
సచివాలయం– పంచాయతీరాజ్ శాఖల మధ్య సమన్వయ లోపం
అనిశ్చితిలో ఉద్యోగులు
సాక్షి, అమరావతి: ప్రభుత్వం చేపట్టిన ఉద్యోగుల బదిలీల ప్రక్రియలో గ్రామ, వార్డు సచివాలయాల్లో పనిచేస్తున్న గ్రేడ్–5, గ్రేడ్–6 (డిజిటల్ అసిస్టెంట్లు) పంచాయతీ కార్యదర్శుల బదిలీల విషయంలో తీవ్ర అస్పష్టత నెలకొంది. సంబంధిత శాఖ మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామి సచివాలయాల ఉద్యోగులకు ప్రస్తుతం బదిలీలు లేవని ప్రకటించారు.
అయితే, పంచాయతీరాజ్– గ్రామీణాభివృద్ధి శాఖ విడుదల చేసిన మార్గదర్శకాల్లో మాత్రం పంచాయతీ కార్యదర్శుల గ్రేడ్లు (5, 6) స్పష్టంగా ప్రస్తావించకుండా ఆదేశాలు జారీ చేయడం గందరగోళానికి కారణమైంది. రెండు శాఖల మధ్య సమన్వయ లోపంతో దాదాపు 20 వేల మంది పంచాయతీ కార్యదర్శుల బదిలీలపై అస్పష్టత నెలకొంది.
చర్యలపై విభిన్న ధోరణులు
ఒకవైపు, పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ కార్యాలయం అన్ని జిల్లాల డీపీవోలు, జెడ్పీ సీఈవోలతో మూడు రోజుల క్రితం నిర్వహించిన టెలికాన్ఫరెన్స్లో బదిలీకి సంబంధించిన అధికార ఉత్తర్వులు రాకపోయినా, గ్రేడ్ 5, 6 ఉద్యోగుల దరఖాస్తులు స్వీకరించాలంటూ సూచనలు ఇచ్చింది.
అదే సమయంలో, గ్రామ వార్డు సచివాలయాల శాఖ బదిలీలకు మినహాయింపు కల్పించాలని ప్రతిపాదిస్తూ ప్రభుత్వానికి ఫైల్ పంపినట్లు తెలుస్తోంది. అయితే దీనిపై జీఓ విడుదల కాలేదు. ఈ గందరగోళం నేపథ్యంలో కొన్ని జిల్లాల్లో ఆయా కేటగిరీల్లోని ఉద్యోగుల నుండి బదిలీ దరఖాస్తులు మొదటినుంచి స్వీకరిస్తుండగా, మరికొన్ని జిల్లాల్లో మాత్రం తాజాగా దరఖాస్తులు స్వీకరించినట్లు సమాచారం.
ఉద్యోగుల్లో అయోమయం
రాష్ట్రంలో సచివాలయాల వ్యవస్థ ఏర్పాటుకు ముందు పంచాయతీరాజ్ శాఖ పరిధిలో నాలుగు గ్రేడ్లలో పంచాయతీ కార్యదర్శులు బాధ్యతలు నిర్వహించేవారు. సచివాలయాల ఏర్పాటు సమయంలో కొత్తగా నియమాకాలు జరిగిన గ్రేడ్ 5, 6 పంచాయతీ కార్యదర్శులు ‘పంచాయతీరాజ్ శాఖ’ ఉద్యోగులుగా సచివాలయాల్లో పనిచేస్తున్నారు.
దీంతో ఆ రెండు కేటగిరి ఉద్యోగులు తమకు ఏ శాఖ ఆదేశాలు మేరకు బదిలీల ప్రక్రియ కొనసాగుతుందో తెలియక తికమక పడుతున్నారు. అలానే, ఒక శాఖ అధికారులు దరఖాస్తులు స్వీకరించాలంటూ సూచనలు చేయగా, మరో శాఖ ప్రభుత్వం వద్ద బదిలీల నిలుపుదలను ప్రతిపాదించడంతో ఆఖరి నిమిషంలో ఏం జరుగుతుందోనన్న సందేహం ఉద్యోగుల్లో నెలకొంది.