
ప్రభుత్వ దుర్నీతిపై మండిపడ్డ వైఎస్సార్సీపీ
విధిలేక జీవో ఉపసంహరించిన ప్రభుత్వం
ప్రభుత్వ పెద్దల నిర్వాకానికి అధికారులను బలిచేసే యోచన.. సీఎం చంద్రబాబు ఆదేశాలతోనే జీవో జారీ
పన్నాగం బెడిసికొట్టడంతో డైవర్షన్ రాజకీయం
హోంశాఖ కార్యదర్శిపై త్వరలో బదిలీవేటు!
ప్రజల్ని తప్పుదారి పట్టించేందుకు చంద్రబాబు ఎత్తుగడ
సాక్షి, అమరావతి: కాపు సామాజిక వర్గంపై రెడ్బుక్ కుట్రకు తెగబడిన చంద్రబాబు ప్రభుత్వం.. 24 గంటల్లోనే తోకముడిచింది. టీడీపీ కూటమి ప్రభుత్వ కుతంత్రంపై యావత్ కాపు సామాజిక వర్గం భగ్గుమనడం.. కాపు సామాజిక వర్గానికి మద్దతుగా వైఎస్సార్సీపీ పోరుబాట పడతామని ప్రకటించడంతో చంద్రబాబు సర్కారు విధిలేక వెనక్కి తగ్గింది. కాపులను బీసీల్లో చేర్చాలన్న ఉద్యమం సందర్భంగా చోటుచేసుకున్న తుని ఘటనపై నమోదు చేసిన కేసులను తిరగదోడాలన్న నిర్ణయాన్ని ప్రభుత్వం ఉపసంహరించుకుంది.
కాపు ఉద్యమకారులపై కోర్టు కొట్టేసిన కేసులను తిరగదోడుతూ సోమవారం జారీచేసిన జీవోను ఉపసంహరిస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. కాగా.. ప్రభుత్వ ముఖ్యనేత, మంత్రి ఆదేశాలతో జారీ చేసిన ఈ జీవోపై ప్రజల్ని తప్పుదారి పట్టించేందుకు డైవర్షన్ రాజకీయాలకు తెరతీసింది. కేవలం హోం శాఖ ఉన్నతాధికారిపై నెపం నెట్టేసి తాను తప్పించుకునేందుకు ముఖ్యనేత ఇప్పటికే నిర్ణయించడం గమనార్హం.
భగ్గుమన్న కాపు సామాజిక వర్గం
అధికారంలోకి వచ్చేశాం కాబట్టి మరోసారి కాపు సామాజిక వర్గాన్ని వేధించాలన్న చంద్రబాబు కుతంత్రం బెడిసికొట్టింది. టీడీపీ కూటమి దుర్నీతిపై కాపు సామాజిక వర్గం భగ్గుమంది. కాపులను బీసీల్లో చేర్చాలన్న ఉద్యమం సందర్భంగా 2016లో తుని ఘటనపై అప్పటి టీడీపీ ప్రభుత్వమే అక్రమ కేసు నమోదు చేసింది. అనంతరం వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఆ కేసును ఉపసంహరించింది.
మరోవైపు విజయవాడ రైల్వే న్యాయస్థానం ఆ కేసును కొట్టివేసింది. అయినా గత ఏడాది అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రభు త్వం కాపు సామాజిక వర్గంపై కక్ష సాధింపునకు ఆ కేసును తిరగదోడాలని నిర్ణయించింది. సాక్షాత్తు రైల్వే న్యాయస్థానం కొట్టివేసిన కేసులో పునర్విచారణ కోరుతూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయాలని ఆదేశించింది. అందుకు పబ్లిక్ ప్రాసిక్యూటర్కు అనుమతిస్తూ హోం శాఖ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది.
దాంతో చంద్రబాబు ప్రభుత్వ కుట్ర బట్టబయౖలెంది. ప్రభుత్వ పన్నాగంపై కాపు సామాజిక వర్గం తీవ్రస్థాయిలో స్పందించింది. 2014 ఎన్నికల్లో తమను వాడుకుని వదిలేసినట్టే.. 2024ఎన్నికల్లో కూడా తమను ఉప యోగించుకుని ప్రస్తుతం కరివేపాకులా తీసిపారేయడం పట్ల ఆ వర్గం నేతలు విరుచుకుపడ్డారు. కూటమి కక్షసాధింపు చర్యలకు వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమిస్తామని ప్రకటించారు.
బలిపీఠంపై హోం శాఖ కార్యదర్శిని నెట్టి..
ప్రభుత్వంపై వెల్లువెత్తిన వ్యతిరేకతతో చంద్రబాబు బెంబేలెత్తారు. తమ కుట్రను కొనసాగిస్తే ఎన్నికలకు ముందే తమ పుట్టి మునుగుతుందని గ్రహించారు. పన్నాగం బెడిసికొట్టడంతో సీఎం చంద్రబాబు తాను తప్పించుకునేందుకు మరోసారి తనదైన డైవర్షన్ రాజకీయాలతో కనికట్టు చేసేందుకు సిద్ధపడ్డారు. తుని ఘటనపై నమోదు చేసిన అక్రమ కేసును కొట్టివేసిన తీర్పును సవాల్ చేయడం.. ఆ కేసును పునరి్వచారణకు సిద్ధపడటం అత్యంత కీలకమైన అంశమే కాదు.. అంతకుమించి అత్యంత సున్నితమైన వ్యవహారం.
యావత్ కాపు సామాజికవర్గ మనోభావాలతో ముడిపడిన అంశం. అంతటి కీలకమైన అంశంపై జీవో జారీ చేయడం అంటే ఆషామాషీ వ్యవహారం కాదు. కేవలం హోం శాఖకే పరిమితమయ్యే అంశం కూడా కాదు. హోం శాఖ మంత్రితోపాటు ముఖ్యమంత్రి కార్యాలయాన్ని సంప్రదించి అనుమతి తీసుకున్న అనంతరమే జీవో జారీ చేస్తారన్నది ప్రభుత్వ వ్యవహారాల గురించి అవగాహన ఉన్న అందరికీ తెలిసిన విషయమే.
తుని ఘటనపై కేసుపై పునర్విచారణ కోరాలన్న నిర్ణయం సీఎం చంద్రబాబు స్థాయిలో తీసుకున్న నిర్ణయమేనన్నది నిస్సందేహం. కానీ.. తమ కుతంత్రం బెడిసికొట్టడంతో చంద్రబాబు ప్రజల్ని తప్పుదారి పట్టించేందుకు యత్నిస్తున్నారు. ప్రభుత్వ పెద్దలకు తెలియకుండానే హోం శాఖ అధికారులు జీవో జారీ చేశారని టీడీపీ అనుకూల మీడియా ద్వారా ప్రచారం చేయాలని నిర్ణయించారు. హోం శాఖ ముఖ్య కార్యదర్శి కుమార్ విశ్వజిత్పై చర్యలు తీసుకోనున్నట్టు కూడా మీడియాకు లీకులు ఇవ్వడం గమనార్హం.
అంటే త్వరలోనే ఆయనపై బదిలీ వేటు వేస్తారని స్పష్టమవుతోంది. తద్వారా తమ పన్నాగానికి హోం శాఖ కార్యదర్శిని బలి చేసి తాను తప్పించుకోవాలన్నదే ప్రభుత్వ పెద్దల తాజా యోచన. తద్వారా కాపు సామాజిక వర్గాన్ని మరోసారి తప్పుదారి పట్టించాలన్నది అసలు లక్ష్యం. ఓ కుట్ర బెడిసికొడితే వెంటనే మరో కనికట్టు కుట్రకు తెగబడటం చంద్రబాబు మార్కు రాజకీయం మరి.
అండగా నిలిచిన వైఎస్సార్సీపీ
మరోవైపు ప్రతిపక్ష వైఎస్సార్సీపీ కాపు సామాజిక వర్గానికి పూర్తి సంఘీభావం ప్రకటించింది. తుని ఘటనను తిరగదోడి కాపులను వేధించాలన్న టీడీపీ కూటమి ప్రభుత్వ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించింది. రెడ్బుక్ రాజ్యాంగంతో ఇప్పటికే పేదలు, బడుగు, బలహీన వర్గాలను వేధిస్తున్న చంద్రబాబు ప్రభుత్వం తాజాగా కాపు సామాజిక వర్గాన్ని లక్ష్యంగా చేసుకుందని విరుచుకుపడింది. టీడీపీ కూటమి కుట్రకు వ్యతిరేకంగా కాపు సామాజికవర్గ పోరాటానికి అండగా నిలుస్తామని ప్రకటించింది.