చెవిరెడ్డి పేరు చెప్పాలని ‘సిట్‌’ చిత్ర హింసలు | Chevireddy Bhaskar Reddy Gunmen Madan Reddy Letter To AP DGP | Sakshi
Sakshi News home page

చెవిరెడ్డి పేరు చెప్పాలని ‘సిట్‌’ చిత్ర హింసలు

Jun 18 2025 5:54 AM | Updated on Jun 18 2025 7:03 AM

Chevireddy Bhaskar Reddy Gunmen Madan Reddy Letter To AP DGP

మద్యం అక్రమ కేసులో ఆయనకు సంబంధం ఉందని చెప్పాలన్నారు

డీజీపీకి లేఖ రాసిన చెవిరెడ్డి పూర్వ గన్‌మెన్‌ మదన్‌

అబద్ధాలు చెప్పనన్నందుకు కొట్టారు.. బూతులు తిట్టారు

ముఖం, వీపుపై పిడిగుద్దులు గుద్దారు..చేతి వేళ్లు వెనక్కు విరిచారు

తప్పుడు స్టేట్‌మెంట్ల కోసం టార్చర్‌ చూపుతున్న సిట్‌  

చెవిరెడ్డి వెంట తిరిగిన వారిని చిత్రవధ చేసి నరకం చూపిస్తున్న వైనం

గతంలో గన్‌మెన్లుగా పని చేసిన వారిని చితక బాదిన అధికారులు

సిట్‌ విచారణ తీరుతో ఆస్పత్రి పాలైన హెడ్‌ కానిస్టేబుల్‌ మదన్‌

ఈ మేరకు హైకోర్టులోనూ పిటిషన్‌.. విచారణ నేటికి వాయిదా  

సాక్షి అమరావతి: మద్యం అక్రమ కేసులో వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి పేరు చెప్పాలని ఆయనతో పాటు తిరిగిన వారిని, సన్నిహితంగా మెలిగిన వారిని సిట్‌ (స్పెషల్‌ ఇన్వెస్టిగేషన్‌ టీం–ఎస్‌ఐటి) అధికారులు టార్గెట్‌ చేసి చిత్ర హింసలు పెడుతున్నారు. పోలీసులని కూడా చూడకుండా గతంలో గన్‌మెన్‌లుగా పని చేసిన వారిపై కూడా చేయి చేసుకుంటున్నారు.

జరగని లిక్కర్‌ స్కామ్‌లో చెవిరెడ్డికి భాగమున్నట్లు తప్పుడు స్టేట్‌మెంట్‌ ఇవ్వాలని తనకు నరకం చూపారని గతంలో చెవిరెడ్డికి గన్‌మెన్‌గా పనిచేసిన మదన్‌రెడ్డి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తన ఒంటిపై ఖాకీ యూనిఫాం ఉన్నప్పటికీ తనను కొట్టారని, అనరాని మాటలతో మానసిక వేదనకు గురిచేశారని వివరిస్తూ డీజీపీకి లేఖ రాశారు. అందులోని వివరాలు ఇలా ఉన్నాయి. 

చెప్పినట్లు చేయడానికి నీకేంటి రోగం?
‘నన్ను విజయవాడ సిట్‌ సార్‌ వాళ్లు రమ్మంటే వెళ్లాను. మొదటి రోజు వారు చెప్పినట్టు రాసి సంతకాలు చేయమన్నారు. నేను సాక్షిగా వచ్చాను.. వాస్తవాలు చెబుతాను, వాస్తవాలు రాస్తానని చెప్పాను. అందుకు వాళ్లు నన్ను అసభ్యంగా తిట్టారు. నీ కన్నా ముందు విచారణకు వచ్చిన గిరి అనే కానిస్టేబుల్‌ మేము చెప్పినట్టు రాసి సంతకాలు పెట్టాడని చెప్పారు. వీడియో రికార్డింగ్‌లోనూ అదే చెప్పాడు. మరి నీకేంటి రోగం.. అంటూ తిట్టారు.

⇒ మొదటి రోజు పది గంటల పాటు ఒకరు మారిస్తే ఒకరు నన్ను మానసికంగా, శారీరకంగా హింసించారు. అనరాని మాటలు అంటుంటే, నన్ను ఇలాగే వేధిస్తే తట్టుకునే శక్తి నాకు లేదన్నాను. ఇక్కడ నాకు ఏదైనా జరిగితే మీదే బాధ్యత అని చెప్పడంతో ఆ రోజుకు పంపించేశారు. రేపు రా.. అది కూడా యూనిఫాం తీసేసి రా అని చెప్పారు. నా కన్నా ముందు సిట్‌ విచారణకు యూనిఫాం తీసేసి వచ్చిన కాని­స్టేబుల్‌ గిరిని కొట్టారని తెలిసి రెండో రోజు కూ­డా యూనిఫాం వేసుకుని విచారణకు వెళ్లాను. అలా వచ్చినందుకు నన్ను బూతులు తిట్టారు. 

⇒ నువ్వు కూడా రాసిచ్చి మీ ఊరికి వెళ్లిపో అని చెప్పారు. నేను చెవిరెడ్డి దగ్గర పదేళ్లు గన్‌మెన్‌గా పని­చేశాను. లిక్కర్‌ వల్ల ఆయన కుటుంబంలో ఇద్దరిని కోల్పోయాడు. అతను ఎన్నికల్లో కూడా  మద్యం పంపిణీ చేయ­లేదు. అతనికి సెంటిమెంట్‌ కూడా. అలాంటిది ఒక చిన్న కానిస్టేబుల్‌ అయిన నా చేత అంత పెద్ద మాటలు చెప్పించడం, రాయించడం ఏంటి సార్‌.. నేను అలా అబద్ధాలు చెప్పలేను అని చెప్పాను. దీంతో సిట్‌ వాళ్లు చాలా కోపంతో నీ ఉద్యోగం ఊడబెరికి జైలుకు పంపుతామని బెదిరించారు. ఏమైనా సరే అంతగా అబద్ధాలు చెప్పలేనన్నాను. దీంతో అక్కడున్న పది మంది సిబ్బంది యూనిఫాంలో ఉన్న నాపై విరుచుకుపడ్డారు.

⇒ తల, ముఖం, వీపుపై పిడిగుద్దులు గుద్దారు. నా చేతి వేళ్లు పట్టుకుని వెనక్కు విరిచారు. ఆ నొప్పి భరించలేక నేను గట్టిగా అరిచాను. నీళ్లు తాగించి మళ్లీ అలాగే చేశారు. కొంత సేపటి తర్వాత.. యూనిఫాం తీసేసి రావాలంటూ పంపించారు. నేను రూముకు వచ్చాక కళ్లు తిరిగి కిందపడ్డాను. తర్వాత మణిపాల్‌ ఆసుపత్రికి వెళ్లాను. తీవ్ర ఆందోళనలో ఉన్న నాకు కార్డియాలజీ, న్యూరా­లజీ పరీక్షలు చేయాలని అడ్మిట్‌ చేసుకున్నారు. 

⇒ సార్‌.. ఈ పరిస్థితిలో నేను సిట్‌ దగ్గరకు ఒంటరిగా వెళ్ల­లేను. ఆ దెబ్బలు తట్టుకొనే శక్తి, ఆరోగ్యం నాకు లేవు. నాకు ఉద్యోగం లేకపోయినా కూలి పనులు చేసుకుని, పశువులు మేపుకుని బతుకుతాను. అక్కడ నాకు ఏమైనా జరిగితే నా కుటుంబం అన్యాయమైపోతుంది.. దయచేసి పెద్ద మనస్సుతో నా విన్నపాన్ని మన్నించి, నన్ను కొట్టకుండా విచారించేలా సిట్‌ వాళ్లకు ఆదేశాలివ్వండి’ అని విన్నవించారు.  

గిరి.. మదన్‌.. వెంకటేష్‌.. బాలాజీ..
చెవిరెడ్డికి అంగరక్షకులుగా.. అత్యంత సన్నిహి­తులుగా మెలిగిన వారిని బలవంతంగా అరెస్టు చేసిన సిట్‌ అధికారులు రోజుల తరబడి వారి అదు­పులో పెట్టుకుని చిత్రవధ చేశారని ఇప్పటికే చెవిరెడ్డి ప­లుమార్లు మీడియా ద్వారా వెల్లడించారు. మొద­టగా గన్‌మెన్‌ గిరిని పట్టుకుని తీవ్రంగా కొట్టి, భయపెట్టి స్టేట్‌మెంట్‌ తీసుకున్నారని, ఆ తర్వాత మరో గన్‌మెన్‌ మదన్‌ను విచారణకు పిలిపించి విచక్షణా రహితంగా కొట్టి శారీరకంగా, మానసికంగా చిత్రవధకు గురిచేశారని చెవిరెడ్డి తెలిపారు.

తన సన్నిహితుడైన వెంకటేష్‌నాయుడు, అతని కుటుంబీకులను వేధింపులకు గురి చేసి టా­ర్చర్‌ పెట్టార­న్నారు. బాలాజీ అనే వ్యక్తిని అదుపు­లోకి తీసుకుని ఐదు రోజుల పాటు నరకం చూపా­రన్నారు. చెవి­రెడ్డికి ఏపీ లిక్కర్‌ స్కాంతో సంబంధం ఉందని చెప్పాలని వీరందరిపై ఒత్తిడి చేశారని చెప్పారు. సిట్‌ అధికారుల దెబ్బలకు తీవ్రంగా గాయపడిన మదన్‌.. ఆసుపత్రిలో చికిత్స పొందుతుండడమే సిట్‌ బరితెగింపుకు నిలువెత్తు సాక్ష్యమన్నారు.

సిట్‌ వేధిస్తోంది..జోక్యం చేసుకోండి
మద్యం విధానానికి సంబంధించిన కేసులో సాక్షిగా విచారణకు హాజరైన తనను సిట్‌ అధికారులు చిత్రహింసలకు గురి చేశారంటూ వైఎస్సార్‌సీపీ నేత చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి వద్ద గన్‌మెన్‌గా విధులు నిర్వర్తించిన హెడ్‌ కానిస్టేబుల్‌ ఎన్‌.మదన్‌రెడ్డి హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై మంగళవారం న్యాయమూర్తి జస్టిస్‌ నూనెపల్లి హరినాథ్‌ విచారణ జరిపారు. మదన్‌రెడ్డి తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ, మద్యం విధానం కేసులో సాక్షిగా తమ ముందు హాజరు కావాలంటూ పిటిషన­ర్‌కు సిట్‌ అధికారులు నోటీసులిచ్చారన్నారు. ఈ నోటీసులను గౌరవిస్తూ పిటిషనర్‌ ఈ నెల 10న విచా­రణకు హాజరయ్యారని తెలిపారు.

విచారణ పేరుతో సిట్‌ అధికారులు మదన్‌రెడ్డిని తీవ్రంగా బెదిరించారన్నారు. చెవిరెడ్డికి గత పదేళ్లలో రూ.200 కోట్లు అందినట్లు చెప్పాలని, తాము చెప్పినట్లు చేయకుంటే తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించారని వివరించారు. సిట్‌ అధికారుల తీరు వల్ల పిటిషనర్‌ తీవ్రంగా ఒత్తిడికి గురై ఆసుపత్రిలో చేరారని, వైద్యులు 15 రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాలని సలహా ఇచ్చార­న్నారు.

మదన్‌రెడ్డిని న్యాయవాది సమక్షంలో విచారించేలా ఆదేశాలు జారీ చేయాలని కోర్టును కోరారు. సిట్‌ అధికారుల తరఫున వాదనలు వినిపించేందుకు పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ (పీపీ) అందుబాటులో లేకపోవడంతో న్యాయమూర్తి తదుపరి విచారణను బుధవారానికి వాయిదా వేశారు. ఇదిలా ఉండగా, ఏఆర్‌ హెడ్‌ కానిస్టేబుల్‌ మదన్‌ చేసిన ఆరోపణలను సిట్‌ అధికారులు ఖండిస్తూ మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. విచారించామే తప్ప తామెవరినీ కొట్టలేదన్నారు.  

బెదిరింపులు.. వేధింపులు.. చిత్రహింసలు
వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో మద్యం విధానంపై నమోదు చేసిన అక్రమ కేసు దర్యాప్తు ముసుగులో సిట్‌ ఆరచకాలకు మొదటి నుంచీ అడ్డూ అదుపూ లేకుండాపోతోంది. లేని కుంభకోణాన్ని ఉన్నట్టుగా చూపించాలన్న ప్రభుత్వ పెద్దల ఆదేశాలతో సిట్‌ రాజ్యాంగేతర శక్తిగా బరితెగిస్తోంది. అందుకోసం ఈ కేసు దర్యాప్తు పేరిట వేధింపులు, దాడులకు తెగబడుతోంది. ఇప్పటికే పలువురు డిస్టిలరీల ప్రతినిధులను సిట్‌ అధికారులు హైదరాబాద్‌ నుంచి బలవంతంగా విజయవాడ తీసుకువచ్చి వేధించారు.

60 ఏళ్లు పైబడిన వారిని కూడా భౌతికంగా హింసించడం సిట్‌ అరాచకానికి తార్కాణం. ఆ డిస్టిలరీల ప్రతినిధులు న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో సిట్‌ వేధింపులకు అడ్డుకట్ట పడింది. వారిని హైదరాబాద్‌లోని వారి నివాసంలోనే అదీ సాయంత్రంలోపే విచారించాలని న్యాయస్థానం ఆదేశించింది. అంతకు ముందు ఏపీ బేవరేజస్‌ కార్పొరేషన్‌ పూర్వపు ఎండీ వాసుదేవరెడ్డిని దర్యాప్తు పేరుతో వేధించింది. సిట్‌ వేధింపులకు వ్యతిరేకంగా ఆయన మూడుసార్లు హైకోర్టును ఆశ్రయించారు కూడా. కానీ సిట్‌ పట్టు వీడకుండా ఆయన్ను వెంటాడి వెంటాడి వేధించింది.

సిట్‌ వేధింపులతో బెంబేలెత్తిన వాసుదేవరెడ్డి కూటమి ప్రభుత్వ పెద్దలు చెప్పినట్టుగా అబద్ధపు వాంగ్మూలం ఇచ్చారు. దాంతోనే ఆయన్ను రాష్ట్ర సర్విసు నుంచి రిలీవ్‌ చేసి కేంద్ర సర్విసులకు వెళ్లేందుకు చంద్రబాబు ప్రభుత్వం అనుమతినిచ్చింది. అదే రీతిలో బేవరేజస్‌ కార్పొరేషన్‌ పూర్వ ఉద్యోగులు సత్య ప్రసాద్, అనూషలను కూడా సిట్‌ అధికారులు వేధించి అబద్ధపు వాంగ్మూలాలు నమోదు చేయించారు. ఇక ఈ కేసులో అరెస్టు చేసిన పలువురు ప్రైవేటు వ్యక్తులను బెదిరించి లోబరచుకుని వారితో అబద్ధపు వాంగ్మూలాలు నమోదు చేయించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement