AP: క్లియర్‌ టైటిల్‌తో రిజిస్ట్రేషన్‌

CM YS Jagan Comments On jagananna sampoorna gruha hakku scheme - Sakshi

జగనన్న సంపూర్ణ గృహ హక్కు లబ్ధిదారులకు సచివాలయాల్లోనే 10 నిమిషాల్లో రిజిస్ట్రేషన్‌ 

సాక్షి, అమరావతి: జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం లబ్ధిదారులకు క్లియర్‌ టైటిల్‌తో రిజిస్ట్రేషన్‌ చేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారు. పథకం పురోగతిపై సీఎం జగన్‌ గురువారం తన క్యాంపు కార్యాలయంలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పలు సూచనలు చేశారు. ఆ వివరాలివీ..

జాప్యం లేకుండా ఆమోదం..
లబ్ధిదారుల దరఖాస్తులను ఎప్పటికప్పుడు పరిశీలించి జాప్యం లేకుండా ఆమోదించాలని సీఎం జగన్‌ సూచించారు. క్షేత్రస్థాయి పరిశీలన కూడా నిర్దేశిత సమయంలోగా పూర్తి చేయాలన్నారు.

ఆస్తులపై పూర్తి హక్కులు..
జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం కింద లబ్ధిదారులకు ఆస్తులపై పూర్తి హక్కులు దక్కుతాయనే అంశంపై అవగాహన కల్పించాలని సీఎం సూచించారు. పథకం అమలుపై దిగువస్థాయి అధికారులకు, లబ్ధిదారులకు అవగాహన కల్పించే కార్యక్రమాలను చేపట్టాలని ఆదేశించారు. 

20 నుంచి డిసెంబర్‌ 15 వరకు రిజిస్ట్రేషన్‌ 
జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం లబ్ధిదారులకు రిజిస్ట్రేషన్‌ ప్రక్రియను నవంబర్‌ 20వతేదీ నుంచి ప్రారంభిస్తామని, డిసెంబర్‌ 15 వరకు ప్రక్రియను పూర్తి చేస్తామని అధికారులు వెల్లడించారు. 

52 లక్షల మంది నమోదు
జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం కింద ఇప్పటి వరకు 52 లక్షల మంది నమోదైనట్లు అధికారులు తెలిపారు. ఇందులో 45.63 లక్షల మంది లబ్ధిదారుల డేటాను ఇప్పటికే సచివాలయాలకు ట్యాగ్‌ చేసినట్లు వివరించారు. వీటిపై క్షేత్రస్థాయిలో పరిశీలన చేపట్టి ఎప్పటికప్పుడు దరఖాస్తులను ఆమోదిస్తున్నట్లు చెప్పారు. మరో 10 రోజుల్లో పూర్తిస్థాయిలో ఆమోదించనున్నట్లు తెలిపారు.

సమీక్షలో మంత్రి బొత్స సత్యనారాయణ, సీఎస్‌ డాక్టర్‌ సమీర్‌ శర్మ, ల్యాండ్‌ అడ్మినిస్ట్రేషన్‌ చీఫ్‌ కమిషనర్‌ నీరబ్‌కుమార్‌ ప్రసాద్, పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ స్పెషల్‌ సీఎస్‌ వై.శ్రీలక్ష్మి, రెవెన్యూశాఖ స్పెషల్‌ సీఎస్‌ రజత్‌ భార్గవ, గృహనిర్మాణశాఖ స్పెషల్‌ సీఎస్‌ అజయ్‌జైన్, గ్రామీణాభివృద్ధిశాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి ఉషారాణి, ఆంధ్రప్రదేశ్‌ స్టేట్‌ హౌసింగ్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ ఛైర్మన్‌ దవులూరి దొరబాబు పాల్గొన్నారు.  

పది నిమిషాల్లో రిజిస్ట్రేషన్‌
జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం కింద రిజిస్ట్రేషన్‌ ప్రక్రియలో పూర్తి పారదర్శకత పాటించాలని అధికారులకు ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. తగినన్ని స్టాంపు పేపర్లను సిద్ధం చేసి 10 నిమిషాల్లోనే రిజిస్ట్రేషన్‌ పూర్తయ్యేలా చర్యలు తీసుకున్నట్లు అధికారులు వివరించారు. గ్రామ, వార్డు సచివాలయాల్లోనే రిజిస్ట్రేషన్‌ ప్రక్రియను పూర్తి చేస్తామన్నారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top