విశాఖ: వైఎస్సార్సీపీ నేత అంబటి రాంబాబు అక్రమ అరెస్టును నిరసిస్తూ కాపు నేతలు చలో గుంటూరు కార్యక్రమం చేపట్టారు,. ఉమ్మడి విశాఖ జిల్లా వైయస్సార్సీపి కాపు నేతల ఆధ్వర్యంలో నేడు చలో గుంటూరు కార్యక్రమం చేపట్టారు. విశాఖ నుంచి భారీ ర్యాలీగా కార్లతో బయలుదేరిన వైఎస్ఆర్సిపి కాపు నాయకులు..అంబటి రాంబాబు కుటుంబ సభ్యులను కలిసి సంఘీభావం తెలపనున్నారు వైఎస్సార్సీపీ కాపు నేతలు.
దీనిలో భాగంగా అక్రమ అరెస్టులతో కాపులను చంద్రబాబు వేధిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు కాపు నేతలు. కాపు ద్రోహి చంద్రబాబు అంటూ మండిపడుతున్నారు. తిరుపతి లడ్డు, గీతం భూములు కబ్జా వంటి అంశాన్ని దృష్టి మళ్లించేందుకు కాపులపై దాడులు అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
చలో గుంటూరు కార్యక్రమంలో భాగంగా మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతూ.. ‘ మాజీ మంత్రి అంబటి రాంబాబు అక్రమ అరెస్ట్ కు నిరసనగా నేడు చలో గుంటూరు కార్యక్రమం చేపట్టామన్నారు. చలో గుంటూరు కార్యక్రమం ద్వారా కాపు నేతలు.. అంబటి రాంబాబు కుటుంబానికి సంఘీభావం తెలపనున్నట్లు వెల్లడించారు. ‘ప్రభుత్వం కుట్ర పూరితంగా వ్యవహారిస్తుంది. పార్టీలో ఎవరికి కష్టం వచ్చినా మా స్పందన ఇలాగే ఉంటుంది. అంబటి కుటుంబాన్ని పరామర్శించి ధైర్యం చెప్తాం’ అని స్పష్టం చేశారు.
కరణం ధర్మశ్రీ మాట్లాడుతూ.. ‘ ప్రశ్నించే కాపులను చంద్రబాబు టార్గెట్ చేస్తున్నారు.. అంబటిపై అక్రమ కేసులు పెట్టారు. మేమంతా అండగా ఉన్నాం’ అని పేర్కొన్నారు.


