తగ్గుతున్న గోదావరి ఉధృతి | Godavari flood continues | Sakshi
Sakshi News home page

తగ్గుతున్న గోదావరి ఉధృతి

Jul 25 2024 5:35 AM | Updated on Jul 25 2024 9:27 AM

Godavari flood continues

ధవళేశ్వరం వద్ద 14.70 అడుగులకు చేరిన నీటిమట్టం 

కాటన్‌ బ్యారేజీ నుంచి 14,13,251 క్యూసెక్కులు విడుదల

భద్రాచలం వద్ద ఉపసంహరించినా.. ధవళేశ్వరం వద్ద కొనసాగుతున్న రెండో ప్రమాద హెచ్చరిక 

జలదిగ్బంధంలోనే వేలేరుపాడు  

నిలిచిపోయిన పునరావాస కేంద్రాలు

సాక్షి, అమరావతి/ధవళేశ్వరం/ఏలూరు:  గోదావరిలో వరద ఉధృతి కొనసాగుతోంది. ధవళేశ్వరం బ్యారేజీలోకి బుధవారం రాత్రి 7 గంటలకు 14,08,117 క్యూసెక్కులు చేరుతుండగా.. కాలువల ద్వారా 3,900 క్యూసెక్కులను వదులుతున్న అధికారులు.. మిగులుగా ఉన్న 14,04,217 క్యూసెక్కుల (121.35 టీఎంసీల)ను సముద్రంలోకి వదిలేస్తున్నారు. ఈ నీటి సంవత్సరంలో అంటే జూన్‌ 1 నుంచి బుధవారం ఉదయం 6 గంటల వరకూ ధవళేశ్వరం బ్యారేజీ నుంచి 393 టీఎంసీల గోదావరి జలాలు సముద్రంలోకి వదిలేయాల్సి వచి్చంది. 

ధవళేశ్వరం బ్యారేజీ వద్ద నీటిమట్టం 14.70 అడుగుల వద్ద కొనసాగుతుండటంతో రెండో ప్రమాద హెచ్చరికను కొనసాగిస్తున్నారు. గోదావరి బేసిన్‌లో వర్షాలు తగ్గుముఖం పట్టడంతో గోదావరిలో ఎగువన వరద క్రమేణా తగ్గుతోంది. తెలంగాణలోని మేడిగడ్డ బ్యారేజీ నుంచి 7.87 లక్షలు, తుపాకులగూడెం బ్యారేజీ నుంచి 9.75 లక్షలు, దుమ్ముగూడెం బ్యారేజీ నుంచి 10.22 లక్షల క్యూసెక్కులు దిగువకు వదిలేస్తున్నారు. దాంతో భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం 45.3 అడుగులకు తగ్గింది. దాంతో రెండో ప్రమాద హెచ్చరికను అధికారులు ఉపసంహరించుకున్నారు. 

మొదటి ప్రమాద హెచ్చరికను కొనసాగుతోంది. ఇక పోలవరం బ్యారేజీలోకి 11,68,897 క్యూసెక్కులు చేరుతుండగా. అంతే స్థాయిలో దిగువకు వదిలేస్తున్నారు. స్పిల్‌ వే ఎగువన 33.42 మీటర్లకు నీటి మట్టం తగ్గింది. ఎగువ వరద తగ్గిన నేపథ్యంలో గురువారం నుంచి ధవళేశ్వరం బ్యారేజీ వద్ద గోదావరి దూకుడు తగ్గనుంది.



జలదిగ్బంధంలోనే వేలేరుపాడు 
వేలేరుపాడు మండలం జల దిగ్బంధంలోనే ఉంది. 33 గ్రామాల్లోకి నీరు ప్రవేశించి రాకపోకలు నిలిచిపోయాయి. ఎగువ ప్రాంతాల నుంచి వరద తీవ్రత లేదనే కారణంతో బుధవారం ఉదయం నుంచి పునరావాస కేంద్రాలను అధికారులు నిలిపివేశారు. గ్రామాల్లో నీరు నిలిచి ఉన్నా ప్రజలు ఊళ్లకు వెళ్లాల్సి వచి్చంది. విలీన మండలాల్లోని కమ్మరిగూడెం, అల్లూరు నగర్, కోయ మాధవరం, రామవరం ఉదయ్‌నగర్, రాళ్లపూడిలో 208 ఇళ్లు పూర్తిగా ధ్వంసం కాగా.. 146 ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి.

Advertisement
 
Advertisement
Advertisement