
కర్నూలు (అర్బన్): గ్రామీణ నీటి సరఫరా విభాగం జోన్–4 ఇంజినీర్ల బదిలీల కౌన్సెలింగ్ ఈ నెల 27న ఉదయం 9.30 గంటల నుంచి కర్నూలులోని సర్కిల్ కార్యాలయంలో నిర్వహించనున్నట్లు పర్యవేక్షక ఇంజినీర్ బి.నాగేశ్వరరావు సోమవారం తెలిపారు. ఆర్డబ్ల్యూఎస్ చీఫ్ ఇంజనీర్ గాయత్రీదేవి పర్యవేక్షణలో ఈ కౌన్సెలింగ్ కొనసాగుతుందని చెప్పారు.
జోన్–4 పరిధిలో ఉమ్మడి కర్నూలు, అనంతపురం, వైఎస్సార్ కడప, చిత్తూరు జిల్లాలకు చెందిన ఏఈఈ/ఏఈ, డీఈఈలు వస్తారని, ఏఈఈ/ఏఈలకు సంబంధించి 84 ఖాళీలు ఉండగా, 114 స్థానాలు ఖాళీ ఏర్పడబోతున్నాయని వివరించారు. డీఈఈలకు 11 స్థానాలు క్లియర్ వేకెన్సీ కాగా, మరో 11 స్థానాలు ఖాళీ కాబోతున్నాయన్నారు. బదిలీలకు అర్హులైన వారితో పాటు పలు కారణాలతో రిక్వెస్ట్ కోరుతూ మరికొందరు దరఖాస్తు చేసుకున్నారని తెలిపారు. కౌన్సెలింగ్ నిర్వహించే సమయంలో కార్యాలయ ప్రాంగణంలోని నోటీస్ బోర్డులో ఖాళీలు, భర్తీ అయిన స్థానాల వివరాలను పొందుపరుస్తామని చెప్పారు.