CM YS Jagan Review Meeting: అవినీతిపై ఫిర్యాదులకు ఏసీబీ యాప్‌: సీఎం జగన్‌

CM YS Jagan Review Meeting On Home Department - Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఏసీబీ, దిశ, ఎస్‌ఈబీ కార్యకలాపాలకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, అధికారులను ఆదేశించారు. దిశ తరహాలో అవినీతి ఫిర్యాదులకుగానూ ఏసీబీ యాప్‌ తేవాలని ఆయన అధికారులకు సూచించారు. తాడేపల్లి సీఎం క్యాంప్‌ కార్యాలయంలో హోం శాఖపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా సీఎం వైఎస్‌ జగన్‌ మాట్లాడుతూ.. ఏసీబీకి యాప్‌ ద్వారా ఆడియో ఫిర్యాదు సైతం చేయొచ్చని పేర్కొన్నారు. అవినీతి చోటు చేసుకుంటున్న విభాగాలను క్లీన్‌ చేయాల్సిందేని ఆయన అధికారులను ఆదేశించారు. నెలరోజుల్లోగా ఏసీబీ యాప్‌ రూపకల్పన జరగనుందని, నేర నిర్ధారణకు ఫోరెన్సిక్‌ విభాగాన్ని బలోపేతం చేయాలన్నారు. అలాగే మండల స్థాయి వరకూ ఏసీబీ స్టేషన్లు ఉంటాయని చెప్పారు.

ఇతర విభాగాల్లో అవినీతి ఫిర్యాదులపైనా ఏసీబీ పర్యవేక్షణ ఉంటుందని సీఎం వైఎస్‌ జగన్‌ పేర్కొన్నారు. డ్రగ్స్‌ వ్యవహారాలకు రాష్ట్రంలో చోటు ఉండరాదని తెలిపారు. మూలాల్లోకి వెళ్లి కూకటివేళ్లతో పెకిలించేయాలని అధికారులను ఆదేశించారు. ఇందుకోసం.. విద్యాసంస్థలపైనా ప్రత్యేక నిఘా పెట్టాలని అధికారులకు సూచించారు. చీకటి ప్రపంచంలో వ్యవహారాలను నిర్మూలించాలని తెలిపారు. ప్రతినెలా ఈ అంశాల్లో ప్రగతిని నివేదించాలని అధికారులను ఆదేశించారు. ఎస్‌ఈబీకి ప్రత్యేక కాల్‌ సెంటర్‌ నంబర్‌ ఉంటుందని సీఎం వైఎస్‌ జగన్‌ పేర్కొన్నారు. ఈ సమీక్షా సమావేశంలో హోంశాఖ మంత్రి తానేటి వనిత, సీఎస్‌ సమీర్‌ శర్మ, డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
చదవండి: ఎప్పటికీ వైఎస్‌ జగన్‌కు విధేయుడినే: బైరెడ్డి సిద్ధార్థరెడ్డి 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top