
ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న నారాయణ
మోపిదేవి (అవనిగడ్డ): రుణం ఇచ్చిన ప్రైవేటు బ్యాంక్ వేధింపులు తాళలేక ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. కృష్ణాజిల్లా, మోపిదేవి మండలం ఉత్తరచిరువోలులంక గ్రామంలో ఈ ఘటన శనివారం రాత్రి చోటుచేసుకుంది. బాధిత కుటుంబ సభ్యుల కథనం ప్రకారం, గ్రామానికి చెందిన విశ్వనాథపల్లి వెంకటనారాయణకు జిల్లా కేంద్రమైన మచిలీపట్నంలోని ఒక ప్రైవేట్ బ్యాంక్ ఎనిమిది నెలల క్రితం రూ.4లక్షల రుణం మంజూరు చేసింది. ఈ సందర్భంగా వెంకటనారాయణ నుంచి రెండు ఖాళీ చెక్కులను తీసుకున్న బ్యాంక్ ప్రతినిధులు రూ.2.70 లక్షలు మాత్రమే లబి్ధదారుకు అందించారు.
రుణం ఇచ్చే ముందు ప్రాసెసింగ్, ఇన్సూరెన్స్ ఫీజులకు రూ.50 వేలు ఖర్చవుతుందని చెప్పారు. అయితే రూ.1.30 లక్షలు మినహాయించుకున్నారు. అప్పటి నుంచి ఆరు నెలలు దాదాపు రూ.12 వేల చొప్పున వెంకటనారాయణ కిస్తీ చెల్లిస్తున్నాడు. రెండు నెలలుగా ఆర్థిక ఇబ్బందులతో కిస్తీలు చెల్లించలేదు. దీంతో బ్యాంకు ప్రతినిధులు శనివారం సాయంత్రం నారాయణ ఇంటికి వెళ్లి తీసుకున్న రుణం మొత్తం చెల్లించాలని పట్టుపట్టారు.
రుణం రూ.4 లక్షలు, వడ్డీ కలిపి రూ.8 లక్షలు చెల్లించాల్సిందేనని భీషి్మంచారు. కొంత సమయం ఇస్తే బాకీ తీర్చేస్తానని వెంకటనారాయణ ప్రాథేయపడ్డారు. అయినా వారు పట్టించుకోకపోవడంతో పాటు ఇంట్లో సామాగ్రి, ఇల్లు కలిపి వేలం వేస్తామని, ఊరిలో దండోరా వేయిస్తామని హెచ్చరించారు. దీనితో తీవ్ర మనోవేదనకు గురైన నారాయణ మొక్కల నివారణకు వాడే కలుపు మందుతాగాడు. వెంటనే కుటుంబ సభ్యులు 108లో అవనిగడ్డ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఆస్పత్రికి వచ్చి వివరాలు సేకరించారు.