భారీ వర్షాలు, వరదలు.. ఆదుకోండి

CM YS Jagan Writes Letter to Amit Shah Over Flood Situation and Seeks Assistance From Centre - Sakshi

జన జీవితం అస్తవ్యస్తం.. రూ.4,450 కోట్ల మేర నష్టం 

కేంద్ర హోం మంత్రి అమిత్‌షాకు సీఎం వైఎస్‌ జగన్‌ లేఖ

ఆదుకునేందుకు రూ.2,250 కోట్లు ఆర్థిక సాయం చేయండి

తక్షణమే కనీసం రూ.1,000 కోట్లు మంజూరు చేయాలి

నష్టాన్ని అంచనా వేసేందుకు కేంద్ర బృందాన్ని పంపించండి

ఇప్పటికే కోవిడ్‌తో భారీ నష్టం.. ఆపై వర్షాలు, వరదలు 

ఈ సమయంలో రాష్ట్రానికి మీ చేయూత ఎంతో అవసరం

సాక్షి, అమరావతి: భారీ వర్షాలు వరదలతో రాష్ట్రంలో జన జీవితం అస్తవ్యస్తమైందని,తీవ్రంగా నష్టపోయిన రాష్ట్రాన్ని వెంటనే ఆదుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాకు విజ్ఞప్తి చేశారు. రాష్ట్రాన్ని ఆదుకునేందుకు రూ.2,250 కోట్ల ఆర్థిక సహాయం చేయాలన్నారు. పెద్ద ఎత్తున సహాయ కార్యక్రమాలు చేపట్టి, తిరిగి సాధారణ పరిస్థితికి తీసుకు రావడం కోసం తక్షణమే ముందస్తుగా కనీసం రూ.1,000 కోట్లు మంజూరు చేయాలని కోరారు. రాష్ట్రంలో భారీ వర్షాలు, వరదలు, నష్టం గురించి వివరిస్తూ శనివారం ఆయన కేంద్ర హోం మంత్రి అమిత్‌ షాకు లేఖ రాశారు. జరిగిన నష్టాన్ని అంచనా వేసేందుకు కేంద్ర బృందాన్ని పంపాలని విజ్ఞప్తి చేశారు. లేఖలోని వివరాలు ఇలా ఉన్నాయి. 
 
కృష్ణా నదికి వరద పోటు
– బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయు గుండం కారణంగా రాష్ట్రంలో ఈ నెల 9 నుంచి 13వ తేదీ వరకు భారీ వర్షాలు కురిశాయి. ఒక్క 13వ తేదీనే తూర్పు గోదావరి జిల్లా ఐ.పోలవరంలో అత్యధికంగా 265.10 మి.మీ వర్షపాతం నమోదైంది. అదే జిల్లాలోని కాట్రేనికోనలో 228.20 మి.మీ, తాళ్లరేవులో 200.50 మి.మీ, పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడులో 205.30 మి.మీ, పేరవల్లిలో 204.02 మి.మీ వర్షం కురిసింది.
– ఎగువన తెలంగాణ, మహారాష్ట్రలో కూడా భారీ వర్షాలు కురవడంతో కృష్ణా నదికి వరద పోటెత్తింది. దీంతో విజయవాడలోని ప్రకాశం బ్యారేజీతో సహా, పలు చోట్ల మూడు రోజులుగా తీవ్ర ప్రమాద హెచ్చరికలు జారీ చేశాం. లోతట్టు ప్రాంతాల వారిని సురక్షిత ప్రాంతాలకు (సహాయ శిబిరాలకు) తరలించాం.
– భారీ వర్షాలు, వరదలతో జన జీవితం అస్తవ్యస్తమైంది. ఆగస్టు, సెప్టెంబర్‌లో భారీ వర్షాలు కురవడానికి తోడు ఇప్పుడు సంభవించిన వరదలతో నష్టం మరింత పెరిగింది.
– వరుసగా కురిసిన వర్షాలు రాష్ట్రంలో రహదారులను తీవ్రంగా దెబ్బతీశాయి. పలు చోట్ల చెరువులు, కాల్వలకు గండ్లు పడ్డాయి. విద్యుత్‌ రంగంపై కూడా ప్రభావం పడింది. ఎక్కడికక్కడ వాగులు ఉప్పొంగడంతో రవాణా వ్యవస్థ నిలిచిపోయింది.
– ఈ వర్షాల వల్ల రైతులు చాలా నష్టపోయారు. చేతికొచ్చే దశలో ఉన్న వరి, పత్తి, మొక్కజొన్న, చెరకు పంటలు.. కూరగాయలు, అరటి, బొప్పాయి తోటలు తీవ్రంగా దెబ్బ తిన్నాయి. వరద సహాయ కార్యక్రమాల్లో ఎస్డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది నిర్విరామంగా పని చేసినప్పటికీ 14 మంది చనిపోయారు. ఈ పరిస్థితిలో రాష్ట్రానికి మీ చేయూత ఎంతో అవసరం.

వివిధ శాఖల ప్రాథమిక అంచనాల మేరకు దాదాపు రూ.4,450 కోట్ల మేర నష్టం వాటిల్లింది. ఇప్పటికే  కోవిడ్‌–19 వల్ల ఆర్థికంగా నష్టపోయి ఉన్నాం. ఇప్పుడు ఈ వర్షాలు, వరదలు పరిస్థితిని మరింత దారుణంగా మార్చాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రజలకు ఉపశమనం కల్పించేందుకు మీ అండ, చేయూత ఎంతో అవసరం.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top