్తమ సేవలందించేందుకు మినీరత్నగా ఆవిర్భవించనుంది. విశాఖపట్నంను కేవలం షిప్‌ రిపేర్‌ హబ్‌గా మాత్రమే కాకుండా.. షిప్‌ బిల్డింగ్‌ హబ్‌గా తీర్చిదిద్దేలా రూ.19,048 కోట్లతో 5 భారీ యుద్ధ నౌకల నిర్మాణ పనులను దక్కించుకుంది. 

నష్టాల బాటలో కొట్టుమిట్టాడిన ఈ నౌకా నిర్మాణ సంస్థ.. దివంగత వైఎస్సార్‌ చొరవతో కొత్త అవతారం ఎత్తి, ఇప్పుడు తిరుగులేని శక్తిగా అవతరిస్తోంది. ఓ వైపు దేశీయ ఆర్డర్లతో పాటు అంతర్జాతీయ నౌకల మరమ్మతులను దక్కించుకుంటూ చిన్న, మధ్య తరహా పరిశ్రమలను ప్రోత్సహిస్తోంది. – సాక్షి, విశాఖపట్నం

1941లో సింథియా షిప్‌యార్డుగా ప్రారంభం కాగా.. 1961లో సంస్థను జాతీయం చేసి హిందుస్థాన్‌ షిప్‌యార్డుగా పేరు మార్చారు. జల రవాణా మంత్రిత్వ శాఖ పరిధిలోని షిప్‌యార్డు నష్టాలతోనే నడిచి, చివరికి ఉద్యోగాలకు జీతాలివ్వలేని స్థితికి చేరుకుంది. ఈ దశలో ప్రైవేటీకరణే శరణ్యమైంది.  విషయం తెలుసుకున్న అప్పటి ముఖ్యమంత్రి, దివంగత వైఎస్‌ రాజశేఖరరెడ్డి కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంతో 2010లో రక్షణ శాఖ పరిధిలోకి షిప్‌యార్డు వచ్చింది. 

తొలినాళ్లలో ఆర్డర్లు రాక ఇబ్బందులు పడినా.. క్రమంగా ఒక్కో అవరోధాన్ని అధిగమించింది. ఎలాంటి నౌకలు, సబ్‌మెరైన్ల మరమ్మతులైనా రికార్డు సమయంలో పూర్తి చేస్తున్న హెచ్‌ఎస్‌ఎల్‌.. ఇప్పుడు ప్రధాన నౌకా నిర్మాణ కేంద్రంగా దూసుకుపోతోంది. ఐదేళ్ల కాలంలో ఏకంగా 14 ప్రాజెక్టులను పూర్తి చేసి ఆర్డర్ల పెండెన్సీని గణనీయంగా తగ్గించుకుంది. 40 నౌకల రీఫిట్‌ పనులను ఐదేళ్ల కాలంలో పూర్తి చేసి ఔరా అనిపించుకుంది. 

మినీరత్న హోదా దిశగా.. 
వరుసగా లాభాల బాటలో పయనిస్తున్న హిందుస్థాన్‌ షిప్‌యార్డు త్వరలోనే అరుదైన ఘనతని సొంతం చేసుకోనుంది. ఎలాంటి అప్పులు లేకుండా.. ఏటా లాభాలు ఆర్జించే ప్రభుత్వ రంగ సంస్థలకు అందించే మినీరత్న హోదాకు షిప్‌యార్డు పూర్తి అర్హత సాధించింది. ప్రస్తుతం దేశంలో కోల్‌కతాలోని గార్డెన్‌ రీచ్‌ షిప్‌బిల్డర్స్‌ అండ్‌ ఇంజినీర్స్‌(జీఆర్‌ఎస్‌ఈ), గోవా షిప్‌యార్డు వంటి కొన్ని సంస్థలకు మినీరత్న హోదా ఉంది. నిజానికి, 2023–24 ఆర్థిక సంవత్సరంలోనే షిప్‌యార్డు ఈ ఘనతను సొంతం చేసుకునేది. 

ఐదు ఫ్లీట్‌ సపోర్ట్‌ షిప్స్‌ నిర్మాణ పనులను తొలుత హెచ్‌ఎస్‌ఎల్‌కు ఇచ్చేందుకు రక్షణ శాఖ సిద్ధమైంది. అయితే చివరి నిమిషంలో రెండు షిప్స్‌ నిర్మాణ బాధ్యతలను ప్రైవేట్‌ సంస్థలకు అప్పగించడంతో షిప్‌యార్డు మూడింటితోనే సరిపెట్టుకుంది. ఈ కారణంగా మినీరత్న హోదా ఒక ఏడాది ఆలస్యమైంది. 40 ఏళ్ల షిప్‌యార్డు చరిత్రలో ఎన్నడూ లేనంతగా.. 2024–25 ఆర్థిక సంవత్సరంలో రూ.1,586 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. గతంతో పోలిస్తే 36 శాతం వృద్ధితో రూ.166 కోట్ల నికరలాభాన్ని పొందడంతో.. మినీరత్నగా అవతరించడం లాంఛనంగా మారింది.

వరస ఆర్డర్లతో బిజీబిజీ 
మూడు ఫ్లీట్‌ సపోర్ట్‌ షిప్స్‌(ఎఫ్‌ఎస్‌ఎస్‌) నిర్మాణానికి సంబంధించి రక్షణ మంత్రిత్వ శాఖతో హిందుస్థాన్‌ షిప్‌యార్డు ఒప్పందం కుదుర్చుకుంది. 45 మిలియన్‌ టన్నుల డిస్‌ప్లేస్‌మెంట్‌ సామర్థ్యం కలిగిన ఈ నౌకల తయారీ ప్రక్రియ ప్రారంభమైంది. ఈ నౌకల నిర్మాణాల వల్ల హెచ్‌ఎస్‌ఎల్‌ వార్షిక టర్నోవర్‌ కూడా గణనీయంగా పెరిగింది. వీటిలో ఒక షిప్‌ని జూలైలో నౌకాదళానికి అందజేసేందుకు హెచ్‌ఎస్‌ఎల్‌ సిద్ధమవుతోంది.దీంతో పాటు భారత నౌకాదళానికి చెందిన యుద్ధ నౌకలు, కార్గో షిప్స్, పోర్టు గ్రీన్‌ టగ్‌లు, కోస్ట్‌గార్డ్‌ వెసల్స్, జలాంతర్గాముల రీఫిట్, మరమ్మతుల పనులతో షిప్‌యార్డు తీరిక లేకుండా ముందుకు సాగుతోంది. 

అలాగే ఆగ్నేయాసియా దేశాలకు ప్రధాన రక్షణ ఉత్పత్తుల ఎగుమతిదారుగానూ, నౌకల తయారీ కేంద్రంగానూ ఎదగడానికి షిప్‌యార్డు ప్రణాళికలు వేస్తోంది. విదేశీ నౌకలను మరమ్మతు చేయడం ద్వారా అంతర్జాతీయ వ్యాపారాన్ని ఇది వరకే ఆకర్షించిన షిప్‌యార్డు, ఇప్పుడు విశాఖ కేంద్రంగా అంతర్జాతీయ వాణిజ్యంలో కీలక పాత్ర పోషించాలని ఆకాంక్షిస్తోంది. 2021లో 17,000 టన్నుల విదేశీ నౌకను డాక్‌ చేసి మరమ్మతులు విజయవంతంగా పూర్తి చేసింది. 

భారత్‌లో స్వదేశీ పరిజ్ఞానంతో తొలి ఓషన్‌ సరై్వలెన్స్‌ షిప్‌ (ఓఎస్‌ఎస్‌) అయిన ఐఎన్‌ఎస్‌ ధృవ్‌ను నిర్మించిన హెచ్‌ఎస్‌ఎల్‌.. 2022లో 80 శాతం స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మించిన డైవింగ్‌ సపోర్ట్‌ వెసల్స్‌ ఐఎన్‌ఎస్‌ నిస్తార్, ఐఎన్‌ఎస్‌ నిపుణ్‌ నౌకలను విజయవంతంగా అందించి తన సామర్థ్యాన్ని నిరూపించుకుంది. ఇప్పటికే 364 ఎంఎస్‌ఎంఈ వెండార్ల సహకారం తీసుకుంటున్న హెచ్‌ఎస్‌ఎల్‌.. మరిన్ని చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు చేయూతనందించేందుకు కృషి చేస్తోంది.  

ఉద్యోగులు, కార్మికుల సమష్టి కృషి 
వరుసగా లాభాల బాటలో షిప్‌యార్డు నడుస్తోందంటే దానికి కారణం ఉద్యోగులు, కార్మికులతో పాటు ఎంఎస్‌ఎంఈల సహకారమే. మినీరత్న హోదా పొందేందుకు అర్హత సాధించడం షిప్‌యార్డు చరిత్రలోనే గొప్ప రోజుగా భావిస్తున్నాం. పెరుగుతున్న ఒప్పందాలకు అనుగుణంగా.. షిప్‌యార్డును ఆధునికీకరించేందుకు సన్నద్ధమవుతున్నాం. రూ.1000 కోట్లతో యార్డుని రానున్న మూడేళ్లలో అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేశాం. 

రక్షణ మంత్రిత్వ శాఖతో కుదర్చుకున్న ఒప్పందం.. షిప్‌యార్డు భవిష్యత్‌ను మార్చబోతోంది. ఫ్లీట్‌ షిప్స్‌ తయారీ ద్వారా అనుబంధ పరిశ్రమలు, ఎంఎస్‌ఎంఈలకు కూడా సహకారం లభిస్తుంది. షిప్స్‌ తయారీలో దాదాపు 90 శాతం వరకు స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన పరికరాలు, సామగ్రిని వినియోగిస్తాం. దేశీయ నౌకల నిర్మాణంతో పాటు అంతర్జాతీయ వాణిజ్య వ్యవహారాలపైనా దృష్టి సారించాం.  – కమొడర్‌ హేమంత్‌ఖత్రి, సీఎండీ, హిందుస్థాన్‌ షిప్‌యార్డ్‌   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement