ప్రజాయుధం రాజ్యాంగం

CM YS Jagan on Constitution Day at Vijayawada Andhra Pradesh - Sakshi

దేశంలో విభిన్న వర్గాల ప్రజలను ఒక్కటి చేసిన రూల్‌ బుక్‌.. రాజ్యాంగ దినోత్సవంలో సీఎం జగన్‌ 

ప్రపంచ ప్రజాస్వామ్య చరిత్రలో గొప్ప చారిత్రక గ్రంథం

రాజ్యాంగాన్ని నూరు శాతం అమలు చేస్తున్నది మన రాష్ట్రంలోనే..

పదవులు, పనుల్లోనూ 50 శాతానికి పైగా రిజర్వేషన్లు 

బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాల వారు మంత్రిమండలిలో 70%

ఐదుగురు డిప్యూటీ సీఎంలలో నలుగురు ఆ వర్గాల వారే

స్పీకర్‌ పదవి కూడా బీసీ వర్గానికే..

మహిళా సాధికారతకు అర్థం చెబుతూ ఎన్నో సంక్షేమ పథకాలు 

35 నెలల పాలనలో డీబీటీ, నాన్‌ డీబీటీ ద్వారా రూ.3,18,037 కోట్ల పంపిణీ

వేదకాలం నుంచీ మనది ప్రజాస్వామ్య దేశం: గవర్నర్‌ విశ్వభూషణ్‌ 

అధికార దుర్వినియోగం జరిగినప్పుడు, ప్రభుత్వాల ఇనుప పాదాల కింద నలిగిపోయే వారి రక్షణకు దైవమిచ్చిన ప్రజా ఆయుధం మన రాజ్యాంగమే. నిరుపేదలు, అణగారిన వర్గాలు, నిస్సహాయులకు ఇది రక్షణగా ఉంది. రాజ్యాంగంలోని మహోన్నత ఆశయాలకు ప్రతిరూపమైన, ఆకాశమంతటి మహా మనిషి బాబాసాహెబ్‌ అంబేద్కర్‌కు అంజలి ఘటిస్తూ 2023 ఏప్రిల్‌లో విజయవాడలో మహా విగ్రహాన్ని ఆవిష్కరించనున్నాం. అంబేద్కర్‌ భావజాలాన్ని, మన రాజ్యాంగ స్ఫూర్తిని మనసా, వాచా, కర్మణా గౌరవించే  ప్రభుత్వంగా ఈ మూడున్నరేళ్ల పాలనలో ముందడుగు వేశాం. 

రాజధాని కోసం సేకరించిన భూముల్లో పేదలకు ఇళ్ల స్థలాలిస్తే సామాజిక సమతుల్యం దెబ్బ తింటుందని వాదించిన దుర్మార్గం భారతదేశంలో మొలకెత్తుతుందని బహుశా రాజ్యాంగ నిర్మాతలు ఆ రోజు ఊహించి ఉండకపోవచ్చు. ఇలాంటి వాదాలు, వాదనలతో కూడా మనం యుద్ధం చేస్తున్నాం. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు అన్నింటా పెద్ద పీట వేస్తున్నాం.     
– ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ 

సాక్షి, అమరావతి: విభిన్న వర్గాలకు చెందిన భారతీయులను ఒక్కటిగా ఉంచే గొప్ప గ్రంథం భారత రాజ్యాంగమని, నిస్సహాయులకు దైవమిచ్చిన ప్రజాయుధం అని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. రాజ్యాంగ స్ఫూర్తిని నూరు శాతం పాటించి అమలు చేస్తున్నది మన ప్రభుత్వమేనని స్పష్టం చేశారు. రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం విజయవాడ తుమ్మలపల్లి కళా క్షేత్రంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథులుగా రాష్ట్ర గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌తో కలిసి పాల్గొన్న సీఎం జగన్‌.. రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బాబా సాహెబ్‌ అంబేడ్కర్‌ చిత్ర పటానికి నివాళులు అర్పించి, రాజ్యాంగ పీఠికను చదివి వినిపించారు.

అనంతరం మాట్లాడుతూ.. మన రాజ్యాంగం ఎంతో గొప్పదన్నారు. 28 రాష్ట్రాలు 8 కేంద్ర పాలిత ప్రాంతాలు, 3 వేల కులాలు, ఉప కులాలతో కలిపి 25 వేల కులాలు, ఏడు ప్రధాన మతాలు, 121 భాషలు, యాసలతో కలిపి 19,500 భాషలు మాట్లాడే మన దేశానికి వేర్వేరు చరిత్రలు, భిన్న భౌగోళిక స్వభావాలున్నాయని చెప్పారు. మన రాజ్యాంగం.. ప్రభుత్వాలకు, దేశంలోని 140 కోట్లకు పైగా ఉన్న ప్రజలకు క్రమశిక్షణ నేర్పే రూల్‌బుక్‌గా కొనసాగుతోందన్నారు.

మనకు దిశానిర్దేశం చేసే గైడ్, ఫిలాసఫర్, టీచర్‌గా దారి చూపుతోందని వివరించారు. దాదాపు 80 దేశాల రాజ్యాంగాల అధ్యయనం తర్వాత తయారైన ప్రజల స్వేచ్ఛ, స్వాతంత్య్రం, సమానత్వాల మాగ్నాకార్టా మన రాజ్యాంగమని తెలిపారు. ప్రపంచ మానవ చరిత్రలో, ప్రజాస్వామ్య చరిత్రలో, సమానత్వ చరిత్రలో, సామ్యవాద చరిత్రలో, సంఘ సంస్కరణల చరిత్రలో అత్యంత గొప్పదైన ఒక చారిత్రక గ్రంథం అని అభివర్ణించారు. దీనిని 1949 నవంబర్‌ 26న మన కోసం మనం సమర్పించుకున్నామని చెప్పారు. ఈ సందర్భంగా సీఎం ఇంకా ఏమన్నారంటే.. 
గవర్నర్, హైకోర్టు న్యాయమూర్తులతో సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి  

72 ఏళ్లుగా మన సంఘ సంస్కర్త
► పుస్తకం ముట్టుకోవడానికి వీలులేని సమాజంలో జన్మించి, ఎన్నో డిగ్రీలు, విదేశీ డిగ్రీలు సైతం సంపాదించుకుని.. ఈ దేశం మారడానికి, నిలబడడానికి, ప్రపంచంతో సైతం పోటీ పడేందుకు, ప్రగతిపథంలో పరుగెత్తడానికి కావాల్సిన ఆలోచనలతో డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ ఇంత గొప్పదైన రాజ్యాంగాన్ని రచించారు.

► 72 ఏళ్లుగా మన సామాజిక వర్గాల చరిత్రను తిరగరాసింది.. రాస్తూనే ఉంది. ఈ పుస్తకం మన ఆర్థిక, సామాజిక, రాజకీయ, విద్య, మహిళా చరిత్ర గతిని మార్చింది.. మారుస్తూనే ఉంటుంది. మన భావాలను, భావజాలాల్ని మార్చింది.. మారుస్తూనే ఉంటుంది. 72 ఏళ్లుగా మన రాజ్యాంగమే మన సంఘ సంస్కర్త.  మన మధ్య ఎన్ని భిన్నత్వాలు ఉన్నా, ఈ వజ్రోత్సవ దేశ స్వాతంత్య్రాన్ని నిలబెట్టింది. ఇక మీదట కూడా నిలబెడుతూనే ఉంటుంది. 

గ్రామ స్వరాజ్యానికి రూపకల్పన 
► రాజ్యాంగంలో చెప్పిన గ్రామ స్వరాజ్యానికి రూపకల్పన చేసి, దేశంలోనే తొలిసారిగా గ్రామ సచివాలయాలు, వలంటీర్‌ వ్యవస్థను అమలు చేస్తున్న ప్రభుత్వం బహుశా మనదే. ప్రభుత్వ బడుల్లో పేదలు ఇంగ్లిష్‌ మీడియంలో చదువుకునే అవకాశం కల్పించాం. 

► ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీల పట్ల పాటిస్తున్న నయా అంటరానితనం మీద సీబీఎస్‌ఈ ఇంగ్లిష్‌ మీడియంతో మొదలు, బైలింగ్యువల్‌ టెక్ట్స్‌ బుక్స్, డిజిటల్‌ క్లాస్‌రూముల వరకు విద్యా రంగంలో సంస్కరణల ద్వారా దండయాత్ర చేస్తున్న ప్రభుత్వం మనది. 

► నామినేటెడ్‌ పదవులు, పనులలో 50 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకే రిజర్వేషన్లు కల్పిస్తూ చట్టం చేసి, అమలు చేసిన తొలి ప్రభుత్వం కూడా మనదే. అందులోనూ 50 శాతం మహిళలకు రిజర్వేషన్‌ కల్పించిన మొట్టమొదటి ప్రభుత్వం కూడా మనదే. 

మహిళా సాధికారతకు నిజమైన అర్థం  
► జగనన్న అమ్మఒడి, వైఎస్సార్‌ చేయూత, వైఎస్సార్‌ ఆసరా, వైఎస్సార్‌ సున్నా వడ్డీ, అక్కచెల్లెమ్మల పేరిట 30 లక్షల ఇళ్ల పట్టాల రిజిస్ట్రేషన్, 21 లక్షల ఇళ్ల నిర్మాణం, దిశ యాప్, దిశ పోలీస్‌ స్టేషన్‌ తదితర అనేక విధాలుగా ముందడుగులు వేసిన మహిళా ప్రభుత్వం కూడా మనదే. 

► వాహనమిత్ర, రైతు భరోసా, పెన్షన్‌ కానుక, ఆసరా, సున్నా వడ్డీ, లా నేస్తం, నేతన్న నేస్తం, మత్స్యకార భరోసా, వసతి దీవెన, ఆరోగ్యశ్రీ, ఆరోగ్య ఆసరా, విద్యా దీవెన, కాపు నేస్తం, ఈబీసీ నేస్తం, విద్యా కానుక, గోరుముద్ద, బడులలోనూ, ఆస్పత్రుల్లోనూ నాడు–నేడు.. పథకాలు అమలుచేస్తున్నాం. తద్వారా పేదలు పేదరికం నుంచి బయట పడేందుకు చిత్తశుద్ధితో గట్టి ప్రయత్నం చేస్తున్నాం. 

కార్పొరేషన్ల చైర్మన్లుగానూ వారే అధికం
► వివిధ ప్రభుత్వ కార్పొరేషన్లలో 137 చైర్మన్‌ పదవుల్లో 58% పదవులు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకే ఇచ్చాం. బీసీలకు  56 కార్పొరేషన్లు, ఎస్సీలకు మూడు కార్పొరేషన్లు, ఎస్టీలకు కార్పొరేషన్‌ ఏర్పాటు చేశాం. శాశ్వత ప్రాతిపదికన బీసీ కమిషన్‌నూ నియమించాం. ఈ 35 నెలల్లో సామాజిక న్యాయంలో మనందరి ప్రభుత్వం మనసుపెట్టి తీసుకువచ్చిన మార్పులివి. రాజ్యాంగ స్ఫూర్తిని తూచా తప్పకుండా పాటిస్తున్న ప్రభుత్వం మనది. 

► మంత్రులు కొట్టు సత్యనారాయణ, ఆదిమూలపు సురేష్, మేరుగు నాగార్జున, తానేటి వనిత, సీఎస్‌ సమీర్‌శర్మ, డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డి, హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ సత్తి సుబ్బారెడ్డి, జస్టిస్‌ కె.సురేష్‌రెడ్డి, జస్టిస్‌ కె.శ్రీనివాసరెడ్డి, జస్టిస్‌ బి.శ్యాంసుందర్, జస్టిస్‌ చాగరి ప్రవీణ్‌కుమార్, జస్టిస్‌ డి.వెంకటరమణ, మానవ హక్కుల కమిషన్‌ చైర్మన్‌ జస్టిస్‌ ఎం.సీతారామ్మూర్తి, కమిషన్‌ సభ్యులు దండే సుబ్రమణ్యం తదితరులు పాల్గొన్నారు.   

ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశం: గవర్నర్‌ 
సమాజంలో సామరస్యతను నెలకొల్పేందుకు రాజ్యాంగ నిర్మాతల కృషిని ప్రజలు ఎప్పటికీ మరువలేరని గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌ పేర్కొన్నారు. వేదకాలం నుంచి ప్రజాస్వామ్య భావన ప్రబలంగా ఉందని చాటిచెప్పేందుకు ఈ ఏడాది రాజ్యాంగ దినోత్సవాన్ని ‘భారత్‌: ప్రజాస్వామ్యానికి తల్లి’ అనే నినాదంతో నిర్వహిస్తున్నట్లు చెప్పారు. వేద కాలం నుంచి భారతీయులు సమానత్వ స్ఫూర్తితో ఉంటున్నారని, భారతదేశం భిన్నత్వంలో ఏకత్వంగా ఉంటూ నేడు ప్రపంచంలోనే అతిపెద్ద విజయవంతమైన ప్రజాస్వామ్య దేశంగా ఉందన్నారు.

ధర్మం, నైతికత, వేదాల నుంచి ఉద్భవించిన మన దేశం భారతీయ సమాజానికి గొప్ప రాజ్యాంగాన్ని ప్రసాదించిందని చెప్పారు. పౌరుల హక్కులను పరిరక్షించడం ద్వారా రాజ్యాంగం వారికి అధికారం ఇస్తోందని, పౌరులు తమ విధులకు కట్టుబడి రాజ్యాంగానికి సాధికారత కల్పించారన్నారు. ఎమర్జెన్సీ కాలం నాటి చీకటి రోజుల్లోనూ రాజ్యాంగం ప్రజల ప్రాథమిక హక్కులు, వాక్‌ స్వాతంత్య్ర హక్కును కాపాడిందని ఈ సందర్భంగా గవర్నర్‌ గుర్తు చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో ప్రపంచ వేదికపై భారతదేశం శక్తివంతమైన క్రియాశీలక పాత్ర పోషిస్తోందన్నారు. ఇది యుద్ధాల యుగం కాదని కౌన్సెలింగ్‌ ద్వారా రష్యా, ఉక్రెయిన్‌ మధ్య యుద్ధాన్ని ముగించేందుకు ప్రధాని చొరవ చూపించారన్నారు. 

మన పాలనలో రూ.3,18,037 కోట్ల పంపిణీ
► మన 35 నెలల పాలనలో డీబీటీ ద్వారా అంటే నేరుగా బటన్‌ నొక్కి, ప్రజల బ్యాంక్‌ అకౌంట్లలోకి వెళ్లే గొప్ప వ్యవస్థను తీసుకువచ్చాం. లంచాలకు, వివక్షకు తావు లేకుండా నేరుగా ప్రజలకు అందించిన మొత్తం ఇప్పటి వరకు రూ.1,76,517 కోట్లు. గత 35 నెలల్లో డీబీటీ, నాన్‌ డీబీటీల ద్వారా రూ.3,18,037 కోట్లు అందించాం.

► ఇందులో ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలకు, మైనార్టీ వర్గాలకు అందినది 79 శాతం. సామాజిక న్యాయానికి ఎంతగా కట్టుబడి ఉన్నామో ఈ అంకెలే సాక్ష్యం. నా మంత్రివర్గ సహచరులనే తీసుకుంటే మొత్తం మంత్రిమండలిలో దాదాపు 70 శాతం ఈ సామాజిక వర్గాలవారే. రెండు మంత్రివర్గాలలోనూ ఐదుగురికి డిప్యూటీ సీఎం పదవులిస్తే అందులో నలుగురు.. అంటే 80 శాతం నా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకే అవకాశం కల్పించాం. 

► శాసనసభ స్పీకర్‌గా బలహీన వర్గాలకు చెందిన వ్యక్తిని, శాసనమండలి చైర్మన్‌గా ఒక ఎస్సీని నియమించాం. శాసనమండలి డిప్యూటీ చైర్‌పర్సన్‌గా మైనార్టీ వర్గానికి చెందిన నా అక్కను ఆ స్థానంలో కూర్చోబెట్టాం. సామాజిక న్యాయ చరిత్రలో ఇదొక సరికొత్త అధ్యాయం.

► ఈ మూడేళ్లలో రాజ్యసభకు 8 మందిని పంపితే అందులో నలుగురు బీసీలే. శాసన మండలికి అధికార పార్టీ నుంచి 32 మందిని పంపిస్తే అందులో 18 మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల వారే. 13 జిల్లా పరిషత్‌ చైర్మన్‌ పదవుల్లో 9 ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకే కేటాయించిన ప్రభుత్వం మనది. మున్సిపల్‌ కార్పొరేషన్లలో 86 శాతం, మున్సిపాల్టీలలో 69 శాతం, మండల ప్రజా పరిషత్‌ చైర్మన్లలో 67 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సామాజిక వర్గాలకే కేటాయించాం.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top