బాబు ష్యూరిటీ బాండు.. మోసం గ్యారంటీకి బ్రాండ్‌ | Chandrababu Govt Frauds in Super Six | Sakshi
Sakshi News home page

బాబు ష్యూరిటీ బాండు.. మోసం గ్యారంటీకి బ్రాండ్‌

Jun 21 2025 4:40 AM | Updated on Jun 21 2025 7:51 AM

Chandrababu Govt Frauds in Super Six

ఎన్నికలకు సరిగ్గా ఏడాది ముందే సూపర్‌ సిక్స్‌ హామీలను ప్రకటించిన చంద్రబాబు 

వీటితోపాటు ఇతర హామీల అమలును 2024 జూన్‌ నుంచే ప్రారంభిస్తామని వెల్లడి

‘‘బాబు ష్యూరిటీ–భవిష్యత్తు గ్యారంటీ’’ పేరుతో ఇంటింటికీ బాండ్లతో టీడీపీ శ్రేణుల ప్రచారం 

ప్రతి ఇంటి యజమాని లేదా ఆయన భార్య ఫోన్‌ నంబర్‌ తీసుకుని వెబ్‌సైట్‌లో నమోదు 

వారినుంచి వన్‌ టైమ్‌ పాస్‌వర్డ్‌ (ఓటీపీ) కూడా పొంది వివిధ పథకాల ద్వారా  ఒక కుటుంబానికి చేకూరే 

లబ్ధి ఎంత అనేది నమోదు 2024 జూన్‌ నుంచే పథకాల ద్వారా మీ ఖాతాలో డబ్బులు జమ చేస్తామని  త్రికరణ శుద్ధితో చంద్రబాబు ప్రమాణం చేసిన బాండ్లు జారీ 

తర్వాత బాండ్లు ఇచ్చినందుకు టీడీపీకి మద్దతు తెలుపుతున్నట్లుగా మిస్డ్‌ కాల్‌ కూడా ఇప్పించిన నేతలు 

తీరా అధికారంలోకి వచ్చి ఏడాది దాటిపోయినా అతీగతీ లేని సూపర్‌ సిక్స్‌ 

వైఎస్సార్‌సీపీ అధినేత జగన్‌ పిలుపుతో బాబు బాండ్లు చూపి ఎమ్మెల్యేలు, టీడీపీ నేతలను నిలదీసేందుకు ఇంటింటా సిద్ధమవుతున్న ప్రజలు 

బాండ్లను బయటకు తీసి... గతేడాదిలో ప్రభుత్వం తమకు పడిన బకాయిని లెక్కిస్తున్న ప్రజానీకం 

ఏడాది కాలంగా ఎగవేతలతో.. రూ.81,397.83 కోట్లు 

బకాయి పడ్డారని లెక్కలు.. బాకీపడిన ఆ మొత్తం వడ్డీతో పాటు ఈ ఏడాది ఇవ్వాల్సినవి ఇవ్వాలని డిమాండ్‌ 

సూపర్‌ సిక్స్‌పై ప్రశ్నించినవారి నాలుక మందమా?.. చంద్రబాబు వ్యాఖ్యలపై సర్వత్రా వ్యక్తమవుతున్న అసహనం

సాక్షి, అమరావతి:‘చంద్రబాబునాయుడు అనే నేను రాష్ట్ర ప్రజలు నాపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని త్రికరణ శుద్ధితో ప్రమాణం చేస్తున్నాను. 2024లో టీడీపీ అధికారంలోకి వచ్చాక ‘‘భవిష్యత్తుకు గ్యారెంటీ’’లోని వాగ్దానాలను ఎటువంటి వివక్ష లేకుండా, నిబంధనలు విధించకుండా అమలు చేయడంతో పాటు రాష్ట్ర అభివృద్ధికి, పురోగతికి పునరంకితం అవుతానని ప్రతిజ్ఞ చేస్తున్నాను’ ఇదీ బాబు ష్యూరిటీ–భవిష్యత్తు గ్యారెంటీ పేరిట టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సంతకంతో ఆ పార్టీ జారీ చేసిన ష్యూరిటీ బాండ్‌. 

ఇందులో పథకాలను 2024 జూన్‌ (ఎన్నికల ఫలితాలు వెలువడిన నెల) నుంచే అమలు చేస్తామని కూడా ప్రత్యేకంగా పేర్కొన్నారు. ఈ బాండ్‌ పేపర్లతో ఇంటింటికీ వెళ్లిన టీడీపీ క్యాడర్‌... ఆ ఇంటిలో మొత్తం ఎందరు ఉన్నారు...? మహిళలు, విద్యార్థులు, నిరు­ద్యోగులు ఎంతమంది ఉన్నారు? అనే వివరాలు, వారి పేర్లు తీసుకుని... వీరికి ఏ పథకం కింద ఎంతెంత వస్తుంది..? అని లెక్కలేసి మరీ చెప్పారు. 

బాండ్‌ పేపర్లను మొబైల్‌ ఫోన్లకూ పంపారు. వీటిని నమ్మి ప్రజలు ఓట్లేయడంతో టీడీపీ ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం వచ్చి ఏడాదైంది. కానీ, సూపర్‌ సిక్స్‌ సహా వారు ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఏవీ అమలు కాలేదు. దీంతో ప్రతి ఇంట ఆగ్రహం వ్యక్తమవుతోంది. టీడీపీ కూటమి ప్రజాప్రతినిధులు, నాయకులను ఎక్కడికక్కడ నిలదీసేందుకు సిద్ధమవుతున్నారు. 

బాబు ష్యూరిటీ–భవిష్యత్తుకు గ్యారంటీ అంటూ ఇచ్చిన బాండ్లు మోసాలకు నకళ్లుగా మారిన వైనాన్ని ఏకరవు పెట్టేందుకు సిద్ధమవుతున్నారు. కాగా, సీఎం చంద్రబాబు మాత్రం ‘‘సూపర్‌ సిక్స్‌ పథకాలన్నీ అమలు చేసేశా..  ఎవరైనా సూపర్‌ సిక్స్‌ హామీల అమలు గురించి ప్రశ్నిõ­Ü్త వారి నాలుక మందం తప్ప మరోటి కాదంటూ’’ ముందుగానే బెదిరింపులకు దిగుతున్నారు. 

వైఎస్‌ జగన్‌ కంటే ఎక్కువ సంక్షేమం ఇస్తామని... 
వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అమలు చేస్తున్న పథకాలను కొనసాగిస్తానని, అంతకు రెండింతలు సంక్షేమం సూపర్‌ సిక్స్‌ పథకాల ద్వారా ఇస్తామంటూ ఎన్నికలకు ముందు చంద్రబాబు నమ్మబలికారు. వైఎస్‌ జగన్‌ కంటే ఎంత ఎక్కువ ఇస్తాం అనేది రసీదు రూపంలో చెప్పారు. ఇక ఈ హామీల అమలు పూచీ నాదంటూ జనసేన అధ్యక్షుడు పవన్‌ కళ్యాణ్‌ గ్యారంటీ ఇచ్చారు. 

చంద్రబాబు తానా అంటే తందానా అనే ఎల్లో మీడియా సూపర్‌ సిక్స్‌ సహా ఎన్నికల హామీలపై విస్తృత ప్రచారం చేసింది. అప్పటికీ చంద్రబాబును నమ్మి ఓట్లేస్తే చంద్రముఖిని మళ్లీ నిద్ర లేపినట్లేనంటూ వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, నాటి సీఎం వైఎస్‌ జగన్‌ ప్రజలను హెచ్చరించారు. 

కానీ.. చంద్రబాబు మాటలు, పవన్‌ కళ్యాణ్‌ గ్యారంటీలు.. ఎల్లో మీడియా కథనాలు నమ్మి ఓట్లేసి టీడీపీ కూటమిని గెలిపించారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చి ఏడాది దాటింది.. సూపర్‌ సిక్స్‌ అతీగతీ లేదు.. పైగా హామీల అమలుపై ఎవరైనా ప్రశ్నిస్తే.. ‘సంపద సృష్టించడం ఎలాగో చెవిలో చెప్పు.. సంపద సృష్టించాక సంక్షేమం ఇస్తా’ అంటూ దబాయిస్తున్నారు.   

అన్నమయ్య జిల్లా రాజంపేట నియోజకవర్గానికి చెందిన మెహరాజ్‌ బేగం షేక్‌కు ఐదేళ్లలో జరగబోయే లబ్ధికి సంబంధించి ఇచ్చిన హామీ  

‘త్రి’కరణశుద్ధిగా మాట తప్పారు.. 
సూపర్‌ సిక్స్, ఎన్నికల హామీల అమలుపై ఇంటింటికీ వెళ్లి చంద్రబాబు సంతకంతో ఉన్న బాండ్‌ పేపర్లు పంపిణీ చేసి వివరాలు నమోదు చేశారు టీడీపీ నేతలు. టీడీపీకి మద్దతు తెలుపుతున్నట్లుగా మిస్డ్‌ కాల్‌ ఇప్పించారు. వారి ఫోన్‌ నుంచి ఓటీపీ కూడా తీసుకున్నారు. 

