నిజాలు వెల్లడయ్యేనా? కటకటాల్లో సమాధేనా! | Kurnool Custodial Death Case, Court Hearing On Eyewitness Durgappa Bail Puts Spotlight On Controversial Investigation | Sakshi
Sakshi News home page

నిజాలు వెల్లడయ్యేనా? కటకటాల్లో సమాధేనా!

Jun 23 2026 11:22 AM | Updated on Jun 23 2026 11:56 AM

Durgappa Statement very important to Gangamma lockup death case

కర్నూలు : గంగమ్మ పోలీసు కస్టడీ మృతి కేసులో ప్రత్యక్ష సాక్షి దర్గప్ప బెయిల్‌ పిటీషన్‌పై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. సోమవారం జిల్లా కోర్టులో జరిగిన విచారణలో దర్గప్ప తరపు న్యాయవాది, పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ తమ వాదనలు వినిపించారు. ఇరు పక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి తీర్పును నేటికి వాయిదా వేశారు. ఇప్పటికే రెండు రోజుల క్రితం హైకోర్టు ఆదేశాల మేరకు కర్నూలు మేజిస్ట్రేట్ పోలీసు కస్టడీలోని దర్గప్ప వాంగ్మూలాన్ని నమోదు చేసినట్లు సమాచారం. ప్రస్తుతం ఆయన కర్నూలు ప్రభుత్వాస్పత్రిలో పోలీసు పహరా మధ్య పోలీసు సదన్‌లో చికిత్స పొందుతున్నాడు. కుటుంబ సభ్యులు, బంధువులు, గ్రామస్తులు ఎవరినీ కలిసేందుకు పోలీసులు అనుమతించడం లేదని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో దర్గప్ప ఆరోగ్యం, ఆయన ఇచ్చిన వాంగ్మూలం కేసును ఎలాంటి మలుపు తిప్పుతుందోననే చర్చ కొనసాగుతోంది.
 
హత్యోదంతంలో మరొకరు ఎవరు? 
కుమారుని హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ పోలీసు విచారణలో గంగమ్మ మృతి చెందడం తెలిసిందే. విచారణ సందర్భంగా సిట్‌ పోలీసులు కొట్టడం వల్లే ఆమె మరణించినట్లు పత్రికల్లో విరుస కథనాలు వెలువడ్డాయి. అయితే పోలీసులు మాత్రం ఎలాంటి ప్రకటన చేయకపోవడం గమనార్హం. ఇదిలాఉంటే తన తల్లి కిందపడటం వల్లే మరణించినట్లు గంగమ్మ కుమార్తెతో పోలీసులు రాతపూర్వకంగా తీసుకున్నట్లు తెలుస్తోంది. వాస్తవానికి కుమారుడి హత్యోదంతంలో గంగమ్మ, దర్గప్పతో పాటు మరొకరు కూడా ఉన్నట్లు సమాచారం. ఇప్పటి వరకు పోలీసులు మరొకరు ఎవరనే విషయాన్ని కూడా వెల్లడించకపోవడం అనుమానాలకు తావిస్తోంది.  
22 రోజులుగా పోలీసుల ఆధీనంలోనే! 
సిట్‌ పోలీసుల విచారణ ఇప్పటికే వివాదాస్పదం కావడం తెలిసిందే. గంగమ్మ మృతి, దర్గప్ప ఆసుపత్రి పాలవడం చూస్తే ఏస్థాయిలో తమదైన శైలిలో విచారణ చేపట్టారో అర్థమవుతోంది. హైకోర్టు దర్గప్ప వాంగ్మూలాన్ని కోరడంతో పోలీసులు ఆయనను ఏమైనా భయపెట్టి ఉంటారేమోనని చర్చ జరుగుతోంది. గంగమ్మ మరణం వెనుక మిస్టరీని దర్గప్ప నిర్భయంగా బయటపెట్టగలడా? లేక తనను కూడా ఏమైనా చేస్తారేమోనని పోలీసుల స్క్రిప్టుతో సరిపెడతాడా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 

పోలీసుల్లో వణుకు 
సిట్‌ పోలీసుల తీరు తమ మెడకు ఎక్కడ చుట్టుకుంటుందోనని స్థానిక పోలీసుల్లో వణుకు మొదలైంది. ఇప్పటికే కేసు రోజుకో మలుపు తిరుగుతుండటం, వ్యవహారం హైకోర్టు వరకు చేరడంతో ఎవరి ‘సిట్‌’కిందకు నీళ్లు వస్తాయోనని ఆందోళన చెందుతున్నారు. కౌతాళం సీఐ కూడా విజయవాడలోనే మకాం వేయడం, స్థానిక పోలీసులు ఇద్దరు, ముగ్గురిపై వేటు పడక తప్పదనే ప్రచారం ప్రతి ఒక్కరినీ కలవరపెడుతోంది. ఫిర్యాదు స్వీకరించే విషయంలో నిర్లక్ష్యం నేపథ్యంలో గతంలో ఇక్కడ పనిచేసిన అధికారిపైనా చర్యలు తీసుకుంటారనే చర్చ కొనసాగుతోంది. మొత్తంగా నేడు కోర్టులు ఏవిధంగా స్పందిస్తాయోనని పోలీసుల్లో ఉత్కంఠ నెలకొంది.

నేడు హైకోర్టుకు దర్గప్ప వాంగ్మూలం
గంగమ్మ మరణం వెనుక నిజానిజాలను వెల్లడించాల్సిన ప్రత్యక్ష సాక్షి దర్గప్ప. వీరిద్దరిపైనే సిట్‌ పోలీసులు దృష్టి సారించారు. ఇప్పటికీ గంగమ్మ మరణం వెనుక కారణాలను పోలీసులు వెల్లడించకపోవడం.. దర్గప్ప ఆరోగ్య పరిస్థితిని వివరించకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. అయితే దర్గప్ప కనీసం నడవలేని స్థితిలో కాళ్లు సెప్టిక్‌ అయ్యాయని, అంతర్గత అవయవాలు కూడా దెబ్బతిన్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఇదిలా ఉండగా ఇంజినీరింగ్‌ చదువుతున్న దర్గప్ప కుమారుడు తండ్రికి బెయిల్‌ మంజూరు చేయించాలని ఆదోని చెందిన ప్రముఖ న్యాయవాదిని ఆశ్రయించాడు. ఈ బెయిల్‌ పిటిషన్‌పై నేడు తీర్పు వెలువడనుండటం, మరోవైపు హైకోర్టు దర్గప్ప వాంగ్మూలాన్ని ఈనెల 23న తమ ముందుంచాలని ఆదేశించడం ఆసక్తి రేపుతోంది.  

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement