ఇతర రాష్ట్రాల వైద్యులు ఏపీఎంసీలో రిజిస్ట్రేషన్ లేకుండానే ప్రాక్టీస్ చేయొచ్చట
ఎన్ఓసీ కూడా అవసరం లేదట.. రాష్ట్రంలోకి వచ్చే వైద్యులపై కనీస నియంత్రణ కరవు
నకిలీ వైద్యులు రాష్ట్రంలో చొరబడటానికి మార్గం సుగమం చేసిన బాబు సర్కార్
ఏపీ మెడికల్ కౌన్సిల్ను నిర్వీర్యం చేస్తూ జీవో 81 జారీ
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ప్రజారోగ్యాన్ని, వైద్య రంగాన్ని చంద్రబాబు ప్రభుత్వం తీవ్రమైన సంక్షోభంలోకి నెట్టేసింది. కార్పొరేట్ శక్తుల ప్రయోజ నాల కోసం ఏకంగా ప్రజల ప్రాణాలకే రక్షణ లేకుండా చేసింది. ఇతర రాష్ట్రాల వైద్యులు ఏపీ మెడికల్ కౌన్సిల్లో నో అబ్జెక్షన్ సర్టిఫికెట్(ఎన్ఓసీ) సమ ర్పణ, స్థానికంగా రిజిస్ట్రేషన్ చేసుకునే అవసరం లేదని సాక్షాత్తు రాష్ట్ర ప్రభుత్వం జీవో 81ని జారీ చేసింది. ఇతర రాష్ట్రాల వైద్యుల విషయంలో చంద్రబాబు ప్రభుత్వం ఇచ్చిన ఈ జీవో కోట్లాది మంది రాష్ట్ర ప్రజల ప్రాణాలకు, ఆరోగ్యానికి పెను ముప్పుగా పరిణమించే ఆస్కారం ఉందని వైద్యనిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దేశంలో మరే రాష్ట్రంలో ఇలాంటి ప్రమాదకర విధానం లేదని చెబుతున్నారు.
రాష్ట్ర కౌన్సిల్ నిర్వీర్యం
రాష్ట్రంలో వైద్య ప్రమాణాలను పర్యవేక్షించడానికి, అర్హులైన వైద్యులను గుర్తించడానికి ఏపీఎంసీ అత్యున్నత చట్టబద్ధమైన సంస్థగా పనిచేస్తోంది. వైద్య విద్య పూర్తి చేసుకున్న వైద్యుల రిజిస్ట్రేషన్, రెన్యూవల్, వారిపై వచ్చే ఎథికల్ కేసుల విచారణ, చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడం వంటి కార్యకలాపాలు పూర్తిగా కౌన్సిల్ పరిధిలోనే నడవాలి.
కౌన్సిల్ నిబంధనల ప్రకారం దేశంలోని ఇతర రాష్ట్రాల వైద్యులు ఏపీలో ప్రాక్టీస్ చేయాలంటే తొలుత వారు అప్పటికే రిజిస్టర్ అయిన కౌన్సిల్ నుంచి ఎన్ఓసీ సమర్పించి, మన దగ్గర స్థానిక రిజిస్ట్రేషన్ పొందాలి. ఈ ప్రక్రియలో ఏదైనా మార్పు చేయాలంటే తొలుత కౌన్సిల్లో చర్చించి, నిబంధనల్లో సవరణలు చేయాల్సి ఉంటుంది. ఇదిలా ఉండగా కౌన్సిల్కు కనీస సమాచారం లేకుండా బాబు సర్కారు జీవో 81ని తెచ్చింది. ఈ క్రమంలో ఇంత అడ్డగోలు ప్రక్రియ దేశంలో మరెక్కడా లేదని కౌన్సిల్ సభ్యులే వెల్లడిస్తున్నారు.
డీరెగ్యులేషన్ 2.0 సాకుతో అరాచకం
దేశంలో పరిశ్రమలు, వ్యాపారాలపై నిబంధనల భారాన్ని తగ్గించడం కోసం కేంద్ర ప్రభుత్వం డీరెగ్యులేషన్ 2.0 సంస్కరణలు తెచ్చింది. వీటి అమలు సాకుతో ప్రజల ప్రాణాలనే ప్రమాదంలోకి నెట్టేస్తూ అరాచకాలకు బాబు సర్కారు పాల్పడుతోంది. డీరెగ్యులేషన్ కింద కొన్ని సంస్కరణలు తేవాలని కేంద్రం కేవలం సిఫార్సులు మాత్రమే చేసింది. వాటి అమలు తప్పనిసరి కాదు.
ఈ క్రమంలో ఇప్పటి వరకూ అనేక రాష్ట్రాల కౌన్సిల్స్ వాటి అమలుపై ఇంకా నిర్ణయాలు తీసుకోలేదు. మహారాష్ట్రలో ఆ రాష్ట్ర మెడికల్ కౌన్సిల్లో సిఫార్సులపై చర్చించి నిర్ణయం తీసుకున్నారు. ఇతర రాష్ట్రాల కౌన్సిల్స్లో నమోదైన వైద్యులు మహారాష్ట్రలో ప్రాక్టీస్ చేయడానికి ఎన్ఓసీ సమర్పణ నిబంధనను మాత్రమే సడలించారు. రిజిస్ట్రేషన్ ప్రక్రియ మాత్రం యథావిధిగా కొనసాగుతోందని ఆ రాష్ట్ర కౌన్సిల్ ప్రకటించింది. ఇదిలా ఉంటే ఏపీలో మాత్రం ఎన్ఓసీ, రిజిస్ట్రేషన్ ప్రక్రియను ఎత్తేస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో ఇచ్చింది.
నకిలీ వైద్యుల చొరబాటుకు ఆస్కారం
జీవో 81 నకిలీ వైద్యులకు ఏపీలో రెడ్ కార్పెట్ లాంటిదని వైద్యులు విమర్శిస్తున్నారు. ఈ జీవో ప్రకా రం ఆన్లైన్ పోర్టల్ ద్వారా ఇతర రాష్ట్రాల వైద్యులు ఏపీలో ప్రాక్టీస్ చేయడానికి డిక్లరేషన్, తమ వివ రాలు సమర్పిస్తే చాలు. వాటిని ధ్రువీకరించాక రిజి స్ట్రేషన్ వంటి ప్రక్రియ ఉండదు. ఈ క్రమంలో నకి లీ వైద్యులను గుర్తించడం అసాధ్యంగా మారు తుంది.
పక్క రాష్ట్రాల్లో డిగ్రీలు లేకుండా ప్రాక్టీస్ చేస్తూ దొరికిపోయిన వారు, అక్కడ మెడికల్ కౌన్సిల్స్ చేత సస్పెండ్ చేయబడిన నకిలీ వైద్యులు ఏపీలోకి సుల భంగా చొరబడటానికి ఆస్కారం ఉంది. దేశంలో 35 రాష్ట్ర, కేంద్రపాలిత మెడికల్ కౌన్సిల్స్ ఉన్నాయి. వీటిలో ఇప్పటి వరకూ మెజార్టీ శాతం కౌన్సిల్స్ సమాచారం పూర్తి స్థాయిలో డిజిటలైజ్ కాలేదు. ఏపీలో ప్రాక్టీస్ చేస్తామని వైద్య విద్య సర్టిఫికెట్లు సమర్పిస్తే అవి సరైనవో కాదో పరిశీలించే ఆన్లైన్ మెకానిజం కూడా లేదు.
వైద్యుల వన్ నేషన్ వన్ రిజిస్ట్రేషన్ విధానం అమలుపై అత్యంత కీలకమైన నేషనల్ మెడికల్ కమిషన్(ఎన్ఎంసీ), మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా(ఎంసీఐ) సైతం ఇప్పటి వరకూ నిర్మాణాత్మక నిర్ణయాలు తీసుకోలేదు. ఈ నేపథ్యంలో ఏపీఎంసీలో రిజిస్టర్ కాని వైద్యులు రాష్ట్రంలో చికిత్సలు చేసి రోగి ప్రాణాలకు ముప్పు వాటిల్లితే వారిపై చర్యలు తీసుకోవడానికి చిక్కులు తలెత్తే అవకాశం ఉంది.


