సమస్యగా మారిన కరోనా నిర్ధారణ
పీహెచ్సీల్లో ఎక్కడా నిర్ధారణ పరికరాల్లేవు
8 మందికి కరోనా సోకి.. ఇద్దరు మరణించినా ప్రభుత్వం మొద్దు నిద్ర
కడప రూరల్ : వైఎస్సార్ కడప జిల్లాలో కరోనా ప్రకంపనలు పుట్టిస్తోంది. శుక్రవారం సాయంత్రం వరకు జిల్లా వ్యాప్తంగా 8 కరోనా కేసులు నమోదవగా.. వారిలో ఇద్దరు మృతిచెందారు. శనివారం ఎలాంటి కేసులు నమోదు కాలేదని వైద్యాధికారులు తెలిపారు. అయితే కరోనా కేసుల విషయంలో గోప్యత పాటిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇంత జరుగుతున్నా వైద్యాధికారులు.. ప్రభుత్వ యంత్రాంగం పట్టించుకోకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఎక్కడ కరోనా నిర్ధారణకు పరీక్షలకు సంబంధించిన పరికరాల్లేవు.
గల్ల పరీక్షలు మాత్రమే చేస్తున్నారు. అందులో 5–10 శాతం మాత్రమే కోవిడ్ అనుమాన లక్షణాలు బయటపడే అవకాశం ఉంది. వ్యాధి నిర్ధారణ జరిగే సమయానికి మరి కొంతమందికి కోవిడ్ సోకే ప్రమాదం పొంచి ఉంది. ఈ నిర్ధారణ పరీక్షలు ప్రస్తుతానికి కేవలం కడప ప్రభుత్వ సర్వజనాస్పత్రిలోనే జరుగుతున్నాయి. అక్కడ కూడా పాజిటివ్ వస్తే.. వ్యాధి తీవ్రత(గ్రేడ్ )ను కనుగొనేందుకు పూణెలోని ల్యాబ్కు పంపాల్సి వస్తోంది. ఇదిలా ఉండగా, కడప రిమ్స్లోని ఐసోలేషన్లో కరోనా పాజిటివ్ బాధితులు చికిత్స పొందుతున్నట్టు వైద్యాధికారులు చెప్పారు.


