కోరలు చాచిన కుల వివక్ష | Dalit teacher insulted in tirupati | Sakshi
Sakshi News home page

కోరలు చాచిన కుల వివక్ష

Jun 22 2025 5:29 AM | Updated on Jun 22 2025 5:31 AM

Dalit teacher insulted in tirupati

అధ్యాపకుడు రవివర్మతో మాట్లాడుతున్న వీసీ రమణ, అధ్యాపకులు

తిరుపతిలో దళిత అధ్యాపకునికి తీవ్ర అవమానం 

కింద కూర్చుని విధులు నిర్వహిస్తున్న వైనం

అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ చాంబర్‌లో కుర్చిలు తొలగించిన ప్రిన్సిపాల్‌ 

కింద కూర్చుని విధులు నిర్వహిస్తున్న అధ్యాపకుడు  

దళితుడినని చిన్నచూపుతో అవమానిస్తున్నారంటూ ఆవేదన  

తిరుపతి సిటీ: రాష్ట్రంలో కులవివక్ష కోరలు చాస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీలపై «అరాచకాలు తారస్థాయికి చేరాయి. తాజాగా.. ఓ సరస్వతీ పుత్రుడు సైతం సాక్షాత్తు చదువులమ్మ ఒడిలో ఈ దారుణానికి గురికావడం సంచలనంగా మారింది. అగ్రవర్ణ అహంకారంతో తోటి అధికారే ఈ నిర్వాకానికి పాల్పడడం కలకలం రేపింది. ఆధ్యాత్మిక రాజధాని తిరుపతిలో వెలుగుచూసిన ఈ దారుణ ఘటన సమాజం సిగ్గుపడేలా చేసింది. అమానవీయమైన ఈ ఘటనపై దళిత సంఘాలు

భగ్గుమంటున్నాయి. వివరాలివీ.. 
తిరుపతి ఎస్వీ వెటర్నరీ వర్సిటీలోని డెయిరీ టెక్నాలజీ కళాశాలలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న వి. రవివర్మ సెలవుపై వెళ్లి శనివారం విధులకు వచ్చారు. తన ఛాంబర్‌లోకి వెళ్లిచూడగా టేబుల్, కుర్చీలు తొలగించి ఉండటం చూసి అవాక్కయారు. దీనిపై కళాశాల సిబ్బందితో ఆరా తీయగా ప్రిన్సిపాల్‌ తొలగించారని చెప్పారు. దీంతో నేలపై కూర్చుని తన విధులను నిర్వర్తించారు. కళాశాల విద్యార్థుల ముందు తనను అవమానించడంతో ఆయన మనస్తాపానికి గురై వీసీకి ఫిర్యాదు చేశారు.  

దళితుడనే కారణంతోనే వేధిస్తున్నారు.. 
ఈ ఘటనపై బాధితుడు రవివర్మ మాట్లాడుతూ.. ‘ఎస్వీ వెటర్నరీ వర్సిటీలో ఎస్సీ ఉద్యోగులపై ఓ వర్గం అరాచకాలకు పాల్పడుతోంది. డెయిరీ కళాశాలలో ఎనిమిదేళ్లుగా అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నాను. ఇక్కడ రాజకీయాలు, వర్గపోరు తారస్థాయిలో రాజ్యమేలుతున్నాయి. దళితులను అగ్రవర్ణ కులాల అధ్యాపకులు వేధించడం పరిపాటిగా మారింది. పలుమార్లు డెయిరీ కళాశాల ప్రిన్సిపాల్‌ నన్ను అవమానిస్తూ వచ్చినా భరించాను. దళితుడిననే కారణంతో మానసికంగా కూడా ఇబ్బందులకు గురిచేశారు.

శనివారం అకారణంగా నా చాంబర్‌లోకి వచ్చి టేబుల్, కుర్చీలను తొలగించారు. కంప్యూటర్, ప్రింటర్, ఫైల్స్‌ను చెల్లాచెదురుగా కింద పడేసి వెళ్లారు. ఈ ఘటనపై ప్రిన్సిపాల్‌ను ప్రశ్నించగా పట్టించుకోకుండా సమాధానం దాటవేశారు. దీంతో.. వీసీని కలిసి ఫిర్యాదుచేశా. వీసీ నా ఛాంబర్‌లోకి వచ్చి పరిస్థితిని గమనించి ప్రిన్సిపాల్‌ను వివరణ కోరేందుకు ఫోన్‌చేయగా ఆయన వీసీ కాల్‌కు సైతం సరైన సమాధానం ఇవ్వలేదు’ అని చెప్పారు. 

సమస్య పరిష్కారానికి కృషి చేస్తున్నాం
అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ కుర్చీని తొలగించారనే విషయం నా దృష్టికి వచ్చింది. వెంటనే ఆయన ఛాంబర్‌ను పరిశీలించి అధ్యాపకుడు రవివర్మతో మాట్లాడి  విషయం తెలుసుకున్నాను. వెంటనే ప్రిన్సిపాల్, ఆ విభాగాధిపతితో మాట్లాడాను. సమస్యను తెలుసుకుని పరిష్కరించేందుకు కృషిచేస్తున్నాం. అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ ఛాంబర్‌లో ఫర్నీచర్‌ను ఏర్పాటుచేశాం. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటాం.  – జేవీ రమణ, 
వీసీ, ఎస్వీ వెటర్నరీ వర్సిటీ, తిరుపతి 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement