
జూన్ ముగుస్తున్నా మీనమేషాలు లెక్కిస్తున్న ప్రభుత్వం
సింగిల్ మేజర్ స్థానంలో డ్యూయల్ మేజర్ అమలుపై సందిగ్ధత
నెల రోజుల కిందట అకడమిక్ ఎక్స్పర్ట్స్ కమిటీ డ్యూయల్ మేజర్ సిఫారసులు
తీవ్ర జాప్యంలో కళాశాలల నుంచి అభిప్రాయ సేకరణ
ఉన్నత విద్యాశాఖ, ఉన్నత విద్యా మండలి మధ్య కొరవడిన సమన్వయం లోపం
ఉన్నత విద్యను గాలికొదిలేశారంటూ మంత్రి లోకేశ్పై విమర్శలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో సంప్రదాయ డిగ్రీ విద్య ప్రవేశాల్లో గందరగోళం నెలకొంది. విద్యా సంవత్సరం ప్రారంభమై.. జూన్ నెల ముగిసిపోతున్నా ప్రవేశాల నిర్వహణపై స్పష్టత కొరవడింది. ఉన్నత విద్యా మండలి, ఉన్నత విద్యాశాఖ మధ్య కొరవడిన సమన్వయ లోపం విద్యార్థుల పాలిట శాపంగా మారింది. వాస్తవానికి అకడమిక్ వ్యవహారాల్లో విశ్వవిద్యాలయాలు, ఉన్నత విద్యా మండలి పాత్ర కీలకంగా ఉంటుంది. వీటిల్లో ప్రభుత్వ జోక్యం చాలా తక్కువే! కానీ, కూటమి ప్రభుత్వంలో వ్యవస్థల మధ్య ఆధిపత్య పోరు నివురుగప్పిన నిప్పులా ఉండటంతో సమస్య ఎంతకీ తెగకపోవడం గమనార్హం.
మరోవైపు తెలంగాణలో డిగ్రీ ప్రవేశాలు ముగింపు దశలో ఉండగా ఈ నెలాఖరు నుంచి తొలి ఏడాది తరగతులను ప్రారంభించనుంది. దీనికి పూర్తి విరుద్ధంగా ఏపీలో ప్రవేశాల ఊసే ప్రశ్నార్థకంగా కనిపిస్తోంది. తెలంగాణాలో ‘దోస్త్’ పోర్టల్ ద్వారా ఆన్లైన్ డిగ్రీ ప్రవేశాలు చేపడితే.. ఏపీ తిరోగమనంలో ఆన్లైన్ ప్రవేశాల రద్దుకు ముందుకెళ్తోంది. ఉన్నత విద్యాశాఖలో బహిరంగంగా ఇంత జరుగుతుంటే విద్యాశాఖ మంత్రి లోకేశ్ తన శాఖను గాలికొదిలేసి వ్యవహరిస్తున్నారనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.
అభిప్రాయ సేకరణలో తీవ్ర జాప్యం
కూటమి సర్కారు గత ప్రభుత్వంలో తీసుకొచ్చిన విద్యా సంస్కరణలపై ఆది నుంచి విషం కక్కుతూనే ఉంది. ఇందులో భాగంగానే అధికారంలోకి వచ్చిన తర్వాత సింగిల్ మేజర్ను తొలగించాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో సర్కారు ఏర్పాటు చేసిన ఎక్స్పర్ట్స్ కమిటీ డ్యూయల్ మేజర్ విధానాన్ని సిఫారసు చేసింది. నెల రోజుల కిందట ఈ విధానాన్ని ప్రవేశపెడుతూ ఉన్నత విద్యా మండలి నోటిఫికేషన్ ఇచ్చింది. కళాశాలల నుంచి కోర్సు కన్వర్షన్ కోసం దరఖాస్తులనూ ఆహ్వానించింది. అయితే, డ్యూయల్ మేజర్పై ఉన్నత విద్యాశాఖ నోట్ రూపంలో క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. దీనికి ఇప్పటికీ అతీగతీ లేదు.
