సాక్షి, విశాఖపట్నం: వాతావరణ శాఖ కీలక ప్రకటన చేసింది. మరికొద్ది సేపట్లో విశాఖతో పాటు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షం కురవనుందని పేర్కొంది. ది. వీటితో పాటు గంటకు 50 నుండి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. ఈ నేపథ్యంలో విజయనగరం, అల్లూరి, అనకాపల్లి జిల్లాలకు రెడ్ అలెర్ట్ జారీ చేసింది.
విజయనగరం, అల్లూరి, అనకాపల్లి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అరకు, గజపతినగరం, విజయనగరం, ఎస్.కోట, కొత్తవలస, చోడవరం, నర్సీపట్నం, మాడుగుల మండలాల పరిసర ప్రాంతాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావారణ శాఖ పేర్కొంది.
భారీ స్థాయిలో ఈదురు గాలులు వీచే అవకాశం ఉన్నందునవ ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని, వర్షం పడే సమయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ చెట్ల క్రింద, విద్యుత్ స్తంభాల వద్ద నిలబడరాదని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ విజ్ఞప్తి చేశారు.


