బేరం కుదిరితేనే బదిలీ | Employees complain to Chief Vigilance Commissioner about employee transfers | Sakshi
Sakshi News home page

బేరం కుదిరితేనే బదిలీ

May 31 2025 2:57 AM | Updated on May 31 2025 11:00 AM

Employees complain to Chief Vigilance Commissioner about employee transfers

ఉద్యోగులకు కూటమి సర్కారు మేలు చేయకపోగా వసూళ్ల పర్వం

టీడీపీ ఎమ్మెల్యేల సిఫారసు లేఖలుంటేనే బదిలీలు

లేఖలు ఇచ్చేందుకు పోస్టును బట్టి భారీగా వసూళ్లు

మండల స్థాయిలో టీడీపీ నేతల పైరవీలు

నిబంధనలు, అర్హతలు పక్కనపెట్టి అంతా ఇష్టారాజ్యం

ఉద్యోగుల వినతులను పట్టించుకోని ఉన్నతాధికారులు

పట్టు పరిశ్రమ శాఖలో రూ.లక్షలిస్తేనే పోస్టులు

చీఫ్‌ విజిలెన్స్‌ కమిషనర్‌కు ఫిర్యాదు చేసిన ఉద్యోగులు 

సాక్షి, అమరావతి: టీడీపీ ఎమ్మెల్యేల సిఫారసు లేఖలు లేకుండా ఉద్యోగులు ఎవరూ బదిలీల కోసం తమ వద్దకు రావద్దని ఉన్నతాధికారులు తేల్చి చెబుతున్నారు! ఎలాంటి రిక్వెస్టు అయినా ఎమ్మెల్యే లేఖ ద్వారానే చేస్తామని ఏలూరు జిల్లాలో కరాఖండిగా చెబుతుండటంతో ఉద్యోగులంతా అధికార పార్టీ ప్రజా ప్రతినిధుల చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నారు. జంగారెడ్డిగూడెం డివిజన్‌లో ఓ మండల స్థాయి అధికారి తన కుటుంబ సభ్యుల ఆరోగ్య పరిస్థితి రీత్యా తనను బదిలీ చేయాలని పలు ఆధారాలు చూపించి అభ్యర్థించినా అధికారులు పక్కన పడేశారు. 

బదిలీకి అనుకూలంగా స్థానిక ఎమ్మెల్యే మరో ఉద్యోగికి లేఖ ఇవ్వడమే దీనికి కారణం. పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టరేట్‌లో పనిచేస్తున్న ఉద్యోగి ఒకరు తన అవసరాలు, ఇబ్బందులు, అర్హతలు వివరించి ఒక మండలంలో పోస్టింగ్‌ ఇవ్వాలని అభ్యర్థించగా సంబంధిత ఎమ్మెల్యే సిఫారసుతో రావాలని ఉన్నతాధికారులు సూచించారు. దీంతో ఆ ఉద్యోగి ఎమ్మెల్యే కార్యాలయాన్ని ఆశ్రయించగా ఆ పోస్టును అప్పటికే ఇతరులకు బేరం పెట్టినట్లు తెలియడంతో హతాశుడయ్యాడు! 

పట్టు పరిశ్రమ శాఖలో ముడుపులు తీసుకుని బదిలీలు చేయడంపై కొందరు ఉద్యోగులు చీఫ్‌ విజిలెన్స్‌ కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. జిల్లా పోస్టుల కోసం రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలు చేతులు మారుతున్నట్లు వెల్లడించారు. ఏడీ పోస్టు కోసం కదిరిలో రూ.5 లక్షలు, చిత్తూరు జిల్లాలో రూ.8 లక్షలు, శ్రీసత్యసాయి జిల్లాలో రూ.10 లక్షలు చొప్పున వసూలు చేస్తున్నారని, దీనిపై విచారణ జరపాలని కోరారు. 

ఆదాయ మార్గంగా.. 
పారదర్శకంగా, నిబంధనల ప్రకారం జరగాల్సిన ఉద్యోగుల బదిలీలను టీడీపీ కూటమి సర్కారు అక్రమాల పర్వంగా మార్చేసింది. అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఉద్యోగులకు ఎలాంటి మేలు చేయకపోగా కనీసం బదిలీల విషయంలోనూ కరుణించడం లేదు. నిబంధనలు, మార్గదర్శకాలతో పని లేకుండా రాజకీయ జోక్యంతో బదిలీలు చేపడుతోంది. అన్ని స్థాయిల పోస్టుల్లో ఏ ఉద్యోగి ఉండాలనే విషయాన్ని ఆయా నియోజకవర్గాలకు చెందిన కూటమి పార్టీల ప్రజాప్రతినిధులే నిర్ణయిస్తున్నారు. 

వారి మాట కాదనేందుకు ఉన్నతాధికారులు సాహసించడం లేదు. మే 15వతేదీ నుంచి జూన్‌ 2వతేదీ వరకు బదిలీలపై నిషేధం ఎత్తివేశారు. ఈ సమయంలో బదిలీలకు అవకాశం కల్పించి మార్గదర్శకాలు విడుదల చేసినా అవి ఎక్కడా అమలు కావడంలేదు. ఎమ్మెల్యేల సిఫారసుల ఆధారంగానే బదిలీలు జరుగుతుండడంతో ఉద్యోగులకు దిక్కు తోచడం లేదు. 