ప్రతి ఇంటి యజమాని లేదా ఆయన భార్య ఫోన్‌ నంబరు తీసుకుని టీడీపీ మేనిఫెస్టో.కామ్‌ వెబ్‌సైట్‌లోకి ఎక్కించారు. ఎన్నికల సభల్లోనూ భారీగా ఊదరగొట్టారు. అధికా­రం­లోకి వచ్చాక ‘త్రి’కరణశుద్ధిగా మాట తప్పారు. ఈ మోసంపైనే ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. టీడీపీ కూటమి నేతలను ప్రశ్నించేందుకు ప్రతి గడప ఎదురుచూస్తోంది.

మహానాడు నుంచే మహా మోసానికి నాంది 
సార్వత్రిక ఎన్నికలకు ఏడాది ముందే.. అంటే 2023 మే 28న రాజమహేంద్రవరంలో నిర్వహించిన మహానాడు వేదికగా సూపర్‌ సిక్స్‌ హామీలను టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ప్రకటించారు. వీటితోపాటు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను ఇంటింటా ప్రచారం చేసి, తద్వారా ఒక కుటుంబానికి ఐదేళ్లలో చేకూరే ప్రయోజనంపై గ్యారంటీ ఇస్తూ బాండ్లు జారీ చేయాలని కూడా పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమానికి ‘బాబు ష్యూరిటీ–భవిష్యత్తుకు గ్యారంటీ’గా నామకరణం చేశారు. 

మహానాడు అనంతరం ఎన్నికల ప్రచారం ముగిసేవరకు నియోజకవర్గాల టీడీపీ సమన్వయకర్తలు, నాయకులు ప్రతి నియోజకవర్గంలో ఇంటింటికీ వెళ్లి.. కుటుంబసభ్యుల పేర్లు ఆరా తీసి, ‘‘టీడీపీ మేనిఫెస్టో.కామ్‌’’ వెబ్‌సైట్‌లో ఆ వివరాలు నమోదు చేశారు. ఆ తర్వాత కుటుంబ యజమాని లేదా ఆయన భార్య ఫోన్‌ నంబరు తీసుకుని టీడీపీ మేనిఫెస్టో.కామ్‌ వెబ్‌సైట్‌ ద్వారా ఓటీపీ పంపించారు. 


ఆ ఓటీపీని టీడీపీ మేనిఫెస్టో.కామ్‌ వెబ్‌సైట్‌లో నమోదు చేసి.. ఆ కుటుంబానికి సూపర్‌ సిక్స్‌ సహా వివిధ పథకాల కింద ఏటా చేకూరే లబ్ధి... ఐదేళ్లకు ఒనగూరే ప్రయోజనం ఎంతనో వివరించారు. తర్వాత టీడీపీకీ మద్దతు ఇస్తున్నట్లు వెబ్‌సైట్‌కు మిస్డ్‌ కాల్‌ ఇప్పించారు. ఆ వెంటనే.. సూపర్‌ సిక్స్‌ సహా ఎన్నికల హామీల ద్వారా చేకూర్చే ప్రయోజనానికి గ్యారంటీ ఇస్తూ వారి ఫోన్‌ నంబర్‌కు బాబు ష్యూరిటీ–భవిష్యత్తుకు గ్యారంటీ పేరుతో బాండ్లు పంపారు. 

బాండ్లను కుటుంబ సభ్యుల ఎదుటే డౌన్‌లోడ్‌ చేయించారు. వివిధ పథకాల కింద ఆ కుటుంబానికి చేకూరే లబ్ధి, ఈ హామీలను అమలు చేస్తానని త్రికరణ శుద్ధిగా ప్రమాణం చేసి చెబుతున్నానని ఆ బాండ్లలో చంద్రబాబు స్పష్టం చేశారు. సూపర్‌ సిక్స్‌ సహా హామీలన్నీ 2024 జూన్‌ నుంచే అమలు ప్రారంభమవుతుందని బాండ్లలో తేల్చిచెప్పారు.

ఇది కాదా మోసం..? 
2024 జూన్‌ నుంచే పథకాలను అమలు చేస్తామని ప్రకటించిన చంద్రబాబు... కూటమి ప్రభుత్వం వచ్చిన సరిగ్గా ఏడాది తర్వాత తల్లికి వందనం పథకం అమలు చేశారు. కానీ, ఇందులో 87,41,885 మందికి రూ.15 వేల వంతున ఇవ్వాల్సి ఉండగా 54,94,703 మందికి మాత్రమే రూ.13 వేల చొప్పున జమ చేస్తామని ప్రకటించారు. అంటే 32,47,182 మందికి ఎగనామం పెట్టి తల్లికి వందనం పథకాన్ని మహా మోసంగా మార్చారు. 

ఈ పథకంపై మీడియాతో మాట్లాడుతూ పీ–4కు ఆడబిడ్డ నిధి, స్కిల్‌ డెవలప్‌మెంట్‌కు నిరుద్యోగ భృతిని అనుసంధానం చేశానని... 20న అన్నదాత సుఖీభవ, ఆగస్టు 15 నుంచి ఉచిత బస్సు  అమలు చేస్తానని చెప్పుకొచ్చారు. ఈ ప్రకారం చూస్తే.. చంద్రబాబు మాటల్లోనే సూపర్‌ సిక్స్‌ సూపర్‌ మోసంగా మారిందని స్పష్టమవుతోంది.  

నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ మండలం దొరకొట్టాల గ్రామానికి చెందిన పసాది సాలమ్మకు 
జరగబోయే లబ్ధికి సంబంధించి కూటమి నేతలు ఇచ్చిన బాండ్‌   

ఆ బాండ్లు... మోసాలకు సాక్ష్యాలు 
ఏడాదిలో రూ.81,397.83 కోట్లు ఎగవేత  
కూటమి అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయినా ఇప్పటికీ బాండ్లలో గ్యారంటీ ఇచ్చిన హామీల మేరకు లబ్ధి చేకూరకపో­వడంతో ‘మోసపోయాం’ అంటూ ప్రతి ఇంట ప్రజలు నిట్టూర్చుతున్నారు. టీడీపీ నేతలు ఇచ్చిన బాండ్లు.. ఫోన్‌లో డౌన్‌లోడ్‌ చేసుకున్న బాండ్లను తీసుకుని.. ఏడాదిలో సూపర్‌ సిక్స్ పథకాల కింద తమ కుటుంబానికి  ఎంతమేరకు ప్రభుత్వం ఎగ్గొట్టిందో లెక్కలు వేసుకుంటున్నారు. 

⇒ సూపర్‌ సిక్స్‌లో భాగంగా.. 20 లక్షల మందికి ఉద్యోగాలు.. లేదా ఉద్యోగం వచ్చేవరకు నెలకు రూ.3 వేల చొప్పున నిరుద్యోగ భృతి ఇస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారు. తొలి ఏడాది నిరుద్యోగ భృతి జాడే లేదు. రాష్ట్రంలో 20 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు. వారికి నెలకు రూ.3 వేల చొప్పున ఏడాదికి రూ.7,200 కోట్లు బాకీ పడ్డారు. 

⇒ పీఎం కిసాన్‌ సమ్మాన్‌ పథకంతో సంబంధం లేకుండా అన్నదాత సుఖీభవ కింద ఒక్కో రైతుకు ఏడాదికి రూ.20 వేల చొప్పున పెట్టుబడి సాయం అందిస్తానని చంద్రబాబు చెప్పారు. రాష్ట్రంలో 53,58,266 మంది రైతులు ఉన్నారు. వారికి రూ.20 వేల చొప్పున ఇవ్వాలంటే ఏటా రూ.10,716.53 కోట్లు అవసరం. కానీ, తొలి ఏడాది వాటిని ఇవ్వకుండా ఎగ్గొట్టారు. 

⇒ సూపర్‌ సిక్స్‌లో ఆడబిడ్డ నిధి పథకం ఒకటి. రాష్ట్రంలో 18 ఏళ్లు నిండిన మహిళలు 2.07 కోట్ల మంది ఉన్నారు. ఇందులో 18ృ59 ఏళ్ల మధ్య వయసు వారు 1.80 కోట్ల మంది. వీరికి నెలకు రూ.1,500 చొప్పున ఏడాదికి రూ.18 వేలను ఆడబిడ్డ నిధి కింద ఇస్తానని బాబు హామీ ఇచ్చారు. మొదటి ఏడాది ఒక్క పైసా ఇవ్వలేదు. అంటే.. మహిళలకు రూ.32,400 కోట్లు బాకీపడ్డారు. 

⇒ దీపం పథకం కింద రాష్ట్రంలో 1,59,20,000 గ్యాస్‌ కనెక్షన్లు ఉన్నాయి. ఏడాదికి మూడు సిలిండర్లను ఉచితంగా ఇస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. సిలిండర్‌ ధర రూ.855. ఈ లెక్కన ఏడాదికి మూడు సిలిండర్లు ఇవ్వాలంటే రూ.4,083.48 కోట్లు అవసరం. తొలి ఏడాది ఒక సిలిండర్‌కు రూ.865 కోట్లు మాత్రమే ఇచ్చారు. ఈ ప్రకారం రూ.3,218.48 కోట్లు ఎగ్గొట్టారు.

⇒ మహిళలందరికీ ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తామనేది మరో హామీ. దీనికోసం నెలకు రూ.275 కోట్ల చొప్పున ఆర్టీసీకి ఇవ్వాలి. తొలి ఏడాది ఈ హామీ అమలు చేయలేదు. అంటే... ఉచిత బస్సు రూపంలో మహిళలకు రూ.3,500 కోట్లు ఎగ్గొట్టారు.  

⇒ 50 ఏళ్ల నిండిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన మహిళలు, పురుషులకు పింఛను ఇస్తానని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు. రాష్ట్రంలో 50 ఏళ్లు నిండిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు 20 లక్షల మంది ఉన్నారు. వారికి నెలకు రూ.4 వేల చొప్పున ఏడాదికి రూ.9,600 కోట్లు పింఛనుగా ఇవ్వాలి. కానీ.. తొలి ఏడాది ఇది ఇవ్వలేదు. రూ.9,600 కోట్లు ఎగ్గొట్టారు. 

⇒ తల్లికి వందనం పథకం కింద ఎంతమంది పిల్లలను బడికి పంపిస్తే అంతమందికి రూ.15 వేల వంతున తల్లి ఖాతాలో జమ చేస్తామని బాబు వాగ్దానం చేశారు. యూడీఐఎస్‌ఈ (యునిఫైడ్‌ డిస్ట్రిక్ట్‌ ఇన్ఫర్మేషన్‌ సిస్టమ్‌ ఫర్‌ ఎడ్యుకేషన్‌ యూడైస్‌) ప్రకారం రాష్ట్రంలో 87,41,885 మంది పిల్లలు పాఠశాలల్లో చదువుతున్నారు. రూ.15 వేల చొప్పున వారికి ఏడాదికి రూ.13,112.82 కోట్లు ఇవ్వాలి. కానీ, తొలి ఏడాది ఆ మేరకు ఇవ్వకుండా ఎగ్గొట్టారు. 

⇒ పంటల బీమా పరిహారం ఇవ్వకుండా రాష్ట్రంలోని 53 లక్షల మంది రైతులకు టోపీ పెట్టిన మొత్తం రూ.1,385 కోట్లు. ఇక మత్స్యకా­రులకు వేట నిషేధ భృతి కింద ఎగ్గొట్టిన మొత్తం రూ.265 కోట్లు. 

ఇలా ఏడాది కాలంగా టీడీపీ కూటమి ప్రభుత్వం రూ.81,397.83 కోట్లు బకాయి పడిందని ప్రజలు లెక్కలు వేస్తున్నారు. బాకీపడిన ఈ మొత్తంతో పాటు ఈ ఏడాది ఇవ్వాల్సినవి ఇవ్వాలని డిమాండ్‌ చేస్తున్నారు.

బాబూ... ఇదిగో మీరిచ్చిన బాండు..! 
ఇంటి వద్దకు వచ్చే ఎమ్మెల్యేలు, టీడీపీ నేతల నిలదీతకు ప్రజలు సిద్ధం టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది దాటింది. సూపర్‌ సిక్స్‌ సహా ఎన్నికల హామీల అమలును 2024 జూన్‌ నుంచే ప్రారంభిస్తామంటూ బాబు ష్యూరిటీ–భవిష్యత్తుకు గ్యారంటీ పేరిట ప్రతి ఇంటా ఇచ్చిన బాండ్ల మేరకు లబ్ధి చేకూరకపోవడంతో ఇంటింటా ఆగ్రహం పెల్లుబుకుతోంది. 

బాండ్లు చూపి చంద్రబాబును నిలదీయాలని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ ఇచ్చిన పిలుపుపై ఇప్పుడు ప్రతి ఇంట చర్చ సాగుతోంది. టీడీపీ నేతలు ఇచ్చిన బాండు ప్రకారం తమ ఇంటికి గత ఏడాది కాలంలో రావాల్సిన మొత్తంపై లెక్క వేసుకుని.. ఆ మొత్తాన్ని వడ్డీతో సహా చెల్లించాలని తమ ఇంటి వద్దకు వచ్చే ఎమ్మెల్యేలు, టీడీపీ నేతలను నిలదీసేందుకు సిద్ధమవుతున్నారు.    

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement