
సాక్షి, అమరావతి: తెలుగు రాష్ట్రాల్లో రానున్న మూడు, నాలుగు రోజుల పాటు పలుచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఇక, ఇప్పటికే ఏపీ, తెలంగాణలో వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాలతో రైతులకు మేలు జరగనుంది.
బంగాళాఖాతంలో రాబోయే 24 గంటల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఇప్పటికే బంగాళాఖాతం దానికి ఆనుకుని ఉన్న ఉత్తర ఒడిశా–పశ్చిమ బెంగాల్ తీరాల మీదుగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని.. అదే ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని పేర్కొంది. దీంతో పాటు మరో ద్రోణి విస్తరించి ఉందని వెల్లడించింది. వీటి ప్రభావంతో రాష్ట్రంలో వచ్చే నాలుగు రోజులు ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతవరణ శాఖ అధికారులు తెలిపారు.
వాయువ్య బంగాళాఖాతంలో రానున్న 24 గంటల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశంఉందని #apsdma ఎండీ ప్రఖర్ జైన్ వెల్లడించారు.నాలుగు రోజులు చెదురుమదురుగా పిడుగులతో కూడిన భారీ వర్షాలు,40-60కిమీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. pic.twitter.com/b65VwqYbHE
— Andhra Pradesh State Disaster Management Authority (@APSDMA) June 25, 2025
ఉత్తరాంధ్ర జిల్లాల్లో అక్కడక్కడా పిడుగులతో కూడిన భారీ వర్షాలు, 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది. గురువారం శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, తూర్పుగోదావరి, ఏలూరు జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. విశాఖపట్నం, అనకాపల్లి, డా.బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, పశ్చిమగోదావరి, కృష్ణా, ఎన్టీర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్సార్ కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో కొన్నిచోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.
మరోవైపు.. తెలంగాణలో రానున్న మూడు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరించింది. కొమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది. గంటకు 30 నుంచి 40 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీస్తాయని పేర్కొంది. ఆయా జిల్లాలకు జిల్లాలకు వాతావరణశాఖ ఎల్లో హెచ్చరికలు జారీ చేసింది. మిగతా జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.
What a Day & Night (Yesterday) in TG 🌧️🌧️
Adilabad, Karimnagar, Siddipet, Nizamabad, Nirmal, Medak, Warangal, Hanumakonda, Sircilla districts was observed Heavy to Very Heavy Rains. Still Adilabad district continuing Rains
‼️Hyd got light rains at few places in the Overnight— Weatherman Karthikk (@telangana_rains) June 26, 2025