ఘనంగా తిరుపతి పుట్టినరోజు వేడుకలు

Grand Tirupati Birthday Celebrations Andhra Pradesh - Sakshi

నగరంలో శోభాయమానంగా ఆధ్యాత్మిక యాత్ర

గోవిందనామ స్మరణతో మార్మోగిన తిరుపతి

సాక్షి, తిరుపతి: తిరుపతి నగరం 893వ జన్మదిన వేడు­కలను శుక్రవారం ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి, టీటీడీ, కార్పొరేషన్‌ ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా నిర్వహించారు. ఉదయం ఎమ్మెల్యే భూ­మ­న శ్రీ ఆంజనేయస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, పట్టువస్త్రాలను ఊరేగింపుగా తీసుకొచ్చి శ్రీ గోవిందరాజుస్వామికి సమర్పించా­రు.

శ్రీ గోవిందరాజస్వామి ఆలయం వద్ద అర్చకు­లు, జీయర్‌స్వాముల ఆశీస్సులు తీసుకుని శోభాయాత్రను ప్రారంభించారు. వేదపండితుల మంత్రోచ్ఛారణలు, మంగళ వాయిద్యాలు, భజన మండళ్ల కళాప్రదర్శనల నడుమ ఆధ్యాత్మికయాత్ర శోభాయమానంగా సాగింది. టీటీడీ హిందూ ధర్మప్రచార పరి­షత్‌ ఆధ్వర్యంలో కళాకారులు నిర్వహించిన చెక్క భజనలు, కోలాటాలు, కళా ప్రదర్శనలు ఆక­ట్టుకున్నాయి.

స్వామి భక్తులు పౌరాణిక వేషధార­ణలో భక్తిప్రపత్తులు చాటుకున్నారు. కనులపండువ­గా సాగిన యాత్ర ఆద్యంతం.. గోవిందనామ స్మరణ­తో తిరుపతి పులకించిపోయింది. తమ నగరం పుట్టినరోజును పురస్కరించుకుని నగరాన్ని పచ్చతోరణాలతో అలంకరించారు. పూలు చల్లు­తూ, పసు­పు నీళ్లు వారబోస్తూ శోభాయాత్రను స్వా­గ­­తించారు.

గుమ్మడి కాయలతో దిష్టితీస్తూ, కర్పూర హారతులు పడుతూ భక్తిని చాటుకున్నారు. జగద్గు­రు శ్రీ రామానుజాచార్యుల చిత్రపటాలను ప్రదర్శిస్తూ ప్రజలు సమతాస్ఫూర్తి ప్రచారకర్తలై ముం­దుకు సాగారు. పుణ్యక్షేత్ర జన్మదిన వేడుకలు ఏటా కొనసా­గాల­ని జీయర్‌స్వాములు ఆకాంక్షించారు.

భగవంతుడి అనుగ్రహంతోనే.. 
ఈ సందర్భంగా ఎమ్మెల్యే కరుణాకరరెడ్డి మాట్లాడుతూ తిరుపతి ఎంతో పవిత్రమైందని చెప్పారు. గోవిందరాజుస్వామిని ముక్కోటి దేవతలు పూజిస్తారన్నారు. శ్రీ మహావిష్ణువే శ్రీ వేంకటేశ్వరస్వామి అవతారంలో స్వయంభువు­గా వెలిసిన మహాపుణ్యక్షేత్రమిదని తెలిపారు. దైవసమానులైన సమతామూర్తి శ్రీ రామానుజాచార్యులు 1130 ఫిబ్రవరి 24వ తేదీన శంకుస్థాపన చేసిన ప్రాంతమని చెప్పా­రు.

ప్రపంచంలో వ్యక్తులకు మాత్రమే జన్మదిన వేడుకలు జరుగుతాయని, అయితే ఓ ప్రాంతానికి జన్మ­దిన వేడుకలు జరగడమంటే ఒక్క తిరుపతికి మాత్రమేనని పేర్కొన్నారు. ఆ భగవంతుడి అనుగ్రహం వల్లే తాను ఇలాంటి మహోన్నత కార్యక్రమాన్ని చేస్తున్నానని, ఇది పూర్వజన్మ సుకృతమని చెప్పారు. తిరుపతి ప్రాభవాన్ని కాపాడుకోవాలని ఆ­యన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో తిరుపతి మేయ­ర్‌ డాక్టర్‌ శిరీష, డిప్యూటీ మేయర్లు భూమన అభినయ్‌రెడ్డి, ముద్ర నారాయణ తదితరులు పాల్గొన్నారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top