విస్తరిస్తున్న నైరుతి రుతుపవనాలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో మంగళవారం పలుచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ వెల్లడించింది. పల్నాడు, ప్రకాశం, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి, వైఎస్సార్ కడప జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు, అల్లూరి, మార్కాపురం జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తాయని... మరోవైపు ఎండలూ ఉంటాయని తెలిపింది.
శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, పోలవరం, ఏలూరు జిల్లాల్లో 42 నుంచి 43 డిగ్రీల మధ్య, అల్లూరి, విశాఖ, అనకాపల్లి, కాకినాడ, అంబేద్కర్ కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో 40 నుంచి 42 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశముందని వివరించింది. సోమవారం నెల్లూరు జిల్లా గూడూరులో 41.7 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది.
మరోవైపు, నైరుతి రుతుపవనాలు సోమవారం రాష్ట్రంలో మరికొన్ని ప్రాంతాలకు విస్తరించాయి. రెండుమూడు రోజుల్లో రుతుపవనాలు మధ్య అరేబియా సముద్రంలోని మరికొన్ని ప్రాంతాలు, మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, ఏపీ, తమిళనాడులోని మిగిలిన ప్రాంతాలకు విస్తరించడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని తెలిపింది.


