కర్నూలు(అగ్రికల్చర్): డయల్ యువర్ ఏపీఎస్పీడీసీఎల్ సీఎండీ కార్యక్రమం సోమవారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు నిర్వహిస్తున్నట్లు కర్నూలు సర్కిల్ ఎస్ఈ ఆర్.ప్రదీప్కుమార్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. వినియోగదారులు 8977716661 నంబరుకు ఫోన్ చేయవచ్చని పేర్కొన్నారు. కర్నూలు కొత్తబస్టాండు సమీపంలో ఉన్న విద్యుత్ భవన్లో డయల్ యువర్ ఎస్ఈ కార్యక్రమాన్ని సోమవారం నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. వినియోగదారులు ఉదయం 8.30 గంటల నుంచి 9.30 గంటల వరకు 7382614308 నంబరుకు ఫోన్చేసి సమస్యలు పరిష్కరించుకోవచ్చని పేర్కొన్నారు.
ఏడు మండలాల్లో జల్లులు
కర్నూలు(అగ్రికల్చర్): జిల్లాలో శనివారం ఉదయం నుంచి ఆదివారం ఉదయం వరకు ఏడు మండలాల్లో జల్లులు కురిశాయి. దేవనకొండలో 9.4, పత్తికొండలో 5.8, గూడూరులో 5.2, కౌతాళంలో 4.8, ఆదోని–2లో 3.2, ఆదోని–1లో 2.6, ఎమ్మిగనూరులో 2.2 మి.మీ. ప్రకారం వర్షం కురిసింది. జిల్లా సగటున 1.2 మి.మీ. వర్షపాతం మాత్రమే నమోదైంది. రానున్న మూడు రోజుల్లో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
క్వింటా వేరుశనగ రూ.8,702
ఎమ్మిగనూరుటౌన్: స్థానిక వ్యవసాయ మార్కెట్లో ఆదివారం క్వింటా వేరుశనగకు గరిష్టంగా రూ.8,702 ధర లభించింది. మార్కెట్కు 2,932 క్వింటాళ్ల దిగుబడులను రైతులు విక్రయానికి తెచ్చారు. క్వింటా కనిష్ట ధర రూ.2,100, మధ్యస్థ ధర రూ.6,230 ప్రకారం వ్యాపారులు కొనుగోలు చేశారని మార్కెట్ యార్డ్ ప్రత్యేక శ్రేణి కార్యదర్శి పి.కల్పన తెలిపారు.
పోటెత్తిన భక్తులు
శ్రీశైలంటెంపుల్: శ్రీశైల మహాక్షేత్రానికి ఆదివారం భక్తులు పోటెత్తారు. వరుసగా రెండు రోజుల రెండో శనివారం, ఆదివారం సెలవులు కలసి రావడంతో భ్రమరాంబా మల్లికార్జున స్వామిఅమ్మవార్ల దర్శనానికి వేలాది మంది భక్తులు తరలివచ్చారు. వేకువజాము నుంచే పాతాళగంగలో పుణ్యస్నానాలు ఆచరించిన భక్తులు మల్లన్న దర్శనానికి ఆలయ క్యూలైన్ల వద్ద బారులు తీరారు. భక్తుల రద్దీతో ఉచిత, శీఘ్ర, అతిశీఘ్ర దర్శన క్యూలైన్లు నిండిపోయాయి. భక్తుల రద్దీ దృష్ట్యా భక్తులందరికీ సౌకర్యవంతమైన దర్శనం కల్పించేందుకు మల్లికార్జున స్వామివారి అలంకార దర్శనం మాత్రమే కల్పించారు. భక్తుల శివనామ స్మరణతో ఆలయ ప్రాంగణం మారుమోగింది. భక్తుల రద్దీతో క్షేత్ర పురవీధులు కళకళలాడాయి.


