
సాక్షి, విజయవాడ: సంపద సృష్టించి, రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తానన్న చంద్రబాబు.. అప్పులు చేయడంలో రికార్డు సృష్టిస్తున్నారు. అప్పులు చేయడంతో సరికొత్త మార్గాలను వెతుకుతున్నారు. ఈ క్రమంలో అప్పుల కోసం చంద్రబాబు సర్కార్ కొత్త మార్గం ఎంచుకుంది. ఏపీ ఎండీసీ ద్వారా 9 వేల కోట్లు బాండ్లు జారీ చేయాలని నిర్ణయించింది. రాజ్యాంగ విరుద్ధమని విమర్శలొస్తున్నా వెనక్కి తగ్గని ప్రభుత్వం.. 436 మైనర్ మినరల్ ప్రాజెక్టులపై ఏపీఎండీసీకి హక్కులు ఇచ్చేసింది. క్వారీ లీజు హోల్డ్ హక్కులు ఏపీ ఎండీసీకి బదలాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
మైనింగ్ హక్కులు కూడా ఏపీఎండీసీకి కల్పిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. వాటిని చూపించి ఏపీఎండీసీ బాండ్లు జారీ చేయనుంది. రాష్ట్ర ఖజానాను తాకట్టుపెడుతున్నారని మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రైవేటు వ్యక్తులకు నేరుగా రాష్ట్ర ఖజానా నుండి వెసులుబాటు కల్పించడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారాయన.
సీఎం చంద్రబాబు పాలనలో రాష్ట్ర ఆదాయం తిరోగమనంలో ఉందని కాగ్ తేల్చేసిన సంగతి తెలిసిందే. ఒక వైపు రెవెన్యూ రాబడి తగ్గిపోతుండగా.. మరోవైపు అప్పులు భారీగా పెరిగిపోతున్నాయని స్పష్టం చేసింది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఫిబ్రవరి వరకు బడ్జెట్ రాబడులు, వ్యయాలకు సంబంధించిన గణాంకాలను కాగ్ వెల్లడించింది. చంద్రబాబు ప్రభుత్వం.. పది నెలల కాలంలో రూ.90 వేల కోట్లు అప్పులు చేసిందని పలు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
