పత్తికొండ: అధికార పార్టీ నాయకులు సొంత ఆదాయం కోసం పత్తికొండ మార్కెట్ యార్డులో సరికొత్త వ్యాపారానికి తెరదీశారు. కొత్త మండీలు ఏర్పాటు చేస్తే చంపుతామని బెదిరింపులకు పాల్పడుతున్నారు. తాము చెప్పిన చెప్పిన ధరలకే రైతులు పంటలను విక్రయించి పోవాలని ఆదేశాలు జారీ చేస్తున్నారు. మార్కెట్ ఏర్పడినప్పటి నుంచి గతంలో ఎప్పుడూ ఇలాంటి పరిస్థితులు రాలేదు.
పక్కా ప్రణాళికతో...
టమాట, పచ్చి మిరప, చౌళకాయులు, బెండ, వంకాయలు తదితర కూరగాయలు పత్తికొండ ప్రాంతంలో విరివిగా పండిస్తారు. పంట చేతికొచ్చిన తరువాత విక్రయం కోసం వాటిని రైతులు పత్తికొండ వ్యవసాయ మార్కెట్కు తీసుకువస్తారు. ఇక్కడ కోనుగోలు చేసిన కూరగాయలను ప్రతిరోజు తమిళనాడు, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలకు లారీల్లో ఎగుమతులు చేస్తారు. కూరగాయలు అమ్మితే వచ్చిన డబ్బుతో రైతు కుటుంబాలే కాదు మార్కెట్ కూడా స్థిరమైన ఆదాయం వస్తుంది. ఈ నేపథ్యంలో మార్కెట్లోని ఆదాయంపై కూటమి నాయకులు కన్నుపడింది. ప్రణాళికతో మార్కెట్ యార్డులో సరికొత్త వ్యాపారానికి తెరదీశారు.
మండీల ఏర్పాటుకు బ్రేకులు!
కొత్త వ్యాపారులు రాక కోసం ప్రతి ఏడాది అధికారులు అనుమతితో కొత్త మండీలను స్థానిక వ్యాపారులు ఏర్పాటు చేస్తుంటారు. అంతే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి కూరగాయులు కొనుగోలు కోసం వ్యాపారులను తీసుకు వస్తుంటారు. ఇది నిరంతరం జరిగే ప్రక్రియ. ఇటీవల దీనికి బ్రేకులు పడుతున్నాయి. కొత్త మండీలు ఏర్పాటు చేస్తే చంపుతామని బెదిరింపులకు పాల్పడుతూ అడ్డుకుంటున్నారు. ఇటీవల కాలంలో ఇద్దరు మండీదారులకు ఇలాంటి అనుభవం మార్కెట్లో ఎదురైంది. దీంతో అధికార పార్టీ నాయకులను ఎదురించలేక లోలోపల మదనపడుతున్నారు. ఈచర్యతో కొత్త మండీలు ఏర్పాటు చేయడం లేదు. దీంతో ఇతర ప్రాంతాల నుంచి వ్యాపారులు రావడం లేదు. కూటమి నాయకులు కనుసన్నలలో జరిగే మండీల వారు చెప్పిన ధరకే రైతులు అమ్మాలి. దీంతో రైతులు గిట్టుబాటు ధర లేక తీవ్రంగా నష్టపోతున్నారు.
నేను వారం రోజుల కిందట బాధ్యతలు స్వీరించాను. లైసెన్స్దారుల నుంచి డబ్బులు వసూలు చేశారన్న కారణంతో సూపర్వైజర్పై జిల్లా అధికారులు చర్యలు తీసుకున్నారు. ఇదంతా నేను బాధ్యతలు తీసుకోక ముందే జరిగింది. ఇక నుంచి అలాంటి తప్పిదాలు జరగకుండా చూసుకుంటాం. వ్యవసాయ మార్కెట్లో రైతులకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటాం.
–సునీత, పత్తికొండ వ్యవసాయ మార్కెట్
ఇన్చార్జ్ కార్యదర్శి
పత్తికొండ మార్కెట్ యార్డులో
అధికార పార్టీ నాయకుల ఇష్టారాజ్యం
నూతన మండీలు ఏర్పాటు చేయొద్దని
హెచ్చరికలు
కొత్త వ్యాపారులు రాకుండా అడ్డుకట్ట
అవినీతి, అక్రమాలు
పత్తికొండ వ్యవసాయ మార్కెట్లో పని చేస్తున్న సూపర్వైజర్ హర్షద్ను కొద్ది రోజులు క్రితం జిల్లా ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. మార్కెట్లో ఒక్కో లైసెన్స్దారు నుంచి లక్ష రూపాయలు దాకా వసూలు చేశారు. కొత్త మండీల ఏర్పాటు విషయంలో కొద్దిరోజులుగా గొడవలు జరగడంతో అక్రమాలు విషయం బయటపడింది. దీంతో పలువురు లైసెన్స్దారులు నేరుగా జిల్లా ఉన్నతాధికారులకు అధారాలతో ఫిర్యాదు చేశారు. దీంతో విచారణ జరిపి సూపర్వైజర్పై అధికారులు చర్యలు తీసుకున్నారు.