ఒకేచోట ఐదేళ్లు పనిచేసిన వారిని తప్పనిసరిగా బదిలీ చేయాలని మార్గదర్శకాల్లో పేర్కొన్నారు. ఆరోగ్య సమస్యలు ఉన్నవారు, వితంతు మహిళా ఉద్యోగులు, ఇతర సమస్యలు ఉన్నవారు తగిన ఆధారాలతో బదిలీల కోసం అభ్యర్థించే వీలున్నా టీడీపీ ప్రజాప్రతినిధుల కనుసన్నల్లోనే పనులు జరుగుతున్నాయి. ఉద్యోగుల బదిలీలు వారికి ఆదాయం సమకూర్చే కార్యక్రమంగా మారిపోయింది! 

సిఫారసు లేఖల కోసం అగచాట్లు.. 
రెవెన్యూ, వైద్య, ఆరోగ్య శాఖ, విద్యుత్, పంచాయతీరాజ్‌ తదితర శాఖల్లో ఉద్యోగులు సిఫారసు లేఖల కోసం టీడీపీ ఎమ్మెల్యేల చుట్టూ తిరుగుతున్నారు. తహశీల్దార్, ఎంపీడీవో కార్యాలయాల్లో ముఖ్యమైన పోస్టుల్లో తమ పనులు చేసే వారిని, తమ మాట వినే వారిని నియమించేందుకు అధికార పార్టీ ప్రజాప్రతినిధులు మొగ్గు చూపుతున్నారు. దీంతో టీడీపీ ఎమ్మెల్యేలు చెబితేనే ఆయా చోట్ల పోస్టింగ్‌లు ఇస్తామని కలెక్టర్లు, జేసీలు, ఇతర అధికారులు చెబుతున్నారు. 

బదిలీలకు సంబంధించి స్పష్టమైన మార్గదర్శకాలు, నిబంధనలున్నా వాటిని పక్కనపెట్టి ఎమ్మెల్యేల సిఫారసు లేఖలు తెచ్చుకోవాలని స్పష్టం చేస్తున్నారు. సిఫారసులు లేకుండా వ్యక్తిగత అభ్యర్థనలను పరిగణనలోకి తీసుకోలేమని పేర్కొంటున్నారు. ఎమ్మెల్యేలు సిఫారసు లేఖలు ఇచ్చిన తర్వాత వారితో మాట్లాడి ధ్రువీకరించుకున్నాకే పోస్టింగ్‌లు ఇచ్చేందుకు అంగీకరిస్తున్నారు.  

వేలం పాటల తరహాలో.. 
అధికార పార్టీ ప్రజాప్రతినిధులు సామాజిక వర్గం, డబ్బులు తదితర అంశాలు బేరీజు వేసుకున్నాకే సిఫారసు లేఖలు ఇస్తున్నారు. చాలాచోట్ల డిప్యూటీ తహశీల్దార్, సర్వేయర్, తహశీల్దార్‌ కార్యాలయాల్లో ముఖ్యమైన పోస్టుల కోసం రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షలు వరకు వసూలు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. తహశీల్దార్, ఎంపీడీఓ పోస్టుల కోసం రూ.5 లక్షల నుంచి రూ.8 లక్షలు సమర్పించుకోవాల్సిందే. ఎంపీడీవోలు, ఆస్పత్రుల్లో స్టాఫ్‌ నర్సులు లాంటి పోస్టుల కోసం  కూడా వసూళ్లకు దిగుతున్నారు. 

అడిగినంత డబ్బులిచ్చిన వారికే సిఫారసు లేఖలు అందుతున్నాయి. కొందరికి సిఫారసు లేఖలు ఇచ్చిన తర్వాత తాము అంతకంటే ఎక్కువ ఇస్తామని ఇతరులు ముందుకు రావడంతో మొదట ఇచ్చిన లేఖను పట్టించుకోవద్దని ఉన్నతాధికారులకు ఫోన్లు చేస్తున్న ఉదంతాలు కూడా చోటు చేసుకుంటున్నాయి. మండల స్థాయి కూటమి నేతలు ఈ సిఫారసు లేఖలతో పెద్ద ఎత్తున పైరవీలు చేస్తున్నారు. డబ్బులు తీసుకుని ఎమ్మెల్యేల దగ్గరికి తీసుకెళ్లి సిఫారసు లేఖలు ఇప్పిస్తున్నారు. 

తిరుపతి అర్బన్‌ తహశీల్దార్‌ పోస్టు రూ.కోట్లు! 
అవినీతి ఆరోపణలతో సస్పెన్షన్‌లో ఉన్న తిరుపతి జిల్లాకు చెందిన ఒక తహశీల్దార్‌కి అర్బన్‌లో పోస్టింగ్‌ ఇచ్చేందుకు రూ.కోట్లలోనే బేరం కుదిరినట్లు తెలిసింది. గతంలో ఆయన రేణిగుంట, ఏర్పేడు మండలాల్లో పని చేశారు. ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నట్లు తేలడంతో సస్పెండ్‌ చేశారు. ఇప్పుడు ఆయన్ను కీలకమైన తిరుపతి అర్బన్‌ తహశీల్దార్‌గా నియమించేందుకు రంగం సిద్ధమైంది. కూటమి పార్టీ ప్రజాప్రతినిధి ఈ వ్యవహారాన్ని పర్యవేక్షిస్తున్నట్లు తెలుస్తోంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement