పచ్చనేత ఆక్రమణలపై పెల్లుబికిన ఆగ్రహం | Fishermen agitation ontdp leader in Ipurupalem | Sakshi
Sakshi News home page

పచ్చనేత ఆక్రమణలపై పెల్లుబికిన ఆగ్రహం

Jun 21 2025 5:16 AM | Updated on Jun 21 2025 5:16 AM

Fishermen agitation ontdp leader in Ipurupalem

ఈపూరుపాలెం స్ట్రెయిట్‌ కట్‌ పునరుద్ధరించాలంటూ మత్స్యకారుల  ఆందోళన 

ఆక్రమణలను తొలగించే యత్నం.. అడ్డుకున్న పోలీసులు

విచారణకు కలెక్టర్‌ ఆదేశం 

యంత్రాలు ధ్వంసం చేశారంటూ మత్స్యకారులపై కేసులు 

టీడీపీ నేతను అరెస్ట్‌ చేయాలంటూ ప్రతిగా పోలీసులకు మత్స్యకారుల ఫిర్యాదు

సాక్షి ప్రతినిధి, బాపట్ల:  చీరాల పచ్చనేత బుర్ల వెంకట్రావు ఆక్రమించి ధ్వంసం చేసిన ఈపూరుపాలెం స్ట్రెయిట్‌ కట్‌ను తక్షణమే పునరుద్ధరించాలంటూ  తీర గ్రామాల మత్స్యకారులు శుక్రవారం పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు.  ఉదయమే పాండురంగాపురం పరిధిలో ఈపూరుపాలెం స్ట్రెయిట్‌ కట్‌ సముద్రంలో కలిసే ప్రాంతానికి చేరుకున్నారు. ప్రధాన కాలువను పునరుద్ధరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. స్పందించకపోతే యంత్రాలతో తామే కాలువను పునరుద్ధరించుకుంటామని తేల్చి చెప్పారు. మత్స్యకారులు పెద్దఎత్తున ఆందోళనకు దిగడంతో టీడీపీ నేత బుర్ల అనుచరులు పోలీసులకు సమాచారమందించారు.

దీంతో బాపట్ల డీఎస్పీ రామాంజనేయులుతోపాటు, సిబ్బంది హుటాహుటిన తీరప్రాంతానికి చేరుకున్నారు. పోలీసులు నచ్చజెప్పే ప్రయత్నం చేసినప్పటికీ మత్స్యకారులు అక్కడే బైఠాయించి ధర్నాకు దిగారు. తక్షణమే టీడీపీ నేత బుర్ల వెంకట్రావు ధ్వంసం చేసి ఆక్రమించిన స్ట్రెయిట్‌కట్‌ను, ప్రధానంగా సీ మౌత్‌ను పునరుద్ధరించాలని డిమాండ్‌ చేశారు. కాలువలో ఉన్న వెయ్యికి పైగా పడవలు వేటకు వెళ్లలేని పరిస్థితి నెలకొందని, దీనివల్ల తాము ఉపాధి కోల్పోతున్నామని వాపోయారు. అందుకు కారణమైన వెంకట్రావును అరెస్ట్‌ చేయాలని నినాదాలు చేశారు. సముద్ర తీరంలో ఆక్రమిత భూములకు డీకేటీ పట్టాలిచి్చన రెవెన్యూ అధికారులపైనా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. స్పందించకపోతే ఆందోళన మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. 

స్పందించిన కలెక్టర్‌.. 
మత్స్యకారులు ఆందోళన తీవ్రతరం చేయడంతో బాపట్ల జిల్లా కలెక్టర్‌ వెంకట మురళి స్పందించారు. తీరం ఆక్రమణలపై బాపట్ల ఆర్డీవో గ్లోరియా, చీరాల ఆర్డీవో చంద్రశేఖరనాయుడుతో విచారణ కమిటీని నియమించారు. వెంటనే నివేదిక సమరి్పంచాలన్నారు. అంతవరకూ వివాదాస్పద భూమిగా ఉన్న సర్వేనంబర్‌ 499–1, 2లోని 1.50 ఎకరాల్లో ఎవరూ దిగవద్దని ఆదేశాలు జారీ చేశారు. విచారణ నివేదిక వచ్చాక సదరు భూమిపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. దీంతో మత్స్యకారులు శాంతించి ఆందోళనను విరమించారు. 

మత్స్యకారులపై కేసులు? 
తీరంలో ఆక్రమణలను అడ్డుకుంటున్న మత్స్యకారులపై టీడీపీ నేత ఫిర్యాదు మేరకు పోలీసులు కేసులు నమోదు చేసినట్లు తెలుస్తోంది. తమ ట్రాక్టర్లు, ఇతర యంత్రాలను ధ్వంసం చేశారని ఫిర్యాదులో పేర్కొనడంతో 20మందికి పైగా మత్స్యకారులపై పోలీసులు కేసులు నమోదు చేసినట్లు సమాచారం. 

వెంకట్రావుపై మత్స్యకారుల ఫిర్యాదు.. 
ఈపూరుపాలెం స్ట్రెయిట్‌ కట్‌ సీ మౌత్‌ పూడ్చివేసి 12 వేల కుటుంబాల మత్స్యకారుల కడుపు కొట్టిన రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి బుర్ల వెంకట్రావుపై కేసు నమోదు చేసి, చర్యలు తీసుకోవాలంటూ మత్స్యకారుడు కనకారావు శుక్రవారం బాపట్ల పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాలువలను ధ్వంసం చేస్తున్న అతన్ని అడ్డుకునే ప్రయత్నం చేయగా.. తమను దూషించి, చంపేస్తామంటూ బెదిరించారని ఆయన పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు.

పాండురంగాపురం సముద్ర తీరం వద్ద మత్స్యకారుల ఆందోళన 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement