CM YS Jagan Review Meeting On Women and Child Welfare Department: Updates - Sakshi
Sakshi News home page

స్త్రీ, శిశుసంక్షేమ శాఖపై సమీక్ష.. సీఎం జగన్‌ కీలక ఆదేశాలు

Aug 2 2023 2:43 PM | Updated on Aug 3 2023 7:33 AM

CM YS Jagan Review On Women Child Development Department Updates - Sakshi

గర్భిణులు, బాలింతలు, చిన్నారుల ఆరోగ్యం కోసం జగనన్న ప్రభుత్వం అమలుచేస్తున్న.. 

సాక్షి, గుంటూరు: ఆరోగ్యవంతమైన భవిష్యత్తు తరాలకోసం సంపూర్ణ పోషణ, సంపూర్ణ పోషణ ప్లస్‌ కార్యక్రమాలను మరింత బలోపేతం చేశామని, నిధులకు వెనుకాడకుండా.. ఏరాష్ట్రంలో లేని విధంగా ఖర్చుచేసి గర్భిణీలకు, బాలింతలకు, చిన్నారులకు పౌష్టికాహారాన్ని అందిస్తున్నామని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తెలిపారు. బుధవారం తాడేపల్లి క్యాంప్‌ కార్యాయలంలో ఆయన  స్త్రీ, శిశు సంక్షేమ శాఖపై సమీక్ష నిర్వహించారు. 

సమీక్ష ప్రారంభానికి ముందు.. వైఎస్సార్‌ సంపూర్ణ పోషణ(YSR Sampoorna Poshana), టేక్‌హోం రేషన్‌ కార్యక్రమాన్ని సీఎం జగన్‌ ప్రారంభించారు. రేషన్‌ సరుకులను స్వయంగా పరిశీలించి.. లబ్ధిదారులకు స్వయంగా ఆయనే కిట్‌లను అందజేశారు. ఇక సమీక్ష సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 

సరుకుల నాణ్యతపై నిరంతరం సమీక్ష చేయాలి. నాణ్యతపై ఎప్పటికప్పుడు పరీక్షలు చేయించాలి. గతంలో గర్భిణీలు, బాలింతలు, చిన్నారుల పౌష్టికాహారం కోసం గత ప్రభుత్వం ఏడాదికి సుమారు రూ.450 నుంచి రూ.500 కోట్లు మాత్రమే ఖర్చు చేసింది. మన ప్రభుత్వం పౌష్టికాహారం కోసం ప్రతిఏటా చేస్తున్న ఖర్చు సుమారుగా రూ.2300 కోట్లు. రక్తహీనత, పౌష్టికాహారలేమి లాంటి సమస్యలు పూర్తిగా రాష్ట్రంలో తొలగిపోవాలన్న లక్ష్యంతో ఇంత ఖర్చు చేస్తున్నాం. ప్రభుత్వం చేస్తున్న ఈ కార్యక్రమాలన్నీ మంచి ఫలితాలు ఇవ్వాలి. దీనికోసం అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలి. ఫ్యామిలీ డాక్టర్‌ గ్రామాలకు వెళ్లేటప్పుడు తప్పనిసరిగా అంగన్‌వాడీలను సందర్శించాలి. అక్కడ పిల్లలు, తల్లులు, బాలింతల ఆరోగ్య స్థితిగతులను పరిశీలించాలి. ఏమైనా సమస్యలు ఉంటే వారికి మంచి వైద్యాన్ని అందించాలి అని అధికారులకు సూచించారాయన. 

బాల్యవివాహాల నిరోధం, అక్షరాస్యత పెంపు, చదువుల్లో బాలికలను ప్రోత్సహించే కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వం తీసుకొచ్చిన అమ్మ ఒడి, కళ్యాణమస్తు, వసతిదీవెన, విద్యా దీవెన ఏరకంగా ఉపయోగపడతాయన్నదానిపై బాగా అవగాహన కల్పించాలి. వైఎస్‌ఆర్‌ కళ్యాణమస్తు, షాదీతోఫా కూడా ఏ రకంగా బాల్యవివాహాలను నిరోధిస్తుందో కూడా వారికి వివరించాలి. కళ్యాణమస్తు కింద లబ్ధి పొందాలంటే వధూవరులు తప్పనిసరిగా పదోతరగతి ఉత్తీర్ణులై ఉండాలన్న నిబంధనను అందుకే పెట్టాం. రాష్ట్రంలో వెనకబడ్డ ప్రాంతాల్లో ఇలాంటి కార్యక్రమాలపై ముమ్మర ప్రచారం నిర్వహించాలి. 

అంగన్‌ వాడీ కేంద్రాల్లో పరిశుభ్రమైన వాతావరణం ఉండేలా చూడాలి. దీనికోసం క్రమం తప్పకుండా తనిఖీలు చేయాలి. అంగన్‌వాడీ కేంద్రాల్లో టాయిలెట్ల పరిశుభ్రంగా ఉండేలా చూడాలి. అంగన్‌వాడీ కేంద్రాలకు నిర్వహించే మరమ్మతుల్లో ముందుగా టాయిలెట్ల మరమ్మతును ప్రాధాన్యతగా తీసుకోవాలి. 

ఫౌండేషన్‌ స్కూలు పిల్లలకు విద్యాబోధనలో నాణ్యతకు పెద్దపీట వేయాలి. ఇప్పుడున్న విద్యావిధానం కాక ఇతర విద్యావిధానాలనుకూడా పరిశీలించాలి. ఇప్పుడు మనం నిర్దేశించుకున్న సిలబస్‌ను వినూత్న బోధనా పద్ధతులతో నేర్పించే అంశాలపై దృష్టిపెట్టాలి. ఇంగ్లిషు భాషలో పరిజ్ఞానం, ఉచ్ఛారణ బాగుండేలా తగిన చర్యలు తీసుకోవాలి. 

మూడో తరగతి నుంచి టోఫెల్‌ శిక్షణ ఇచ్చే కార్యక్రమం మొదలయ్యింది. ఇప్పుడు పీపీ–1 నుంచి రెండో తరగతి పిల్లలమీద దృష్టిపెట్టాల్సిన అవసరం ఉంది. పిల్లల మెదడు బాగా వృద్ధిచెందే వయసు కాబట్టి, వినూత్న బోధనా పద్దతుల ద్వారా వారికి మంచి భాషా జ్ఞానాన్ని అందించాల్సిన అవసరం ఉంది. ఈ వయసులో పునాదిగట్టిగా పడితే.. ఇక పై తరగతుల్లో విద్యార్ధుల ప్రయాణం సాఫీగా ఉంటుంది. 

స్త్రీ, శిశు సంక్షేమ శాఖపైనా సీఎం జగన్‌ సమీక్షలో మంత్రి ఉషాశ్రీచరణ్‌, సంబంధిత విభాగపు ఉన్నతాధికారులు హాజరయ్యారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement