పంట నష్టం అంచనాలో వ్యవసాయ శాఖ | Department of Agriculture in crop damage assessment | Sakshi
Sakshi News home page

పంట నష్టం అంచనాలో వ్యవసాయ శాఖ

Aug 19 2020 3:16 AM | Updated on Aug 19 2020 3:16 AM

Department of Agriculture in crop damage assessment - Sakshi

పశ్చిమ గోదావరి జిల్లా ముక్కామలలో నీట మునిగిన పంటలు

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ప్రస్తుతం కురుస్తున్న వర్షాలు, వరదలతో పంటలకు కలిగిన నష్టంపై వ్యవసాయ శాఖ అంచనా వేస్తోంది. 27 వేలకు పైగా హెక్టార్లలో ఆహార, ఉద్యాన పంటలు దెబ్బతిన్నాయని ప్రాథమికంగా అంచనా వేసింది. ఇందులో 22,160.5 హెక్టార్లలో ఆహార పంటలు, 5,570.22 హెక్టార్లలో ఉద్యాన పంటలున్నాయి.

► వరదలు తగ్గాక ఉభయగోదావరి జిల్లాల్లో పంట నష్టాన్ని అంచనా వేస్తారు.  ప్రాథమికంగా పది రకాల ఆహార పంటలు దెబ్బతిన్నట్టు గుర్తించారు. నష్టపోయిన పంటల్లో మొక్కజొన్న, పెసర ఎక్కువ. ఒక్క కర్నూలు జిల్లాలోనే సుమారు 13,368.8 హెక్టార్లలో పంటలు దెబ్బతిన్నాయి. ఈ జిల్లాలో ప్రధానంగా మొక్కజొన్నకు నష్టం జరిగింది. 
► శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో 205, పశ్చిమగోదావరిలో 1,813.07, తూర్పుగోదావరిలో 2,812, కృష్ణాలో 3,909, విశాఖలో 52 హెక్టార్లలో ఆహార పంటలు దెబ్బతిన్నాయి. 
► గోదావరి డెల్టా ప్రాంతంలో వరి నారుమళ్లల్లో నీళ్లు నిలిచి ఉన్నట్టు గుర్తించారు. 
► కృష్ణా జిల్లా నందిగామ ప్రాంతంలో పెసర పంట దెబ్బతింది.
► ఇక నష్టపోయిన ఉద్యాన పంటల్లో ప్రధానంగా అరటి, పసుపు, కంద, బొప్పాయి, తమలపాకు తోటలు, కూరగాయల పంటలు ఉన్నాయి. కృష్ణా జిల్లాలో 44.60, తూర్పుగోదావరిలో 4,839.10, పశ్చిమగోదావరిలో 686.52 హెక్టార్లలో ఉద్యాన పంటలు దెబ్బతిన్నాయి.  

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement