పోలీసులు, పాలనా యంత్రాంగం తీరును ప్రశ్నిస్తూ హైకోర్టులో పిటిషన్
కంపెనీలోకి కొందరు అక్రమంగా ప్రవేశించి పనులకు ఆటంకం కలిగిస్తున్నారు
మూడు రోజులుగా ప్లాంట్ కార్యకలాపాలను అడ్డుకుంటున్నారు
దీంతో సున్నపురాయి తవ్వకాలు నిలిచిపోయి ఉత్పత్తి అగిపోయే ప్రమాదం
వేలాది మంది కార్మికుల ఉపాధికి ముప్పు
ఫిర్యాదులు చేసినా స్పందించని కలెక్టర్, ఎస్పీ
ఈ పరిస్థితుల్లో జోక్యం చేసుకుని పోలీసులకు తగిన ఆదేశాలివ్వండి
హైకోర్టులో భారతి సిమెంట్స్ డైరెక్టర్ బాలాజీ పిటిషన్
సాక్షి, అమరావతి: చంద్రబాబు ప్రభుత్వ కక్ష సాధింపు చర్యలపై భారతి సిమెంట్ కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్ (బీసీసీపీఎల్) న్యాయ పోరాటానికి దిగింది. అధికార పార్టీకి చెందిన కమలాపురం ఎమ్మెల్యే పుత్తా కృష్ణచైతన్య రెడ్డి తన అనుచరుల ద్వారా మైనింగ్ కార్యకలాపాలు అడ్డుకుంటున్నా కనీస స్థాయిలో కూడా స్పందించకుండా చోద్యం చూస్తున్న అధికారులు ముఖ్యంగా పోలీసుల ఉదాసీనతపై హైకోర్టును ఆశ్రయించింది.
టీడీపీ గుండాలు గత మూడు రోజులుగా రేయింబవళ్లు తిష్టవేసి సున్నపురాయి తవ్వకాలను అడ్డుకుంటూ, తద్వారా ఉత్పత్తిని ఆపి కంపెనీని దెబ్బ తీసేందుకు చేస్తున్న ప్రయత్నాలపై హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. తమ సిమెంట్ ప్లాంట్ కార్యకలాపాలను మొత్తం అడ్డుకుంటున్న వారిపై ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోవడం లేదని, తమ ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసేలా పోలీసులను ఆదేశించాలని కోరుతూ భారతి సిమెంట్స్ అధీకృత ప్రతినిధి, డైరెక్టర్ జి.బాలాజీ ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేశారు.
కోర్టు ఆదేశాలను ధిక్కరిస్తున్నారు
‘భారతి సిమెంట్ కంపెనీ వైఎస్ఆర్ కడప జిల్లా నల్లలింగాయపల్లె వద్ద సిమెంట్ తయారీ ఫ్యాక్టరీ, సున్నపురాయి గనిని నిర్వహిస్తోంది. కంపెనీ మ్యాన్పవర్ కాంట్రాక్టర్ అయిన ‘మెసర్స్ వైష్ణవి అసోసియేట్స్’ ద్వారా పనుల్లోకి వచి్చన 10 మంది కాంట్రాక్ట్ కార్మికులు ఈ ఏడాది ఫిబ్రవరిలో కంపెనీ నిర్వహించిన క్రీడా పోటీలలో తీవ్ర గొడవలు సృష్టించారు. దీనిని తీవ్ర క్రమశిక్షణారాహిత్యంగా పరిగణించిన కాంట్రాక్టర్ వారిని పని నుంచి తొలగించారు. సస్పెండ్ అయిన కార్మికులు ఫ్యాక్టరీ వద్ద గొడవలు చేస్తామని బెదిరించడంతో, కంపెనీ యాజమాన్యం పోలీసుల రక్షణ కోరింది.
అయినా కూడా పోలీసులు పట్టించుకోలేదు. దీంతో ఏప్రిల్ 28న భారతి సిమెంట్స్ కమలాపురం జూనియర్ సివిల్ కోర్టులో సస్పెండ్ అయిన 10 మంది కాంట్రాక్ట్ కార్మికులకు వ్యతిరేకంగా దావా వేసింది. విచారణ జరిపిన కోర్టు తాత్కాలిక ఇంజంక్షన్ ఉత్తర్వులు ఇచి్చంది. సస్పెండ్ అయిన కార్మికులు లేదా వారి అనుచరులు ఫ్యాక్టరీ కార్యకలాపాలకు, వాహనాల రాకపోకలకు ఆటంకం కలిగించకూడదని స్పష్టం చేసింది. అయినప్పటికీ, ప్రతిరోజూ 25–30 మంది వ్యక్తులు సస్పెండ్ అయిన కార్మికులతో కలిసి సిమెంట్ ప్లాంట్కు వెళ్లే ఏకైక రహదారిని ట్రాక్టర్లు, వాహనాలు అడ్డంగా పెట్టి దిగ్బంధిస్తున్నారు. దీంతో గని నుండి లైమ్స్టోన్, ఫ్యాక్టరీ నుండి సిమెంట్ రవాణా పూర్తిగా నిలిచిపోయింది.
