
టెన్త్ మూల్యాంకనంలో విచిత్రం
సోషల్ పేపర్ రీ వాల్యూయేషన్లో ఫస్ట్ క్లాస్ మార్కులు
ఎస్ఎస్సీ బోర్డు నిర్వాకంతో గురుకుల విద్యార్థికి తీవ్ర వేదన
దేవరాపల్లి(విశాఖపట్నం): ఈ ఏడాది జరిగిన పదో తరగతి పరీక్షల జవాబు పత్రాల మూల్యాంకనంలో జరిగిన తప్పిదంతో ఓ విద్యార్థి తీవ్ర వేదనకు గురయ్యాడు. రీవాల్యుయేషన్లో ఫెయిల్ కాదు.. ఫస్ట్ క్లాస్ అని తేలింది. దేవరాపల్లి మండలం తెనుగుపూడి డా. బీఆర్ అంబేడ్కర్ బాలుర గురుకుల విద్యార్థి లింగాల ఆకర్ష్ ఈ ఏడాది పదో తరగతి పరీక్షలు రాశాడు. ఎస్ఎస్సీ బోర్డు విడుదల చేసిన ఫలితాల్లో అన్ని సబ్జెక్టుల్లో పాస్ కాగా సాంఘిక శాస్త్రంలో కేవలం 18 మార్కులు మాత్రమే వచ్చాయి.
దీంతో విద్యార్థితోపాటు తల్లిదండ్రులు తల్లడిల్లిపోయారు. మూల్యాంకనంపై అనుమానం వచ్చి విద్యార్థి తల్లిదండ్రులు ఎస్ఎస్సీ బోర్డుకు రూ.1000 చలానా చెల్లించి సోషల్ పేపర్ జవాబు పత్రాన్ని రీ వాల్యుయేషన్ చేయించారు. పునర్ మూల్యాంకనంలో 65 మార్కులు వచ్చాయంటూ ఎస్ఎస్సీ బోర్డు నుంచి లింగాల ఆకర్ష్ ఫోనును సమాచారం వచ్చింది.
అంతే కాకుండా అతని జవాబు పత్రంలోని పేజీలను పంపించారు. దీంతో తన కుమారుడు పరీక్షలో ఫెయిల్ కాలేదని, పాసయ్యాడని తెలిసిన అతని తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేశారు. మూల్యాంకనంలో నిర్లక్ష్యంతోనే ఇటువంటి సంఘటనలు చోటు చేసుకుంటున్నాయని, విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడటం సరికాదని బాధిత విద్యార్థి తల్లిదండ్రులతో పాటు పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.