ఇప్పుడు, ఉన్నత విద్యా శాఖ కార్యదర్శి డిగ్రీ కళాశాలలకు వెళ్లి విద్యార్థులు, లెక్చరర్ల నుంచి అభిప్రాయాలు సేకరించడం చర్చనీయాంశమైంది. కమిటీ సిఫారసులు చేసిన ఇన్ని రోజుల తర్వాత అభిప్రాయ సేకరణ చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కూటమి ప్రభుత్వం విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతోందన్న ఆగ్రహం సర్వత్రా వ్యక్తమవుతోంది.
గతంలోని ట్రిపుల్ మేజర్ ఉన్న నేపథ్యంలో ఇప్పుడు సింగిల్ మేజర్ విధానాన్ని రద్దు చేసి డ్యూయల్ మేజర్ను అమలు చేస్తే.. ఏపీలో డిగ్రీ చదివిన విద్యార్థులు మూడు రకాల డిగ్రీ పట్టాలతో కనిపిస్తారు. ఇది భవిష్యత్తులో ఇబ్బందిగా మారుతుందని కొందరు అధికారులు వాదిస్తున్నారు. అందుకే సింగిల్ మేజర్ విధానంలో పొరపాట్లను సవరించి కొనసాగించాలని చెబుతున్నారు.
అఫిలియేషన్ ప్రాసెస్ ఎక్కడ?
విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందు కళాశాలలకు విశ్వవిద్యాలయాల నుంచి అఫిలియేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. కానీ, ఇప్పటి వరకు ఈ ప్రక్రియ ప్రారంభం కాలేదు. గతంలో ఈ ప్రక్రియ ఉచితమే. ఈ ఏడాది నుంచి ప్రభుత్వ సాంకేతిక విభాగం డబ్బులు ఇస్తే తప్ప చేయబోమని తెగేసి చెబుతోంది. ఒక్కో కళాశాల రూ.3,500 చెల్లించాల్సి ఉంది.
డిగ్రీ, ఇంజినీరింగ్, ఎంబీఏ, ఎంసీఏ ఇలా.. అన్ని కళాశాలలు వర్సిటీల నుంచి అఫిలియేషన్ పొందాల్సి ఉండగా.. ప్రక్రియ నిధులతో ముడిపడి ఉండటంతో తీవ్ర జాప్యం జరుగుతోంది. దీనికి తోడు కళాశాలలను సింగిల్ మేజర్ నుంచి డ్యూయల్ మేజర్కు కన్వర్ట్ చేయడానికి సమయం పడుతుంది. వీటన్నింటి ఫలితం ప్రవేశాలపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది.
కళాశాలలకు నోటీసులు..
ప్రస్తుతం 1300 ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలల్లో డిగ్రీ ప్రవేశాలు కల్పిస్తున్నారు. ఇందులో గత మూడేళ్లలో 270 కళాశాలల్లో 25శాతం కంటే తక్కువ ప్రవేశాలు ఉన్నాయి. సున్నా ప్రవేశాలు ఉన్నవి 3 కళాశాలలు ఉన్నాయి. వీటికి ఉన్నత విద్యామండలి నోటీసులు జారీ చేసింది. ప్రత్యేక కమిటీ ఎదుట ఆయా కళాశాలలు వివరణ ఇవ్వాలని ఆదేశించింది. ఈ ప్రక్రియ ముగిస్తే తప్ప ఆ కళాశాలలకు అనుమతులు విషయం తేలదు.
వీటితోపాటు కొత్తగా నియోజకవర్గ, మండల హెడ్ క్వార్టర్లో కళాశాలల ఏర్పాటుకు అనుమతి ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు సమాచారం. డిగ్రీ విద్యలో 4.55 లక్షల సీట్లు ఉంటే పట్టుమని 39 శాతం సీట్లు కూడా భర్తీ కావట్లేదు. ఇలాంటి తరుణంలో కొత్త కళాశాలలకు అనుమతులు ఇవ్వడంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి.