
సత్తెనపల్లి ఎంపీడీవో శ్రీనివాసరెడ్డికి ఫిర్యాదు చేస్తున్న కనుమూరి వజన. పక్కన భర్త విశ్వేశ్వరరావు
ఉచిత టైలరింగ్ శిక్షణకు రావద్దు
ఇద్దరు మహిళలకు ఆదేశాలు
సత్తెనపల్లి: మాజీ సీఎం, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ సత్తెనపల్లి పర్యటన విజయవంతం కావడంతో ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోంది. సత్తెనపల్లి మండలం నందిగామ అడ్డరోడ్డు సమీపంలోని డంపింగ్ యార్డ్ కేంద్రంలో బీసీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ప్రభుత్వం మహిళలకు ఉచిత టైలరింగ్ శిక్షణ ఇస్తోంది. సత్తెనపల్లి మండలం లక్కరాజుగార్లపాడు గ్రామానికి చెందిన కనుమూరు వనజ, నర్రా మల్లేశ్వరి ఈ శిక్షణకు వెళుతున్నారు. అయితే గురువారం వైఎస్ జగన్ సత్తెనపల్లి పర్యటనలో వారి భర్తలు కనిపించారంటూ టీడీపీ నాయకులు ఫిర్యాదు చేశారు.
దీంతో ఇకపై శిక్షణకు రావద్దు అంటూ నిర్వాహకులు నాగదుర్గ, ఈశ్వరి ఆదేశించారు. దీంతో వారు తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. మల్లేశ్వరి కంటతడి పెట్టుకుని వెళ్లిపోగా, వనజ మాత్రం న్యాయ పోరాటానికి దిగింది. జరిగిన విషయాన్ని భర్త విశ్వేశ్వరరావుకు చెప్పి, శుక్రవారం సత్తెనపల్లి ఎంపీడీవో బండి శ్రీనివాసరెడ్డిని కలిసి వినతి పత్రం అందజేసింది. తాము ప్రారంభం నుంచి శిక్షణకు హాజరవుతున్నామని, ఏ ఉద్దేశంతో శిక్షణకు రావద్దని చెప్పారో తెలపాలని, న్యాయం చేయాలని కోరింది. బీసీ కార్పొరేషన్ జిల్లా అధికారులతో పాటు కలెక్టర్ను కూడా కలిసి సమస్య విన్నవించుకుంటానని, అసలు ఈ విషయంలో రాజకీయ పారీ్టల జోక్యం ఏంటని నిలదీసింది. న్యాయం జరిగే వరకూ పోరాడతానని స్పష్టం చేసింది.