రోజుకు 400 ట్రక్కులు తిరుగుతుండగా, ఇప్పుడు ఒక్క ట్రక్కు కూడా తిరిగే పరిస్థితి లేదు. దీంతో కంపెనీకి రోజుకు సుమారు రూ.4 కోట్లకు పైగా నష్టం వాటిల్లుతోంది. భారతి సిమెంట్ తయారీ కేంద్రంలో ఉన్న ప్రస్తుత సున్నపురాయి నిల్వలు ఇకపై ఫ్యాక్టరీ కార్యకలాపాలను కొనసాగించడానికి సరిపోవు. పోలీసుల ఉదాసీతన కారణంగా ప్లాంట్ పూర్తిగా మూతపడే ప్రమాదం పొంచి ఉంది. ఇది కంపెనీకి మరింత ఆర్థిక నష్టాన్ని కలిగిస్తుండటమే కాకుండా, అక్కడ పనిచేస్తున్న వందలాది మంది ఉద్యోగులు, కార్మికుల జీవనోపాధికి తీవ్రమైన ముప్పును కలిగిస్తోంది’ అని పిటిషనర్ పేర్కొన్నారు.
అధికారం ఉన్నా.. కలెక్టర్ స్పందించడం లేదు
‘జిల్లాపై పూర్తి అధికార పరిధి కలిగిన ఎగ్జిక్యూటివ్ మేజి్రస్టేట్ అయిన జిల్లా కలెక్టర్, ఇలాంటి అత్యవసర పరిస్థితుల్లో ’భారతీయ నాగరిక్ సురక్ష సంహిత’ (బీఎన్ఎస్ఎస్) లోని సెక్షన్ 163 ప్రకారం తగిన ఉత్తర్వులు జారీ చేయవచ్చు. చట్టబద్ధంగా ఉపాధి పొందుతున్న వ్యక్తులకు ఆటంకం, ఇబ్బంది కలగకుండా నిరోధించడానికి, ప్రాణాలకు, భద్రతకు ప్రమాదం కలగకుండా, ప్రజల ప్రశాంతతకు భంగం వాటిల్లకుండా, తిరుగుబాటు, గొడవలు జరగకుండా నిరోధించేందుకు నిర్దిష్ట చర్యలకు దూరంగా ఉండాలని ఆదేశించే అధికారం కూడా కలెక్టర్కు ఉంది. అయితే అధికారాన్ని ఉపయోగించాల్సిన పరిస్థితులు నెలకొని ఉన్నా కూడా కలెక్టర్ ఏ మాత్రం స్పందించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు.’ అని పిటిషనర్ హైకోర్టుకు నివేదించారు.
ఎస్పీ ఫిర్యాదును తీసుకోవడానికే నిరాకరించారు
‘సస్పెండ్ అయిన కార్మికులు, ఇతరులు కలిసి కంపెనీ జీఎం (మైన్స్) కె.సుధాకర్, సెక్యూరిటీ ఆఫీసర్ జి. వెంకటయ్యలపై భౌతిక దాడికి పాల్పడ్డారు. అటు తరువాత కూడా భారీ మూక ప్లాంట్ వద్దకు చేరింది. ఈ పరిస్థితుల్లో భారతి సిమెంట్స్ కంపెనీ ప్రతినిధులు కమలాపురం సీఐ, కడప డీఎస్పీ, లిఖితపూర్వక ఫిర్యాదులు చేశారు. ఎస్పీ ఫిర్యాదును స్వీకరించడానికే నిరాకరించారు. దీంతో ఆయనకు ఈ మెయిల్ ద్వారా ఫిర్యాదు పంపాం. ఫిర్యాదులు చేసినప్పటికీ, పోలీసులు సదరు మూకను చెదరగొట్టడం గానీ, వారిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయడం గానీ చేయలేదు. ఈ నేపథ్యంలో విధి పరిస్థితుల్లో హైకోర్టును ఆశ్రయించాల్సి వచి్చంది. అందువల్ల ఈ వ్యవహారంలో జోక్యం చేసుకుని పోలీసులకు తగిన ఆదేశాలు ఇవ్వండి.’ అని బాలాజీ తన పిటిషన్లో అభ్యరి్థంచారు.
హైకోర్టుకు అభ్యర్థనలు
⇒ కంపెనీ ప్రాంగణంలో చట్టవిరుద్ధంగా గుమిగూడిన వారిపై తక్షణమే చట్ట ప్రకారం చర్యలు తీసుకునేలా ఆదేశాలు జారీ చేయాలి.
⇒ ముందస్తు భద్రతను ఏర్పాటు చేసేలా కూడా తగిన ఆదేశాలు ఇవ్వాలి.
⇒ మేము ఇచ్చిన ఫిర్యాదుపై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడాన్ని చట్టవిరుద్ధంగా, రాజ్యాంగ విరుద్ధంగా ప్రకటించాలి.
⇒ కంపెనీలోకి అక్రమంగా ప్రవేశించిన వారు కలిగిస్తున్న ఆటంకాలను తొలగించి, వారిని ఆ ప్రాంగణం నుండి ఖాళీ చేయించేలా ఆదేశాలివ్వాలి.
⇒ తద్వారా సిమెంట్ ప్లాంట్లో చట్టబద్ధమైన వ్యాపారాన్ని కొనసాగించేలా, ప్లాంట్ ప్రాంగణంలో సాధారణ కార్యకలాపాలను పునరుద్ధరించేలా ఆదేశించాలి.
⇒ ఈ మొత్తం వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి, బాధ్యులపై చట్టప్రకారం తగిన చర్యలు తీసుకునేలా ఆదేశించాలి.


