విద్యుత్‌ రంగంలో సరికొత్త అధ్యాయం  | Sakshi
Sakshi News home page

విద్యుత్‌ రంగంలో సరికొత్త అధ్యాయం 

Published Mon, Apr 1 2024 5:07 AM

expanded energy projects under ys jagan government: ap - Sakshi

విద్యుత్‌ రంగ అభివృద్ధి, తక్కువ ఖర్చుతో సరఫరాకు ప్రణాళికలు 

ఈ ప్రాజెక్టుల ద్వారా పెద్దఎత్తున యువతకు ఉద్యోగాలు.. అధికారంలోకి వచ్చాక అందుబాటులోకి 1600 మెగావాట్ల థర్మల్‌ యూనిట్లు 

ఇంధన ప్రాజెక్టులపై రూ.9.57 లక్షల కోట్ల పెట్టుబడుల ఒప్పందాలు 

44,240 మెగావాట్ల సామర్థ్యంతో పంప్డ్‌ స్టోరేజ్‌ హైడ్రోపవర్‌ ప్లాంట్ల ఏర్పాటు 

వ్యవసాయానికి ఉచిత విద్యుత్‌ కోసం ‘సెకీ’ నుంచి 7 వేల మెగావాట్ల విద్యుత్‌ 

సీఎం వైఎస్‌ జగన్‌ ప్రత్యేక చొరవతో ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా ఏపీ  

సాక్షి, అమరావతి: విద్యుత్‌ రంగంలో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం సరికొత్త అధ్యా­యాన్ని లిఖిస్తోంది. విద్యుత్‌ రంగాన్ని ఉజ్వలంగా తీర్చిదిద్దడంతోపాటు భవిష్యత్‌ తరాలకు తక్కువ ఖర్చుతో విద్యుత్‌ సరఫరా, యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగాల కల్పన దిశగా సాగుతోంది. ఇందులో భాగంగా రాష్ట్ర విద్యుత్‌ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచడంలో సహాయపడే పునరుత్పాదక ఇంధన ఉత్పత్తిపై ప్రత్యేక దృష్టి సారించింది. గత ఐదేళ్లుగా ప్ర­ణా­ళికాబద్ధంగా విద్యుత్‌ ప్రాజెక్టులను నెలకొల్పు­తోంది. విండ్‌ సోలార్‌ హైబ్రిడ్‌ ప్రాజెక్టులను స్థాపించడానికి పునరుత్పాదక ఇంధన ఎగుమతి విధానం 2020ని ప్రభుత్వం ప్రకటించింది. పవన, సౌర, చిన్న జల, పారిశ్రామిక వ్యర్ధాలు, వేస్ట్‌ టు ఎనర్జీ ప్రాజెక్టులను కొత్తగా నెలకొల్పేందుకు తోడ్పాటునందించింది. సీఎం వైఎస్‌ జగన్‌ ప్రత్యేక చొరవతో, ప్ర­ణా­ళికాబద్ధంగా చేపడుతున్న ప్రాజెక్టులతో రా­ష్ట్రం ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తోంది. 

వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం సాధించిన విద్యుత్‌ రంగ ప్రగతి 
► రాష్ట్రంలో విద్యుదుత్పత్తి సామర్థ్యాన్ని పెంపొందించే లక్ష్యంలో భాగంగా నెల్లూరు జిల్లా కృష్ణపట్నంలోని శ్రీ దామోదరం సంజీవయ్య థర్మల్‌ పవర్‌ స్టేషన్‌ (ఎస్‌డీఎస్‌టీపీఎస్‌)లో 800 మెగావాట్ల యూనిట్‌ను సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రారంభించి, జాతికి అంకితం చేశారు. ఎన్‌టీటీపీఎస్‌లో 800 మెగావాట్ల యూనిట్‌ సీవోడీ పూర్తి చేసుకుని అందుబాటులోకి వచి్చంది. ఈ 1,600 మెగావాట్లతో కలిపి జెన్‌కో థర్మల్‌ విద్యుత్‌ ఉత్పాదన సామర్థ్యం 6,610 మెగావాట్లకు పెరిగింది. 
► ప్రపంచంలోనే అతిపెద్ద 5,230 మెగావాట్ల ఇంటిగ్రేటెడ్‌ పునరుత్పాదక శక్తి నిల్వ ప్రాజెక్టుకు ఉమ్మడి కర్నూలు జిల్లాలోని ఓర్వకల్, పాణ్యం మండలాల సరిహద్దులోని పిన్నాపురంలో సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శంకుస్థాపన చేశారు. నంద్యాల జిల్లాలో రూ.25,850 కోట్ల విలువైన మూడు పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టులకు ఇటీవల సీఎం వైఎస్‌ జగన్‌ భూమి పూజ చేశారు. వీటి ద్వారా 5,300 మందికి ఉద్యోగాలు రానున్నాయి. ఎన్‌హెచ్‌పీసీతో కలిసి ఏపీ జెన్‌కో నెలకొల్పనున్న పంప్డ్‌ స్టోరేజ్‌ పవర్‌ ప్లాంట్ల ద్వారా మరో 2 వేల మందికి ఉద్యోగాలు లభించనున్నాయి. 

► దాదాపు 44,240 మెగావాట్ల సామర్థ్యంతో పంప్డ్‌ స్టోరేజ్‌ హైడ్రోపవర్‌ ప్లాంట్ల ఏర్పాటుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. 8,025 మెగావాట్ల సోలార్‌ ప్రాజెక్టులు ఇప్పటికే  ప్రైవేట్‌ పెట్టుబడిదారులకు కేటాయించింది. గ్రీన్‌కో గ్రూప్‌ ద్వారా నంద్యాల, కర్నూలు జిల్లాల్లో 2,300 మెగావాట్ల సోలార్‌ విద్యుత్‌ ప్లాంట్‌ పనులు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. ఏఎం గ్రీన్‌ ఎనర్జీ (ఆర్సెలర్‌ మిట్టల్‌ గ్రూప్‌) 700 మెగావాట్ల సోలార్‌ పవర్‌ ప్రాజెక్టు పునాది పనులు పురోగతిలో ఉన్నాయి. 
► వ్యవసాయానికి వచ్చే 30 ఏళ్ల పాటు 9 గంటల పగటిపూట ఉచిత విద్యుత్‌ను కొనసాగించడం కోసం  7 వేల మెగావాట్ల సౌర విద్యుత్‌ కొనుగోలుకు సోలార్‌ ఎనర్జీ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌ఈసీఐ)­తో ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. 

► సౌర విద్యుత్‌ ఉత్పత్తిలో దేశంలోనే ఏపీ ఐదో స్థానంలో నిలిచిందని కేంద్ర నూతన, పునరుత్పాదక ఇంధన శాఖ ప్రకటించింది. 2019లో 241.­50 మెగావాట్లు, 2020లో 337.02 మెగావాట్లు, 2021­లో 335.375 మెగావాట్లు, 2022లో 113.685 మెగావాట్లు, 2023లో ఇప్పటివరకూ 13.8 మెగావాట్ల సౌర విద్యుత్‌ సామర్ధ్యం పెరిగింది. 
► చిన్న జల శక్తి ప్రాజెక్టులు 2021లో 3 మెగావాట్లు, 2023లో 1.20 మెగావాట్లు కొత్తగా వచ్చాయి. 
► పట్టణ ప్రాంతాల్లో పోగయ్యే చెత్త నుంచి విద్యుత్‌ను తయారు చేసే సాలిడ్‌ వేస్ట్‌ పవర్‌ ప్రాజెక్టులనూ రాష్ట్ర ప్రభుత్వం నెలకొల్పుతోంది. 2021లో గుంటూరులో 15 మెగావాట్ల ప్లాంటు, 2022లో విశాఖలో 15 మెగావాట్ల సామర్ధ్యంతో మరో ప్లాంటు ప్రారంభమయ్యాయి. పరిశ్రమల వ్యర్ధాల నుంచి కరెంటును ఉత్పత్తి చేసే 0.125 మెగావాట్ల ప్రాజెక్టు తూర్పుగోదావరి జిల్లాలో మొదలైంది. 

►  2023 మార్చిలో జరిగిన వైజాగ్‌ గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సమ్మిట్‌లో దాదాపు రూ.9.57 లక్షల కోట్ల విలువైన ఇంధన రంగ ప్రాజెక్టులకు ప్రముఖ పెట్టుబడిదారులతో 42 అవగాహన ఒప్పందాలను కుదుర్చుకుంది. వీటి ద్వారా దాదాపు 1.80 లక్షల ఉద్యోగాలను సష్టించే అవకాశం ఉంది.  
►  గ్రీన్‌ ఎనర్జీ ఉత్పత్తి, ఇంధన సామర్థ్యం, థర్మల్‌ విద్యుత్‌ ఉత్పత్తి రంగాలలో దేశంలోనే అత్యుత్తమ రాష్ట్రంగా ఏపీని ప్రభుత్వం నిలిపింది. రాష్ట్రంలో ఇంధన పొదుపు, ఇంధన సామర్ధ్య కార్యక్రమాల ద్వారా దాదాపు రూ.3,800 కోట్లు విలువైన 5,600 మిలియన్‌ యూనిట్ల విద్యుత్‌ ఆదా అయ్యింది. తద్వారా 4.76 మిలియన్‌ టన్నుల కార్బన్‌ ఉద్గారాలు తగ్గాయి. 

ఇంధన రంగంలో ఎన్నో అవార్డులు 
ఇంధన భద్రతలో రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కృషికి పలు జాతీయ అవార్డులు లభించాయి. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ‘జాతీయ ఇంధన పరిరక్షణ అవార్డు’ను వరుసగా రెండేళ్లు రాష్ట్ర ప్రభుత్వం అందుకుంది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఈ అవార్డులను రాష్ట్ర ప్రభుత్వం అందుకుంది. ఏపీ ట్రాన్స్‌కో, నెడ్‌కాప్, ఏపీకి మూడు ఎనర్షియా అవార్డులు వచ్చాయి. ఏపీఎస్పీడీసీఎల్‌కు రెండు జాతీయ అవార్డులు లభించాయి. దేశవ్యాప్తంగా ఉన్న విద్యుత్‌ పంపిణీ సంస్థ (డిస్కం)ల్లో మన రాష్ట్రంలోని ఆంధ్రప్రదేశ్‌ తూర్పు, మధ్య, దక్షిణ ప్రాంత విద్యుత్‌ పంపిణీ సంస్థలు అత్యుత్తమమని కేంద్ర ప్రభుత్వానికి చెందిన రూరల్‌ ఎలక్ట్రిఫికేషన్‌ కార్పొరేషన్‌ (ఆర్‌ఈసీ) ప్రకటించింది. ‘కన్సూ్యమర్‌ సరీ్వస్‌ రేటింగ్‌ ఆఫ్‌ డిస్కమ్స్‌’ పేరుతో విడుదల చేసిన నివేదికలో ఏపీలోని మూడు డిస్కంలకు ‘ఏ’ గ్రేడ్‌ లభించింది. వీటన్నిటి సాధన వెనుక సీఎం జగన్‌ ముద్ర, ఆయన ప్రణాళికలు ఉన్నాయి. 

Advertisement

తప్పక చదవండి

Advertisement