‘దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు.. 9 రోజులే’ | Dussehra Navarathri Utsavalu In Kanaka Durga Temple On Oct 17 To 25 | Sakshi
Sakshi News home page

‘బస్ సౌకర్యం ఉండదు.. అందరూ నడిచి రావాల్సిందే’

Sep 18 2020 8:23 PM | Updated on Sep 18 2020 8:59 PM

Dussehra Navarathri Utsavalu In Kanaka Durga Temple On Oct 17 To 25 - Sakshi

సాక్షి, విజయవాడ : అక్టోబర్ 17 నుంచి 25 వరకు విజయవాడ కనకదుర్గ ఆలయంలో దసరా శరన్నవరాత్రి వేడుకలు నిర్వహించనున్నట్లు ఆలయ ఛైర్మన్‌ పైలా సోమినాయుడు తెలిపారు. ఈ మేరకు ఉత్సవాలకు సంబంధించిన ఆన్‌లైన్‌ టికెట్‌లను ఛైర్మన్‌, ఈవో విడుదల చేశారు. 9 రోజులకు సంబంధించి ఉచిత, 100, 300 రూపాయల టికెట్స్ విడుదల చేయగా.. ఈ సంవత్సరం అన్ని సేవ టికెట్స్ ఆన్‌లైన్‌లో ఉంచినట్లు తెలిపారు. ఆన్‌లైన్‌లో ఏ దేశంలో ఉండి అయిన సేవా టికెట్ బుక్ చేసుకోవొచ్చన్నారు. సేవ టికెట్ బుక్ చేసుకున్న వారికి అమ్మవారి ప్రసాదం, చిత్రపటం, అమ్మవారి దస్త్రం వారి ఇంటికి పంపిస్తామని వెల్లడించారు. (తిరుమల బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ)

జిల్లా కలెక్టర్ అధ్యక్షతన దసరా ఉత్సవ కమిటీ సమావేశం నిర్వహించినట్లు పైలా సోమినాయుడు పేర్కొన్నారు. దసరా సమయంలో అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులను రోజుకి 10 వేల మందిని మాత్రమే అనుమతించనున్నట్లు, ప్రతి రోజు ఉదయం 5 గంటల నుంచి రాత్రి 8 గంటలకు వరకు మాత్రమే అమ్మవారి దర్శనం కల్పించనున్నట్లు వెల్లడించారు. ములనక్షత్రం రోజు మాత్రం ఉదయం 3 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకూ దర్శనం ఉంటుందన్నారు.ఈ నవరాత్రి దర్శనాలకి సంబంధించిన దర్శన టికెట్స్ అన్ని ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉన్నాయని, భక్తులు ఎవరైనా అమ్మవారి దర్శనం చేసుకోవాలి అంటే కచ్చితంగా టికెట్ ఆన్‌లైన్‌లోనే బుక్ చేసుకోవాలని పేర్కొన్నారు. (కనకదుర్గ అమ్మవారి దర్శన వేళల్లో మార్పులు)

‘టికెట్ లేకపోతే ఎవరిని కొండ పైకి అనుమతించం. కరోనా నేపథ్యంలో కేశకండనశాల ఉండదు. ప్రతి సంవత్సరం లాగే అమ్మవారి దర్శనానికి నాయకుడి గుడి దగ్గర నుంచే క్యూలైన్ ఏర్పాటు చేస్తున్నాం. ఈ రోజు సాయంత్రం నుంచి కృష్ణ నది ఒడ్డున నదీ హారతులు మళ్ళీ ప్రారంభిస్తున్నామం. ప్రతి రోజు సాయంత్రం 6.30 గంటలకు నది హారతులు ఉంటాయి. ఆన్‌లైన్‌లో టికెట్ తీసుకుని దర్శనానికి వచ్చే భక్తులు కరోనా నిబంధనలకు అనుగుణంగా కొండపైకి రావాలి. వీఐపీలు దసరా నవరాత్రులలో అందరికి టైం స్లాట్స్ పెడుతున్నాం. అందరూ ఆ స్లాట్స్‌లోనే అమ్మవారిని దర్శనం చేసుకోవాలి.’ అని తెలిపారు. (‘ఆలయాలపై దాడులకు పాల్పడే వారిని వదలం’)

కోవిడ్ కారణంగా ఈ సారి దసరాకి కొన్ని ఆంక్షలు కొనసాగుతాయయని దుర్గ గుడి సురేష్‌ బాబు తెలిపారు. ‘ఈ సారి 9 రోజులు మాత్రమే దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు. 9 రోజుల్లో అమ్మవారికి 10 అలంకారాలు చేస్తాం. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం గంటకి 1000 మంది భక్తులను అమ్మవారి దర్శనానికి అనుమతిస్తాం. దసరా 9 రోజులు ఎవరికి అంతరాలయం దర్శనం ఉండదు. అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులకు ఎవరికి కొండపైకి ఎలాంటి బస్ సౌకర్యం ఉండదు. అందరూ నడిచి రావాల్సిందే. దసరా నవరాత్రులకు సంబంధించి ఎటువంటి కరెంట్ బుకింగ్ ఉండదు. ఈ నెల 19న దేవాదాయశాఖ మంత్రి ఆధ్వర్యంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాల కోఆర్డినేషన్ కమిటీ మీటింగ్ జరుగుతుంది. కరోనా నిబంధనలకు అనుగుణంగా 60 సంవత్సరాల లోపు వారిని, 10 సంవత్సరాల లోపు వయసు ఉన్న వారిని దర్శనానికి అనుమతించము.’ అని వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement