దుర్గమ్మ ఆలయంలోకి దళితులకు అనుమతి నిరాకరణ | Dalits denied entry into Durga temple | Sakshi
Sakshi News home page

దుర్గమ్మ ఆలయంలోకి దళితులకు అనుమతి నిరాకరణ

Jun 29 2025 5:17 AM | Updated on Jun 29 2025 5:17 AM

Dalits denied entry into Durga temple

సీఎం చంద్రబాబు సొంత మండలం చంద్రగిరిలో దారుణ

శ్రీనివాస మంగాపురంలో ఆందోళనకు దిగిన దళితులు  

చంద్రగిరి: రాష్ట్రంలో కులవివక్ష కోరలు చాస్తోంది. దళితులపై «అరాచకాలు తీవ్రస్థాయికి చేరాయి. ఈసారి ఏకంగా సీఎం చంద్రబాబు సొంత మండలమైన తిరుపతి జిల్లా చంద్రగిరిలో దళితులు తీవ్ర అవమానానికి గురయ్యారు. స్థానిక కనకదుర్గమ్మ ఆలయంలోకి దళితులకు అనుమతి లేదంటూ కొందరు అడ్డుకోవడం.. ఉద్రిక్త పరిస్థితులకు దారితీసింది. బాధితులు తెలిపిన వివరాలు.. తిరుపతి జిల్లా శ్రీనివాసమంగాపురంలో  శ్రీకనకదుర్గమ్మకు తరతరాలుగా గ్రామస్తులు పూజలు చేస్తున్నారు. 

కొన్నేళ్ల క్రితం సింగు అనే సామాజికవర్గానికి చెందిన వారు శ్రీనివాసమంగాపురానికి వచ్చి అమ్మవారు తమ కులదైవమని.. ఇక్కడ పూజలు చేసుకుంటామని గ్రామ పెద్దల అనుమతి పొందారు. ఆ తర్వాత ఏడాదికోసారి వచ్చి పెద్ద ఎత్తున అమ్మవారికి పూజలు చేసి.. మొక్కులు చెల్లిస్తున్నారు. ఈ క్రమంలో ఆలయ అభివృద్ధి కమిటీ పేరుతో ఓ ట్రస్ట్‌ను సైతం రిజిస్టర్‌ చేయించుకున్నారు. దీంతో మూడు నెలల క్రితం గ్రామస్తులకు, సింగులకు మధ్య వివాదం తలెత్తింది. ఆలయం తమదంటే.. తమదంటూ గొడవలు పడ్డారు. 

ఈనేపథ్యంలో గురువారం రాత్రి గ్రామానికి చెందిన కొందరు దళిత మహిళలు కనకదుర్గమ్మ దర్శనం కోసమని ఆలయానికి వెళ్లారు. వారిని ఆలయంలోని కొందరు వ్యక్తులు అడ్డుకున్నారు. మీరు ఆలయంలోకి రావడానికి వీల్లేదని అవమానించి వెనక్కి పంపించేశారు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన దళితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో శనివారం దళితులు అమ్మవారి ఆలయం వద్దకు చేరుకొని ఆందోళనకు దిగారు. 

తమకు అమ్మవారి ఆలయంలోకి ప్రవేశం కల్పించాలని డిమాండ్‌ చేశారు. వారంలో మూడు రోజులు వచ్చి పూజలు చేసుకునే సింగులు ఆలయం తమదనడం సమంజసం కాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం సొంత మండలంలోనే దళితులకు ఇంతటి అవమానం జరిగినా.. అధికారులు చర్యలు తీసుకోవడం లేదని దళిత సంఘాల నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు స్పందించి న్యాయం చేయకపోతే.. ఉద్యమిస్తామని హెచ్చరించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement